కొత్తగా మరో 13 ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రారంభం
ఆడబిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు, ఆమె ఆరోగ్యానికి అభయమిస్తున్నది. ‘మహిళల ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ నినాదంతో ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభిస్తున్నది. మార్చి8న మహిళాదినోత్సవం సందర్భంగా కరీంనగర్ గడ్డ నుంచే ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఉమ్మడి జిల్లాలో 15 సెంటర్లు ఓపెన్ చేసి, ప్రతి మంగళవారం మహిళలకు ఉచితంగా 8 రకాల పరీక్షలు చేసింది. అవి విజయవంతంగా నడుస్తుండగా, మంగళవారం ఉమ్మడి జిల్లాలో మరో 13 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలోని పీహెచ్సీలో మంత్రి గంగుల కమలాకర్, ఆయాచోట్ల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
మహిళలు సంపూర్ణ ఆరోగ్యానికి సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఆమె ఆరోగ్యంగా ఉంటేనే శక్తివంతమైన సమాజ నిర్మాణం సాధ్యమనే నినాదంతో ముందుకుసాగుతున్నది. అందులో భాగంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి కరీంనగర్ గడ్డ నుంచే శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో 15 ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతి మంగళవారం ఉచితంగా ఎనిమిది రకాల పరీక్షలు చేస్తున్నది. 27 వారాల నుంచి విజయవంతంగా నడుస్తుండగా, తాజాగా మంగళవారం మరో 13 కేంద్రాలను ప్రారంభించి, సేవలను అందుబాటులోకి తెచ్చింది.
– కరీంనగర్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ)/ విద్యానగర్
కరీంనగర్ విద్యానగర్, సెప్టెంబర్ 12: ఆరోగ్య మహిళా కేంద్రం ఆడబిడ్డలకు వరంలాంటిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్ పరిధిలోని రేకుర్తి బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు మూడు కేంద్రాలు పని చేస్తున్నాయని, ఇప్పుడు కొత్తగా మరో ఆరు ప్రారంభించామన్నారు. మహిళలు ప్రాథమిక దశలోనే పరీక్షలు చేసుకుంటే ఏ వ్యాధినైనా పూర్తిగా నయం చేసుకునేందుకు వీలవుతుందన్నారు. ఈ కేంద్రాల్లో మహిళలకు అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని, వ్యాధుల నిర్ధారణ జరిగితే హయ్యర్ సెంటర్కు రిఫరల్ చేస్తారని చెప్పారు.
అందులో ముఖ్యంగా 8 రకాల పరీక్షలు నిర్వహిస్తారని, క్యాన్సర్, స్క్రీనింగ్, లైంగిక వ్యాధులు, మెనోపాజ్ వ్యాధులు, శారీరక బరువు, నిర్వహణ, రుతుస్రావ సమస్యలు, డయాగ్నోస్టిక్స్, సాధారణంగా మహిళల్లో వచ్చే సమస్యలను గుర్తిస్తారని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోని మహిళలు ఆరోగ్య మహిళా కేంద్రాలను వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి మహిళ 30 ఏళ్లు దాటగానే అన్ని రకాల పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. డీఎంఅండ్హెచ్వో లలితాదేవి మాట్లాడుతూ, జిల్లాలోని మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 671 మంది మహిళలు పరీక్షలు చేసుకోగా, 59 మంది మహిళలను జిల్లా దవాఖానకు రెఫర్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గోపి, మేయర్ సునీల్రావు, కార్పొరేటర్లు సుధగోని మాధవికృష్ణగౌడ్, ఎదుల్ల రాజశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్కుమార్ గౌడ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ పాల్గొన్నారు.
కరీంనగర్లో కొత్తగా ఆరు
కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 3 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉండగా, మంగళవారం కొత్తగా 6 కేంద్రాలను ప్రారంభించారు. రేకుర్తిలోని బస్తీదవాఖానలో మంత్రి గంగులకమలాకర్, ఇల్లందకుంట పీహెచ్సీలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, రామడుగు మండలం గోపాల్రావుపేటలోని గుండి పీహెచ్సీలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సైదాపూర్ మండలకేంద్రంలోని పీహెచ్సీలో ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ప్రారంభించారు. ఇక నగరంలోని తీగలగుట్టపల్లిలోని బస్తీ దవాఖాన, చామనపల్లి గ్రామంలోని పీహెచ్సీలో ఏర్పాటు చేసిన కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించి, అందుబాటులోకి తెచ్చారు. మొదటిరోజు జిల్లా వ్యాప్తంగా 671 మందికి పరీక్షలు చేశారు.
జగిత్యాలలో కొత్తగా రెండు
జిల్లాలో ఇప్పటికే 5 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉండగా, మంగళవారం కొత్తగా 2 కేంద్రాలను ప్రారంభించారు. కోరుట్ల పీహెచ్సీలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతతో కలిసి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రారంభించారు. సారంగాపూర్ మండల పీహెచ్సీలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, సారంగాపూర్, బీర్పూర్ మండల ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కాగా గొల్లపల్లికి మంజూరైన మరో కేంద్రాన్ని ఈ నెల 19న మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించనున్నారు.
సిరిసిల్లలో కొత్తగా రెండు
జిల్లాలో ఇప్పటికే 4 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉండగా, మంగళవారం కొత్తగా 2 కేంద్రాలను ప్రారంభించారు. ఇల్లంతకుంట పీహెచ్సీలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని డీఎంహెచ్ఓ సుమన్మోహన్ రావు, ముస్తాబాద్ మండలం పోతుగల్ పీహెచ్సీలో పోతుగల్ ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, సర్పంచ్ తన్నీరు గౌతంరావు, డిప్యూటీ డీఎంహెచ్వో రజిత, నేషనల్ ప్రోగ్రాం అధికారి ఉమాదేవి ప్రారంభించారు.
పెద్దపల్లిలో కొత్తగా మూడు
జిల్లాలో ఇప్పటికే 3 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉండగా, మంగళవారం కొత్తగా మూడు కేంద్రాలను ప్రారంభించారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ పీహెచ్సీలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్తో కలిసి ప్రారంభించారు. అలాగే రామగుండం నగరంలోని అల్లూరు యూపీహెచ్సీలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ కృపాబాయి, లక్ష్మీపూర్ యూపీహెచ్సీలో కేంద్రాన్ని మేయర్ అనిల్కుమార్ ప్రారంభించారు. మొదటి రోజు రాఘవాపూర్లో 53మందికి, అల్లూరులో 53మందికి, లక్ష్మీపూర్లో 51 మందికి స్క్రీనింగ్ చేశారు. మూడు కేంద్రాల్లో 12 మందిని మెరుగైన వైద్యం కోసం సిఫారసు చేశారు.
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఇల్లందకుంట సెప్టెంబర్ 12: మహిళా ఆరోగ్యంతోనే కుటుంబం ఆనందంగా ఉంటుందని మండలి విప్ పౌడి కౌశిక్రెడ్డి అన్నారు. మంగళవారం ఇల్లందకుంట పీహెచ్సీలో మహిళా ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి మంగళవారం 8 రకాల పరీక్షలు నిర్వహించి వ్యాధినిర్ధారణ అనంతరం చికిత్స అందిస్తారన్నారు. ఈ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజల చెంతకే వైద్యం
పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 12: ప్రజల చెంతకే ప్రభుత్వ వైద్యసేవలందిస్తున్న ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. విరివిగా నిధులు వెచ్చిస్తూ మహిళలకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ పీహెచ్సీలో మంగళవారం కలెక్టర్ ముజామ్మిల్ఖాన్తో కలిసి మహిళా ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. ఈ దిశగా అనేక బృహత్తర స్కీంలకు అంకురార్పణ చేసిందని పేర్కొన్నారు.
సర్కారు దవాఖానలో మెరుగైన వైద్యం
రామడుగు, సెప్టెంబర్12 : ఇల్లాలి ఆరోగ్యమే కుటుంబ సౌభాగ్యమని, ఏ ఇంట్లో అయితే గృహిణి ఆరోగ్యంగా ఉంటుందో, ఆ ఇల్లంతా బాగుంటుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. రామడుగు మండలం గోపాల్రావుపేటలోని గుండి పీహెచ్సీలో మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించారని, కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్ది మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. మహిళా సంక్షేమానికి సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని, అందులో భాగంగానే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని తెచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు 8 రకాల పరీక్షలు చేసి, అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నదన్నారు.
అతివల సంక్షేమానికి ప్రాధాన్యం
సైదాపూర్, సెప్టెంబర్12 : అతివల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ అన్నారు. సైదాపూర్ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన మహిళల ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు సీఎం కేసీఆర్ విరివిగా నిధులు వెచ్చిస్తున్నారని చెప్పారు. మహిళల సంక్షేమానికి సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనేదే ఆయన ఆకాంక్ష అన్నారు. ఆరోగ్యమహిళా కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సేవా దృక్పథంతో పనిచేయాలి
సారంగాపూర్, సెప్టెంబర్12 : వైద్యసిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని, ఆరోగ్య కేంద్రంలో ఎల్లావేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సూచించారు. సారంగాపూర్ సీహెచ్సీలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, అందులో భాగంగానే అనేక పథకాలు తెచ్చారని గుర్తు చేశారు. ఆరోగ్య మహిళ కేంద్రాల్లో మహిళా సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేస్తారని చెప్పారు. వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలదరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విప్లవాత్మక పథకాలు
మల్లాపూర్, సెప్టెంబర్ 12: మహిళల కోసం విప్లవాత్మక పథకాలకు అంకుర్పారణ చేసిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కొనియాడారు. ఇల్లాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పారు. కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లతో కలిసి మంగళవారం మల్లాపూర్ పీహెచ్సీలో మహిళా ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, దేశంలో ఎక్కడాలేనివిధంగా కేసీఆర్ కిట్, టీ-హబ్, గర్భిణులు, బాలింతలకు 102 వాహన సౌకర్యం తదితర స్కీంలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ఇల్లంతకుంటలో..
ఇల్లంతకుంట, సెప్టెంబర్, 12: ఇల్లంతకుంట పీహెచ్సీలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని సిరిసిల్ల డీఎంహెచ్వో సుమన్ మోహన్ రావు ప్రారంభించారు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి మంగళవారం ఈ కేంద్రంలో మహిళలకు గొంతు, రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించి ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీరాములు, తదితరులు ఉన్నారు.
లక్ష్మీపురంలో 50 మందికి స్రీన్కింగ్
ఫర్టిలైజర్సిటీ, సెప్టెంబర్ 12: రామగుండం పట్టణంలోని లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా సెంటర్ను రామగుండం నగరపాలక మేయర్ డాక్టర్ అనిల్కుమార్ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ కృపాబాయితో కలిసి ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. 51 మంది మహిళలకు వైద్యులు స్క్రీనింగ్ పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నీలం పద్మ గణేశ్, మెడికల్ ఆఫీసర్ సరళి, హెల్త్ అసిస్టెంట్ తిరుపతి, ఏఎన్ఎంలు జయ, విమల, రాధ, సారక్క, తదితరులు ఉన్నారు.
అల్లూరులో 60 మందికి పరీక్షలు
యైటింక్లయిన్ కాలనీ, సెప్టెంబర్ 12 : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు అర్బన్ హెల్త్ సెంటర్లో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా ఇమ్యూనైజేషన్ డాక్టర్ కృపబాయి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా వుండాలనే లక్ష్యంతో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించిందని చెప్పారురు. మొదటి రోజు దాదాపు 60 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఆరుగురికి మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లాకేంద్రానికి పంపించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బత్తిని నీలిమ, సూపర్వైజర్ సరస్వతీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.