కరీంనగర్, మే 12 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలు తగ్గిన తర్వాత యాసంగి ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యే క శ్రద్ధతో కరీంనగర్లో ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ప్రతి రోజు జిల్లా అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో..? పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. మిల్లర్లతో మాట్లాడుతూ ఎప్పటికపుడు ధాన్యం మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కూడా తరుచూ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కొనుగోళ్లలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే ప్రత్యక్షంగా వెళ్లి పరిష్కరిస్తున్నారు.
ఇప్పటికే 1.07లక్షల మెట్రిక్ టన్నులు
అకాల వర్షాలు తగ్గిన తర్వాత ధాన్యంలో తేమ శాతం తగ్గింది. దీంతో ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిజానికి ఏప్రిల్ 15 నుంచే జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆ తర్వాత వరుసగా వడగండ్లు, అకాల వర్షాలు కురిసిన నేపథ్యంలో ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉన్నందున కొనుగోళ్లు కొంత మందగించాయి. అకాల వర్షాలు తగ్గిన వారం నుంచి కొనుగోళ్లు పుంజుకున్నాయి. కరీంనగర్ జిల్లాలో 353కేంద్రాలు ఏర్పాటు చేసి 4.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఈ మేరకు కొనుగోళ్లు పుంజుకున్న వారం పది రోజుల్లోనే 1,07,849.080 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. గతేడాది ఇదే రోజు వరకు కేవలం 72,676.780మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నా రు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి అదనంగా 35,172.300 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గతేడాది ఇప్పటి వరకు 10,308 మంది రైతుల నుంచి రూ.142.45 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తే ఈ ఏడాది 15,654 మంది రైతుల నుంచి రూ.222.54 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతమైంది. కోతలు ముమ్మరం కాగా, ధాన్యం సేకరణ ప్రక్రియ ఊపందుకున్నది. ఊరూరా ఏర్పాటు చేసిన సెంటర్ల ద్వారా ఇప్పటికే 1.07 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. గతేడాది ఇదే రోజున కేవలం 72,676.780 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనగా, నిరుడితో పోలిస్తే ఈ సారి శుక్రవారం వరకు 35,172.300 మెట్రిక్ టన్ను లు అధికంగా సేకరించారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక శ్రద్ధతో శరవేగంగా కొనుగోళ్లు సాగుతుండగా, కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చెల్లింపులు వేగంగా జరిగేలా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్న అధికారులు, ఈ నెలాఖరుకల్లా కొనుగోళ్ల ప్రక్రియ ముగిసే అవకాశముందని చెబుతున్నారు.
ఏజెన్సీల వారీగా కొనుగోలు వివరాలు