ఒకప్పుడు చిన్న జ్వరం వచ్చినా ఎక్కడో మండల కేంద్రాల్లోని పీహెచ్సీలకో, పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకో వెళ్లాల్సి వచ్చేది. దీంతో దూర భారంతోపాటు అధిక ఖర్చు, సమయం వృథా అయ్యేది. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానల పేరుతో వైద్య సేవలను ప్రజలకు ముందుకు తెచ్చింది. అందులో భాగంగా ఒక మెడికల్ అధికారి, ఇద్దరు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచింది. జ్వరం, బీపీ, షుగర్ వంటి 14 రకాల పరీక్షలు నిర్వహిస్తూ 105 రకాల మందులను అందిస్తున్నది. ప్రతి రోజూ 50 మంది రోగులకు ఓపీ నిర్వహిస్తుండగా, తమ ముంగిటికే ప్రభుత్వ వైద్యం రావడంతో గ్రామాలు, బస్తీల్లో ఉండే పేదలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 326 పల్లె, 12 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకు వచ్చారు.
– కరీంనగర్, జూలై 3 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : దూరం వెళ్లలేని, రవాణా ఖర్చులు కూడా భరించలేని నిరుపేదల చెంతకే వైద్య సేవలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ప్రతి మండలానికి ఒక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఉండగా, వీటి కింద కనీసం 20కిపైగా గ్రామాలున్నాయి. వీటి పరిధిలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. పీహెచ్సీలో వైద్యులు, ఉప కేంద్రాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు సేవలు అందిస్తున్నారు. అయితే, పీహెచ్సీల్లో వైద్య సేవలు పొందాలంటే మండల కేంద్రాలకు వెళ్లాల్సిందే. లేదంటే జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానకు వెళ్లకు తప్పదు. చిన్న జ్వరం వచ్చినా, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి గాయాల పాలైనా వైద్యం కోసం దూరంగా ఉన్న మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిందే. సమయం అనుకూలించక చాలా మంది ప్రజలు దూరంగా ఉన్న ప్రభుత్వ వైద్య కేంద్రాలకు వెళ్లలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో పల్లె దవాఖానల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆరోగ్య విధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 326 పల్లె, 12 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది. కరీంనగర్ జిల్లాలో 139 ఉప కేంద్రాలు ఉండగా ప్రస్తుతానికి 97 పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది. ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశ కార్యకర్తలను వీటిలో అందుబాటులో ఉంచి స్థానిక ప్రజలకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోంది.
నూతన విధానంతో సత్ఫలితాలు
పల్లె, బస్తీ దవాఖానల ఏర్పాటు సత్ఫతాలనిస్తోంది. ప్రతి పల్లె దవాఖానలో రోజుకు 25 నుంచి 30 మంది ప్రజలు ఓపీ చూపించుకుంటున్నారు. చిన్న జ్వరం, జలుబు, తదితర రుగ్మతలకు ఇక్కడ వైద్యం అందుతోంది. మొత్తంగా 14 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పిల్లలకు బుధ, శనివారాల్లో వైద్యాధికారి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్తులకు ఇక్కడే పరీక్షలు నిర్వహించి, తగిన మందులు అందిస్తున్నారు. నవజాత శిశువులు, కౌమార వయస్సు పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. పల్లె దవాఖానా పరిధిలో కుటుంబ నియంత్రణ పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. చెవి, ముక్కు, గొంతు వ్యాధులు, కంటి సమస్యలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన చికిత్సలు కూడా అందిస్తున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి అవసరమైన దవాఖానాలకు సిఫారసు చేస్తున్నారు. 105 రకాల మందులు ఇక్కడే ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటల నుంచి 3.30 వరకు పల్లె దవాఖానాలు సేవలు అందిస్తుండగా, ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఓపీ పెరుగుతోంది
రోజు రోజుకూ ఓపీ పెరుగుతోంది. వివిధ రకాల జబ్బులతో పేషెంట్స్ వస్తున్నారు. చిన్న చిన్న సమస్యలతో వచ్చే వారికి ఇక్కడే సేవలు అందిస్తున్నాం. బీపీ, షుగర్ చెక్ చేసి అవసరమైన వారికి మందులు ఇస్తున్నాం. గర్భిణులకు పరీక్షలు చేస్తున్నాం. పిల్లలకు టీకాలు కూడా వేస్తున్నాం. రోజుకు 20 నుంచి 25 మంది పేషెంట్లు వస్తున్నారు. మా పల్లె దవాఖాన పరిధిలో ఉన్న అన్ని గ్రామాల నుంచి వస్తున్నారు. అవసరమైన వారిని చామన్పల్లిలోని పీహెచ్సీకి పంపిస్తున్నాం. అక్కడ కూడా పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు.
– డాక్టర్ కే శోభ, దుర్శేడ్ పల్లె దవాఖాన
నొప్పి గోలీలు ఇచ్చిండ్రు
దవాఖాన మా ఇంటి ముందటనే పెట్టిండ్రు. మొన్న నొప్పి గోలీలు ఇచ్చిండ్రు. మంచిగ పనిచేసినయ్. ఒడ్సిపోతే మల్లచ్చిన. మంచిగ సూత్తండ్రు. నొప్పుల గోలీలకు ప్రైవేట్ల నెలకు బగ్గనే పైసలైతుండే. ఇప్పుడు ఉత్తగనే ఇత్తండ్రు. సంతోషంగున్నది. దగ్గచ్చినా, తుమ్మచ్చినా కన్నారం పొయ్యెటోళ్లు ఇప్పుడు ఇక్కన్నే చూపించుకుంటండ్రు.
– బెజ్జంకి వెంకటమ్మ
దెబ్బతాకితే మంచిగ చూసిండ్రు
మొన్న అడ్డంబడితే దెబ్బతాకింది. ఈడికే అచ్చిన. మంచిగ చూసిండ్రు. మంచి మందులిచ్చిండ్రు. బలానికి సుతం మందులిచ్చిండ్రు. నాకు దెబ్బతాకితే కన్నారం బోయి చూపిచ్చుకచ్చుకుందు. ఈన్నే దవాఖాన ఉన్నదని సిస్టర్లు చెప్పి పట్టుకచ్చి మరీ చూపిచ్చిండ్రు. ముందుగాలు నమ్మికం అనిపియ్యలే. మందులేసుకున్న. మంచిగనిపిచ్చింది..
– తంగళ్లపల్లి లింగమ్మ
నెల నెలా ఇక్కడనే చూపించుకుంటున్న
నెల నెలా ఇక్కన్నే చూపించుకుంటున్న. ఇక్కడ దవాఖాన పెట్టినంక నాలాంటి గర్భిణులు కరీంనగర్ పొయ్యే బాధ తప్పింది. ఎసోంటి సమస్య ఉన్నా చెప్పుకునెతానికి ఇక్కడ డాక్టర్ ఉన్నరు. మంచిగ చూస్తున్నరు. ఇప్పుడు నేను అవుసరం అయితెనే కరీంనగర్ పోతున్న. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కన్నే చూపించుకుంటున్న. చాలా సంతృప్తిగా ఉంది. – కాసిపాక అర్చన, గర్భిణి పెయ్యి తింపుతందని అచ్చిన పెయ్యి తింపుతందని ఈ దవాఖానకచ్చిన.. బీపీ చెక్ చేసిండ్రు. ఉన్నదని చెప్పిండ్రు. మందులు సుతం ఇచ్చిండ్రు. మూడు రోజులు ఏసుకున్నంక మల్ల రమ్మన్నరు. ఇంకోసారి చెక్ చేస్తరట. ఇసోంటి చిన్న సమస్యకే ఇన్నొద్దులు కరీంనగర్ పోతుంటిమి. ప్రైవేట్ దవాఖాన్ల పైసలు పెట్టి చూపించుకుందుము. ఇప్పుడు ఊళ్లెనే దవాఖాన అయినంక మంచిగ అనిపిస్తంది.
– బుర్ర తిరుపతి
మంచిగ సూత్తండ్రు
దవాఖాన పెట్టిన మొదట్ల ఎవ్వలు రాలే. ఇప్పుడు చానా మందే అచ్చి చూపిచ్చుకుంటండ్రు. జరమచ్చినా, కాళ్లు రెక్కలు నొచ్చినా మా అసోంటి ముసలోళ్లు ఈడికే అత్తండ్రు. మంచిగ చూపించుకొని మందులు తీస్కపోతుండ్రు. పనిసుతం చేత్తన్నయి. నాకు కాల్జేతులు గుంజుతున్నయని అచ్చిన. మందులిచ్చిండ్రు. నమ్మికంతోని ఏసుకుంట.
-భక్తు హన్మండ్లు