చేపలే చేపలు.. పల్లె లేదు. పట్టణం లేదు.. ఎక్కడ చూసినా మత్స్యాలే. అన్నీ రవ్వులు, బొచ్చెలు, బొమ్మెలు, జెల్లలే. ఒక్కోటి 2 నుంచి 10 కిలోల బరువు మీదే. నాడు వట్టిపోయి.. నేడు పుష్కలంగా నీళ్లున్న చెరువులు, కుంటలు, జలాశయాల్లో మత్స్య సంపదిది. మత్స్యకారుల సంక్షేమంపై రాష్ట్ర సర్కారు సంకల్పానికి సాక్ష్యమిది. మత్స్య సమీకృత అభివృద్ధి పథకం కింద ఏయేటికాయేడు జలవనరుల్లో ఉచితంగా చేప పిల్లలు పోస్తుండగా, భారీగా బరువు పెరిగి పుష్కలమైన చేపల పంట చేతికొస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఏడేండ్ల్లలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫిష్ హబ్గా మారిపోగా, మత్స్యకారులకు భరోసా ఇస్తున్నది. ఇందుకు ఇటీవలి వర్షాలకు రాశుల కొద్ది చేపలు దొరకడమే నిదర్శనంగా నిలుస్తున్నది. వాగులు, వంకల్లో భారీగా ఎదురెక్కిరావడంతో మత్స్యకారులే కాదు.. స్థానిక యువకులు సరదాగా పట్టుకుంటూ అక్కడికక్కడే తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
– మానకొండూర్/ కొత్తపల్లి, జూలై 30
మానకొండూర్/ కొత్తపల్లి, జూలై 30 : స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు, అన్ని కులాలు, చేతి వృత్తులకు చేయూతనిస్తున్నది. మత్స్యకారుల కుటుంబాలకు చేతినిండా పనికల్పించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించింది. పూడిక మట్టితో నిండిపోయిన చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ పథకంలో పూడిక తీసి పునరుద్ధరించి, పుష్కలంగా నీరు నిలిచేలా తయారు చేసింది. ఈ క్రమంలో మత్స్య సమీకృత అభివృద్ధి పథకాన్ని చేపట్టి ఏటా ఉచితంగానే కోట్లాది చేప విత్తనాలను చెరువులు, జలాశయాల్లో పోస్తుండగా, పథకం ఫలించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఊహించని విధంగా మత్స్య సంపద చేతికివస్తున్నది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కూరగాయల ధరల కంటే చేపల రేట్లే నయమని చెప్పాలి. కూరగాయలు ఏది కొన్నా కిలో రూ.150 మీదే ఉంటున్నయ్. కానీ, కిలో చేపలు రూ.100 నుంచి రూ.150 మధ్యే దొరుకుతున్నయ్. వారంలో మూడు రోజులకు పైగా ఇంట్లో చేపల కూరనే చేసుకుంటున్నం. ఆరోగ్యం పరంగా చూస్తే చికెన్, మటన్ కంటే చేపలు ఎంతో మేలు. అందుకే క్రమం తప్పకుండా తింటున్నాం.
– రాజు, కొనుగోలుదారుడు, కరీంనగర్
మా మానకొండూర్ చెరువుకట్ట వద్ద ప్రతిరోజూ చేపల అమ్మకాలు జరుగుతున్నయ్. గ్రామస్తులే కాకుండా రహదారిపై వెళ్లే వాహనదారులు సైతం ఇక్కడ ఆగి తాజా చేపలను కొనుక్కెళ్తున్నరు. మామూలు రోజులకంటే ఇటీవల కురిసిన వర్షాలకు చేపల విక్రయాలు పెరిగినయ్. మత్స్యకారులకు చేతినిండా ఉపాధి దొరుకుతుంది. గతంలో మా చెరువులో అంతగా చేపల సంపద ఉండేది కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా చేప పిల్లలు ఇస్తుండడంతోనే పుష్కలంగా చేపలు ఉన్నయ్.
-గొల్ల శ్రీనివాస్, మత్స్యపారిశ్రామిక సంఘం అధ్యక్షుడు, మానకొండూర్
నేను ఓపని మీద మానకొండూర్ వచ్చిన. ఇక్కడి చెరువు వద్ద చేపలు అగ్గువకే అమ్ముతున్నరని తెలిసి ఆగిన. కిలోల లెక్క కాకుండ చేప సైజ్ను చూసి అమ్ముతున్నరు. నాకు రూ.100కే కిలోన్నర చేప ఇచ్చిన్రు. ఇదే బయట అయితే రూ.250 దాకా అవుతుండె.
– పంగ భూమయ్య, అల్గునూర్
ఇక్కడ అమ్ముతున్న చేపలు తాజాగా ఉన్నయ్. మార్కెట్లో కొన్న చేపలు ఎక్కడ పట్టినవో తెలువది. మళ్లీ ఎప్పుడు పట్టారో.. ఫ్రెష్షో కాదో కూడా తెలువది. కానీ, ఇక్కడ అటు చెరువుల చేపలు పట్టి.. ఇటు కట్టమీద అమ్ముతున్నరు. తక్కువ ధరకే పెద్ద చేప వచ్చింది. చాలా మంచి టేస్టు ఉంటది. ఇంటికెళ్లి కూర చేసుకొని తినుడే.
– రామమూర్తి, అల్గునూర్
తొమ్మిదేండ్ల క్రితం వరకు ఎండకాలం వస్తే చెరువులు, కుంటల్లో నీరు కనిపించేది కాదు. అందుకే చేపల పెంపకం కూడా పెద్దగా ఉండేది కాదు. ఓ వైపు చెరువులను పునరుద్ధరించడం, వానాకాలంలో చేప విత్తనాలు ఉచితంగా ఇవ్వడంతో మత్స్యకారులంతా సంబురంగా పోశారు. ఇంకా కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపుతుండడంతో నీటి వనరుల్లో చేపలు మంచిగా ఎదుగుతున్నాయి. ఒక్కొక్కటి కిలో నుంచి పది కిలోల దాకా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గతంలో నీటి సదుపాయం కరువై, ఉపాధి లేక ఇతర మార్గాలు చూసుకున్న వారంతా ఆరేడేండ్లుగా చెరువులు, కుంటల వద్దే చేపలు పడుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. అప్పటి నుంచే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లకు చేపలు భారీగా వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ ఫిష్ మార్కెట్, కశ్మీర్గడ్డ మార్కెట్లలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇంకా కొందరు మానకొండూర్ చెరువుకట్ట, ఎల్ఎండీ రిజర్వాయర్ కట్ట కింద విక్రయిస్తుండగా, మరికొందరు హోల్సేల్గా అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు.
ఇటీవలి వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, జలవనరుల్లోని చేపలు ఎదురెక్కి వస్తున్నాయి. దీంతో మత్తళ్ల వద్ద మత్స్యకారులకు పుష్కలంగా చేపలు దొరుకుతున్నాయి. ఒక్కోటి 2 నుంచి 10 కిలోల మీదనే పడుతున్నాయి. రెండ్రోజుల కింద ఏ చెరువు వద్ద చూసినా చేపల రాశులే కనిపించాయి. సాధారణ రోజులతో పోల్చితే రవ్వు, బొచ్చె రకాలు కిలోకు రూ.100 లోపే విక్రయిస్తున్నారు. చెరువులు, కుంటల గట్లపై అమ్మకాలు సాగిస్తుండగా, ఎన్నడూ లేనివిధంగా ఉపాధి దొరుకుతుండడంతో మత్స్యకార కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. కాగా, పలుచోట్ల చెరువులు, కుంటల మత్తళ్లు, కల్వర్టుల వద్ద మత్స్యకారులతోపాటు చూసేందుకు వచ్చిన స్థానిక యువకులూ చేపలు పట్టారు. వారు సైతం విక్రయాలు చేపట్టారంటే చేపలు ఎంతలా ఎదురెక్కి వచ్చాయో అర్థమైపోతున్నది.
నేను రాంనగర్ మార్కెట్లో చేపలు అమ్ముతుంటా. వ్యాపారం బాగుంది. పది రోజులుగా మరీ ఎక్కువగా జరుగుతున్నది. భారీ వర్షాలతో జలాశయాలు, చెరువుల్లో పుష్కలంగా చేపలు దొరుకుతుండడం, ఫ్రెష్గా ఉంటుండడంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో వస్తూ చేపలు కొంటున్నారు. ఉదయమే కాదు మత్య్సకారులు సాయంత్రం పూటా చేపలు తీసుకువస్తున్నారు. గతంలో మనదగ్గర ఇంతలా చేపల విక్రయాలు జరిగేవి కావు. మార్కెట్కు అధికంగా చేపలు వస్తుండటంతో ధరలు సైతం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయి. గతంలో రవ్వు, బొచ్చె కిలోకు రూ.150 నుంచి రూ.200 దాకా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం రూ.100కే కేజీ ఇస్తున్నాం.
– యాదగిరి, చేపల వ్యాపారి, కరీంనగర్
భారీ వర్షాలతో చల్లగా మారిన వాతావరణంలో చేపల కూర తినడం భలే మజాగా ఉంటుంది. నేను ఎప్పుడూ రాంనగర్ ఫిష్ మార్కెట్లోనే కొంటుంటా. గతంలో కంటే ఇప్పుడు చాలా ప్రెష్ చేపలు దొరుకుతున్నయ్. మార్కెట్లోనే కాదు చెరువులు, కుంటల వద్ద కూడా అమ్ముతున్నరు. అప్పుడప్పుడూ జలాశయాల వద్దకు వెళ్లి కొనుక్కుంటా.
– పర్వేజ్, కొనుగోలుదారుడు, కరీంనగర్