Co-option Elections కోల్ సిటీ, ఏప్రిల్ 11 : రామగుండం నగర పాలక సంస్థలో కో- ఆప్షన్ (నామినేటెడ్) పదవుల భర్తీకి అంతా సిద్ధమైంది. అందుకోసం శాస్త్రీయ ముసాయిదా నోటిఫికేషన్ తయారైంది. ఈమేరకు రెండు రోజుల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముహూర్తం ఖరారైంది. దీనితో ఆశావహుల్లో ఎడెతగని ఉత్కంఠతో రాజకీయం ఒక్కసారి గా వేడెక్కింది. ఐతే పాత పద్ధతిలోనే కో -ఆప్షన్ పదవులను ఐదింటికే పరిమితం చేయడంతో నిరాశే వ్యక్తమవుతోంది. కార్పొరేషన్ ఎన్నికల అనంతరం పాలక వర్గం ఏర్పాటయ్యాక రెండు నెలల్లో కో-ఆప్షన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
2019 మున్సిపల్ చట్టం, 2020 మార్చి 16న విడుదలైన జీవో నం.57, 58 ప్రకారంగా కార్పొరేషన్లో ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు సీడీఎంఏ టీకే శ్రీదేవి (ఐఏఎస్) ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇప్పుడు రామగుండం నగర పాలక కమిషనర్ సైతం నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం చేసినట్లు తెలిసింది. కాగా బల్దియా పునర్విభజనతో రామగుండంలో 60 డివిజన్లకు పెరిగింది. దీనితో కో-ఆప్షన్ పదవులు సైతం 10 వరకు పెరగవచ్చని ప్రచారం జరిగింది. నిన్నటి మున్సిపల్ ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే చాలా మంది అభ్యర్థులకు కో-ఆప్షన్ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో పోటీ నుంచి తప్పుకున్నారు.
తీరా ఐదింటికే పరిమితం కావడంతో చాలా మందికి మళ్లీ భంగపాటు తప్పడం లేదనిపిస్తోంది. దీంతో కో-ఆప్షన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఐదుగురిని మినహాయిస్తే అదే ధీమాతో ఉన్న మిగతా వారిని ఏలా బుజ్జగిస్తారన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది నిరాశతో ఉండగా, ఈ నేపథ్యంలో ఎన్నిక సవ్యంగా జరగకపోతే పార్టీలో భేదాభిప్రాయాలు పొడచూపే పరిస్థితి లేకపోలేదు. రామగుండంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారుతున్నాయి.
అర్హులు ఎవరంటే…?
కాగా, జీవో ప్రకారం ఐదుగురు కో ఆప్షన్ సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఉండాలి. వీరిలో ఒకరు జనరల్ కేటగిరి మరొకరు ఏదైనా మైనార్టీ నుంచి ఉంటారు. మిగతా ముగ్గురిలో మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ పరిపాలనపై ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి. లేదంటే మూడు సార్లు కార్పొరేషన్లకు న్యాయ సేవలందించి ఉండాలి. రిటైర్డు మున్సిపల్ అధికారులు కూడా అర్హులే. నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్ల పరిశీలనకు రెండు మూడు రోజులు వ్యవధి అనంతరం మేయర్, కార్పొరేటర్లు ఓటు ద్వారా ఎన్నుకుంటారు. కార్పొరేటర్లతో సమానంగా కౌన్సిల్ సమావేశాలకు హాజరుకావచ్చు.. అదే విధంగా వీరికి గౌరవ వేతనం కూడా ఉంటుంది.