TUWJ (IJU) | జగిత్యాల, జూలై 14 : జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 9న నిర్వహించిన టీయుడబ్ల్యూజే, ఐజేయు జిల్లా శాఖ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జే సురేంద్ర కుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండీ ఇమ్రాన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాలాచారి, రాష్ట్ర మీడియా సెల్ సభ్యులు టీవీ సూర్యం, దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులు ఆదిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా నూతన కార్యవర్గ సభ్యులు పని చేయాలని సూచించారు.
జర్నలిస్టుల వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవడమే కాకుండా కొంతమంది జర్నలిస్టులు మృతి చెందిన సంఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబాల కోసం కోసం ఆరోగ్య భీమా, జీవిత బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి ఆ దిశగా నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. జిల్లా కార్యవర్గ సమావేశాలను క్రమం తప్పకుండా ప్రతీ నెల ఏదో ఒక మండల కేంద్రంలో నిర్వహిస్తూ స్థానిక జర్నలిస్టుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు.
జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల వరకే విభేదాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం అందరం కలిసికట్టుగా ఉండి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రతీ జర్నలిస్టులకు యూనియన్ నుండి గుర్తింపు కార్డులతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ ఆలీ, ఆల్లె రాము, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, సహ కార్యదర్శులు చంద్రశేఖర్, చింతల నరేష్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.