అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీ, వ్యవసాయశాఖ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. జరిగిన పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు మనోధైర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ కష్టకాలంలో పార్టీ నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పంట చేలను పరిశీలించి బాధిత రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు.
– రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షాలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రి కేటీఆర్ చలించి పోయారు. పంట చేతికొచ్చే వేళ అకాల వర్షాలు కురువడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు. రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇటీవల సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధిత రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉందని, కేసీఆర్ అండగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రానున్న ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీ, వ్యవసాయశాఖ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.