పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, ఆరోగ్యానికీ అధిక ప్రాధాన్యమిస్తున్నది. వైద్యరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యంతో భరోసా ఇస్తున్నది. దవాఖానాల్లో ఆధునిక వసతులు కల్పించడమే కాదు అవసరమైనచోట కొత్త హాస్పిటళ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కోరుట్ల పట్టణం ఐబీ రోడ్డులో రూ.16.80 కోట్ల వ్యయంతో సకల హంగులు, అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించిన వంద పడకల వైద్యశాల ప్రారంభోత్సవాకి ముస్తాబైంది. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చేతులమీదుగా ఆరంభమై సేవలు అందుబాటులోకి రాబోతుండగా, పట్టణ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
– కోరుట్ల, అక్టోబర్ 5
సమైక్య పాలనలో దవాఖానల పరిస్థితి అధ్వానంగా ఉండేది. వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతులు, మందులు, పరికరాల కొరత కారణంగా ప్రజలు ప్రభుత్వ వైద్యశాలలంటేనే వణికిపోయేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యమే లక్ష్యంగా వైద్యరంగానికి పెద్దపీట వేసింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో కోట్లాది నిధులతో దవాఖానలను బలోపేతం చేసింది. జిల్లా దవాఖాన నుంచి మొదలు పీహెచ్సీలు, సీహెచ్సీల దాకా ఆధునిక సౌకర్యాలు కల్పించడమే కాదు అవసరమైన చోట కొత్త దవాఖానలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కోరుట్లలో నూతనంగా నిర్మించిన వంద పడకల దవాఖాన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
కోరుట్ల పట్టణంలో సామాజిక ఆరోగ్య కేంద్రం చాలా ఏండ్ల క్రితం ఏర్పాటైంది. ఇన్నాళ్లూ 30 పడకలతో సేవలందిస్తూ ఉన్నది. అయితే సర్కారు వైద్యం పెరిగిన నమ్మకంతో రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండగా, దవాఖాన స్థాయిని పెంచాలని పట్టణ ప్రజలు పదేండ్లుగా కోరుతూ వస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో వందపడకలకు విస్తరిస్తామని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రత్యేక చొరవ చూపారు. ఆయన విజ్ఞప్తి మేరకు వంద పడకల దవాఖానగా ఆప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన నిధులు కేటాయించింది. ఈ క్రమంలో పట్టణంలోని ఐబీ రోడ్డులో వంద పడకల దవాఖానను అత్యాధునికంగా నిర్మించారు. రూ.16.80 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మించారు. దవాఖానలో ఆధునిక వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేశారు.
వంద పడకల దవాఖానతో ఇప్పుడున్న వైద్య సిబ్బంది ఐదు రెట్ల మేర పెరుగనున్నారు. దాదాపు ఇరవై మంది వరకు స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు, మాట్రన్, ఆరుగురు ల్యాబ్ స్టాఫ్, సూపర్వైజర్ నియమితులవుతారు. ఆర్ఎంవో, ఇద్దరు సివిల్ సర్జన్లు, రెండు డిప్యూటీ సర్జన్లు, అదనంగా గైనకాలజిస్ట్లు నియమితులవుతారు. డెంటల్, ఆర్థో, పిల్లల వైద్య నిపుణులు, రెడియోలాజిస్ట్, పేథోలాజిస్ట్, పిజియోథేరఫీ, రెడియోలజిస్ట్, అనస్థీషీయా, ఈఎన్టీ, కంటి వైద్యులు వస్తారు. ఇప్పటికే డయాలసిస్ యూనిట్ ద్వారా నిత్యం మూడు షిప్టుల్లో ఐదు మిషన్ల ద్వారా కిడ్నీ రోగులకు సేవలు అందుతున్నాయి.
పది పడకలతో ప్రారంభమైన కోరుట్ల వైద్యశాల, 30 ఏండ్లలోనే వంద పడకలుగా రూపాంతరం చెందడం పట్టణవాసుల భాగ్యంగా చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లాలోనే రెండో పెద్ద దవాఖానగా నిలుస్తున్నది. ప్రస్తుతం జిల్లా జిల్లా ప్రధాన దవాఖాన 300 పడకలకు అప్గ్రేడ్ అయింది. మెట్పల్లి సీహెచ్సీ 50 పడకలతో సేవలందిస్తున్నది. అయితే 30 పడకలతో ఉన్న కోరుట్ల సీహెచ్సీ 100 పడకలకు అప్గ్రేడ్ చేయడం, నూతన దవాఖాన నిర్మించి ప్రారంభించుకోబోతుండడంతో జిల్లాలోనే రెండో పెద్దాసుపత్రిగా ప్రత్యేకతను సంతరించుకోనున్నది.
కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి పట్టణంతో పాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్ మండలాల పరిధిలోని ప్రజలకు దవాఖానలో ఆధునిక మెరుగైన వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు అందనున్నాయి. కోరుట్ల కమ్యూనిటీ సెంటర్ ద్వారా ఇప్పటికే ఆయా మండలాల పరిధిలోని 60 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు కొనసాగుతుండగా వంద పడకలు అందుబాటులోకి వస్తే కార్పొరేట్కు దీటుగా అన్ని రకాల వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేరువకానున్నాయి.
వంద పడకల దవాఖాన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. చిన్నాచితక పనులు మిగిలి ఉండగా, త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ నెల 6న ఉదయం 9 గంటలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దవాఖానను ప్రారంభించనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.