ఎండలు భగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉక్కపోతను భరించలేని జనం ఇండ్లల్లో చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు రికాం లేకుండా వాడుతున్నారు. మరోవైపు ఫ్రిజ్లు వినియోగిస్తున్నారు. దీంతో కరెంట్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. విద్యుత్ వినియోగం తీవ్రస్థాయికి చేరింది. అయినా ట్రాన్స్కో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నది. ఎక్కడా సమస్య తలెత్తకుండా పర్యవేక్షిస్తూ, డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నది.
కరీంనగర్ ముకరంపుర, మే 13: ఒక్కసారిగా పెరిగిన ఎండతీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి చీకటి పడేదాకా భానుడు ప్రతాపం చూపుతుండడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఇండ్లల్లో చల్లదనం కోసం ఏసీలు, ఫ్రీజ్లు, కూలర్లను విరివిగా వినియోగిస్తున్నారు. ఒకవైపు యాసంగి వరికోతలు పూర్తయినందునా సాగుకు కరెంట్ వాడకం పూర్తిగా తగ్గిపోయింది. కానీ, గృహ విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నది. ఎండలు దంచి కొడుతుండడంతో ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి నెలకొననున్నది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు అంతా సిద్ధ్దంగా ఉన్నారు.
కరీంనగర్ సర్కిల్ పరిధిలో మొత్తం 5.36 లక్షల సర్వీసులు ఉండగా, అందులో గృహ విద్యుత్ సర్వీసులు 3.69లక్షలు, వ్యవసాయ కనెక్షన్లు 1,00,509 ఉన్నాయి. జిల్లాలో ఈ నెల 10న విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే, డే కోటా 6.50మిలియన్ యూనిట్లకు గాను వినియోగం 5.483(మి.యూ)గా నమోదైంది. జిల్లాకు ఈ నెల కోటా 201.53 (మి.యూ) కేటాయించారు. గతేడాది మే నెల కోటా 178.94(మి.యూ) ఉండగా, డే కోటా 5.77మిలియన్ యూనిట్లుగా ఉన్నది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం నెల వారీ కోటాతోపాటు డే కోటా కూడా పెరిగింది. కాగా ఈ నెల ఒకటిన వినియోగం 3.972 (మి.యూ) ఉండగా, 10వ తేదీ నాటికి 5.483(మి.యూ)కు చేరింది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ వినియోగం మరింత పెరగనున్నది.
ఏప్రిల్ చివరి నాటికే యాసంగి సీజన్కు సంబంధించిన పనులు పూర్తవగా… వ్యవసాయానికి విద్యుత్ వాడకం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా పడిపోయింది. కానీ, ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ముఖ్యంగా మధ్యాహ్నం 12గంటల నుంచి మూడు గంటల మధ్యలో ప్రభావం అధికంగా ఉంటున్నది. గరిష్ఠ ఊష్ణోగ్రతలు 42డిగ్రీలు మించి నమోదవుతున్నాయి. వివిధ పనులు, అవసరాలపై బయటకు వచ్చిన జనం పగటిపూకళ్లా ఇళ్లకు చేరుకుంటున్నారు. చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్(ఏసీ)లు, కూలర్లనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సగటునా ఇంటికో ఏసీ, లేదా కూలర్లను వాడుతుండడంతో విద్యుత్ వాడకం పెరుగుతున్నది.
ఎండ తీవ్రతతో కరీంనగర్ జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో కరెంట్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అయినప్పటికీ సరఫరాలో ఇబ్బంది తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశాం. ఓవర్లోడ్ ఉండే ప్రాంతాలను గుర్తించి అదనపు ట్రాన్స్ఫార్మర్లను బిగించాం. గ్రామాల్లో సర్పంచ్ల సహకారంతో ట్యాంకర్ల ద్వారా ఎర్త్పిట్లలో నీటిని పోస్తున్నాం. సబ్స్టేషన్లలో బోర్లు వేయించాం. లేనిచోట్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం.
– వీ గంగాధర్, ఎస్ఈ-కరీంనగర్ సర్కిల్