గురువారం అర్ధరాత్రి గాలి దుమారం మామిడి రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ఏడు ఒకపక్క నాణ్యత బాగా లేక, మరోపక్క మంగు ఆశించడంతో 50 శాతం నష్టంలో కూరుకుపోగా, తాజాగా, వీచిన దట్టమైన గాలి భారీగా మామిడి కాయలను నేలరాల్చి కోలుకోకుండా చేసింది. ముఖ్యంగా మామిడి తోటలకు నిలయమైన జగిత్యాల జిల్లాలో భారీగా నష్టపరిచింది. ఒక్క ఈ జిల్లాలోనే 9402 హెక్టార్లలో నష్టం వాటిల్లగా, అత్యధికంగా రాయికల్ మండలంలో 2899 హెక్టార్లలోని తోటల్లో కాయలు కుప్పలు తెప్పలుగా నేలరాలాయి. పెద్దపల్లి జిల్లాలోనూ 2208 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వచ్చింది.
– జగిత్యాల, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): వీచిన దట్టమైన గాలులతో ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు, ఓదెల, సుల్తానాబాద్ మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. 508 మంది రైతులకు చెందిన 606 ఎకరాల వరి, 566 మంది రైతులకు చెందిన 817 ఎకరాల మక్క, 1582 మంది రైతులకు చెందిన 2208 ఎకరాల మామిడి పంటలకు నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే జగిత్యాల జిల్లాలో గురువారం రాత్రి బలమైన గాలుల బీభత్సంతో 9402 హెక్టార్లలో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. బలంగా నేలపై పడడంతో కాయలు పగిలి మక్కేయడానికి, ఊరగాయలు పెట్టడానికి పనికి రాకుండా పోయాయి. జిల్లాలో అత్యధికంగా రాయికల్ మండలంలో 2899 హెక్టార్లలో మామిడి పంటకు నష్టం వాటిల్లగా, మల్లాపూర్ మండలంలో 1002, కోరుట్ల మండలంలో 1341, మెట్పల్లి మండలంలో 371, ఇబ్రహీంపట్నం మండలంలో 150, మేడిపల్లి మండలంలో 1506, మల్యాల మండలంలో 1071, కొడిమ్యాల మండలంలో 16, జగిత్యాల రూరల్ మండలంలో 865, జగిత్యాల అర్భన్ మండలంలో 29, సారంగాపూర్ మండలంలో 74, బీర్పూర్ మండలంలో 78, బుగ్గారం మండలంలో 142, ధర్మపురి మండలంలో 114, ఎండపల్లి మండలంలో 72, గొల్లపల్లి మండలంలో 366, పెగడపల్లి మండలంలో 170, వెల్గటూర్ మండలంలో 240 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. మరోవైపు కరీంనగర్ జిల్లాలోనూ పలుచోట్ల గాలిదుమారం బీభత్సం సృష్టించింది.
రైతులను ఆదుకుంటాం
ఈదురుగాలులతో పంట లు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మామిడితోపాటు నువ్వు, వరి, తదితర పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని, ఈ విషయా న్ని వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్రావు, కలెక్టర్ యాస్మిన్బాష దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పా రు. క్షేత్ర స్థాయిలో నష్టాన్ని పరిశీలించి వివరాలను సేకరించాలని స్థానిక వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను ఫోన్లో ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పంట నష్టంపై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
ప్రాథమికంగా గుర్తించి నివేదించాం
జగిత్యాల జిల్లాలో గురువారం రాత్రి బలంగా వీచి న గాలులతో మామిడి కాయలు ఎక్కువ మొత్తం లో నేల రాలాయి. ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం జిల్లాలోని అన్ని మండలాల్లోని మామిడి తోటలను పరిశీలించాం. ప్రాథమిక అంచనాలో 9402 హెక్టార్లలో నష్ట పోయినట్లు ప్రాథమికంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం.
– ప్రతాప్సింగ్, జగిత్యాల జిల్లా ఉద్యానశాఖ అధికారి