తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలకు రాష్ట్ర సర్కారు కొండంత ధీమానిచ్చింది. ఇంటి సభ్యుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి భరోసానిచ్చింది. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసి దారి చూపింది. అంతే కాదు, అమరుల త్యాగాలు వృథా కాకుండా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్త్తున్నది.
– హుజూరాబాద్ రూరల్, జూన్ 23
తెలంగాణ అమరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింది. తమ కుటుంబ సభ్యుడుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి భరోసానిచ్చింది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారిని ఆదుకున్నది. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం కొండంత ధైర్యం కల్పించింది. ఇంట్లో వ్యక్తిని కోల్పోయి దిక్కూ మొక్కూ లేక కాలం వెల్లదీశామని, స్వరాష్టంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు బతుకు దారి చూపిందని అమరుల కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. తమ వారి ప్రాణ త్యాగం వృథాగా పోలేదని, వారి కలలను నెరవేర్చంతో పాటు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు ముందుకు పోతున్నదని, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్నదని చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ సమయంలో అన్నయ్య నాగరాజు సాయిభార్గవ్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణప్రదంగా భావించాడు. ప్రతి రోజు తెలంగాణ కోసం జరుగుతున్న పరిణామాలపైనే చర్చించేవాడు. ఎప్పుడూ అదే ధ్యాస ఉండేది. 2010 నవంబర్ 8న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని కోరుతూ లేఖ రాసి జేబులో పెట్టుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నడు. దీంతో మా కుటుంబం తీవ్ర కలత చెందింది. తెలంగాణ వచ్చినంక అమరవీరుల కుటుంబాలను ఇలా ఆదుకుంటారని ఎప్పుడూ అనుకోలే. మా కుటుంబానికి రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు నాకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారు. అయితే తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేయడం ఉద్యమాలు చేయడం, రాష్ట్రం రావడం ఇదంతా ఒకటైతే. రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావడం అనేదే చారిత్రాత్మకం. ఆయన వల్లే అమరుల త్యాగాలు చరిత్రలో నిలిచాయి. లేకపోతే ఏ ఉద్యమం కోసమైతే త్యాగాలు చేశారో ఆ ఫలాలు ప్రజలకు అందేవి కావు. సంపూర్ణమైన అవగాహన, ఆలోచన, ఆచరణ ఉన్న గొప్ప వ్యక్తి కేసీఆర్. అందువల్లే పరాయి పాలనలో పడ్డ ఇబ్బందులన్నీ తొలగి తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదుగుతున్నది. నిజంగా మన తెలంగాణను చూస్తుంటే గర్వంగా అనిపిస్తున్నది. అన్నయ్య ఏ కాజ్ కోసమైతే ప్రాణత్యాగం చేశారో.. ఆ కాజ్ నెరవేరుతున్నదనే నమ్మకం మాకున్నది.
– నాగరాజు శ్రీకర్, టెక్నికల్ సబార్డినేట్, డీపీఆర్ఓ కార్యాలయం పెద్దపల్లి
తెలంగాణ రావాలని మా కొడుకు తల్లడిల్లి పోయేటోడు. అందరిలో కలివిడిగా ఉంటూ, పెద్ద, పెద్దోళ్ల తోటి కలిసి తిరిగిండు. ఎప్పుడూ తెలంగాణ ధ్య్యాసే మా మహికి. సోపతోల్లపైన పోలీసోల్లు కేసులు పెట్టి దెబ్బలు కొడుతుంటే చూసి ఏడ్చేటోడు. తెలంగాణ రాదేమో అని బెంగ వెట్టుకున్నడు. ఇంట్లో ఎవరం లేనప్పుడు దూలానికి ఉరేసుకొని కాలం జేసిండు. మా ఇంటి పెద్దదిక్కు పోవడంతో మా ఇల్లంత చిన్నబోయింది. మా ఎమ్మెల్యే సార్ కొప్పుల ఈశ్వర్ మా ఇంటికి వచ్చి మీ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకొనేందుకు మనకు కేసీఆర్ సార్ ఉన్నడని ధైర్యం జెప్పిండు. రూ.25 వేల సాయం జేసిండప్పుడు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయ్యాక మమ్ములను పిలిపించుకొని రూ. పది లక్షలు, ఎకరం భూమి పట్టా కాగితంతో పాటు నా చిన్న కొడుకు రాకేశ్కు సర్కార్ నౌకర్ ఇచ్చి ఆదుకుని మా ఇంటికి దీపమైండు. మహానుభావుడు కేసీఆర్ సార్కు మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటది.
– తర్ర దుబ్బయ్య- బుచ్చమ్మ. (మహేశ్ తల్లిదండ్రులు) స్తంభంపల్లి(వెల్గటూర్)
తెలంగాణ కోసం నా భర్త, కొడుకులు టీఆర్ఎస్ వెంట కలిసి నడిచిన్రు. నా భర్త సుధాకర్ ఒంటి మీద కిరోసిన్ పోసుకొని రాష్ట్రం కోసం కాలబడ్డడు. 2009 డిసెంబర్ 8 రోజున కిరోసిన్ పోసుకొని కాలపడ్డ నా భర్తను కాపాడుకోవడం కోసం అనేక తండాలు పడ్డ. అయినా బతకలేదు. నా భర్తతో పాటు చాలామంది తెలంగాణ కోసం చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ దేవుడై నిలిచిండు. కుటుంబానికి పది లక్షలు ఇచ్చి ఒకలకు నౌకరి ఇచ్చి ఆదుకున్నడు. సీఎం కేసీఆర్ చేసిన సాయం బతికున్నంత కాలం నా కుటుంబమంతా మరిచిపోదు. 2015 సంవత్సరంలో పది లక్షలు ఇచ్చిండ్రు. 2016లో నా పెద్దకొడుకు ప్రవీణ్కు ఉద్యోగం ఇచ్చిండు. ఎలిగేడు మండలంలో ఆఫీస్ అటెండర్గా పని చేస్తున్నడు. అమరుల కుటుంబాలకు పింఛన్, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తమని చెప్పిండ్రు. కేసీఆర్ సారు మాత్రం మా పాలిట దేవుడే.. -బైరి చంద్రకళ, నిట్టూరు, పెద్దపల్లి మండలం
నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, నా భర్త 2003లో అనారోగ్యంతో చనిపోయిండు. అప్పటి నుంచి కష్టపడి నా బిడ్డలను చదివించుకున్న. రాష్ట్రం రావాలని నా పెద్ద కొడుకు మోహన్ ఉరేసుకొని సచ్చిపోయిండు. నా కొడుకు బతుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వత్తెనే నీళ్లు, మన రాష్ట్రానికి నిధులు, ఊర్లు బాగుపడతయ్ అని ఎప్పటికీ అనేటోడు. ఆ రంది వెట్టుకొని 2011లో సచ్చిపోయిండు. సచ్చిపోయినంక మూడేండ్లకు రాష్ట్రం వచ్చింది. నా కొడుకు కన్న కలలు ఇప్పుడు నెరవేరుతున్నయ్. మా కుటుంబానికి పెద్ద దిక్కైన పెద్ద కొడుకు పోయిన బాధ ఉంది. కానీ రాష్ట్రం వచ్చినంక రూ. 10లక్షలు, నా చిన్నకొడుకు రామక్రిష్ణకు ఉద్యోగం ఇచ్చిండ్రు. వచ్చిన డబ్బులతో కూతురు పెండ్లి జేసిన. ఇప్పుడు కొడుకు లేడనే రంది తప్ప అర్థికంగా ఎలాంటి బాధలు లేవు.
– మూషం లక్ష్మి, రంగాపూర్, హుజూరాబాద్ మండలం
కొడిమ్యాల, జూన్ 23: మండల కేంద్రానికి చెందిన అమరవీరుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన చెట్పల్లి నర్సయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదుకుంది. నర్సయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో రాష్ట్ర సాధన కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకొని అత్మహత్య చేసుకున్నాడు. భార్య లక్ష్మి 2016లో అనారోగ్యంతో మరణించింది. నర్సయ్యకు ముగ్గురు కొడుకులు గోపి, కృష్ణ, రవి, కూతురు గంగజమున. తెలంగాణ ప్రభుత్వం గంగజమునకు జగిత్యాల ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చింది. రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. నర్సయ్య మరణించే సమయంలో సొంతిల్లు లేకపోవడంతో ఇల్లు కొనుగోలు చేశారు. కూతురు గంగజమున వివాహం జరిపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకున్నారు. నేనూ పీజీ కంప్లీట్ చేసిన. ప్రభుత్వం నాకు ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చింది. వివాహం చేసుకున్నాను. 2010లో నాన్న మరణించిన అనంతరం మా కుటుంబం చాలా కోల్పోయింది. కుటుంబం గడవలేని పరిస్థితి ఉండేది. అప్పటి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పొలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నలు వివాహం చేసుకొని వివిధ రంగాలలో స్థిరపడ్డారు. మా కుటుంబాన్ని అదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– గంగజమున, నర్సయ్య కూతురు, కొడిమ్యాల
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కడుపులో పెట్టి చూసుకున్నరు. నా భర్త రాజారపు జనార్దన్ తెలంగాణ కోసం ఊల్లె ఎకడ ఉద్యమం జరిగినా అకడికి పోయెటోడు. రాష్ట్రం ఏర్పడితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తయని, అభివృద్ధి జరుగుతదని చెప్పెటోడు. రాష్ట్రం రాకుంట కుట్రలు జరిగినప్పుడు మదన పడేటోడు. తెలంగాణ వస్తదో, రాదో అనే బెంగతో నా భర్త జనార్దన్ 2012 జులై 25న రాయికల్ల శివాజీ విగ్రహం వద్ద పెట్రోల్ పోసుకొని చనిపోయిండు. ఇంటికి పెద్ద దికును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మా కుటుంబానికి సర్కారు అండగా నిలిచింది. తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో మా కుటుంబానికి రూ.10లక్షల సహాయం అందజేసింది. నా కొడుకు ప్రవీణ్కు ప్రభుత్వం 2016లో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు నా కొడుకు కరీంనగర్ దేవాదాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నడు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరిగే పథకాలను అమలు చేస్తున్నడు. – అమరవీరుడు జనార్దన్ భార్య లక్ష్మి (రాయికల్)
తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను కేసీఆర్ ఆదుకొని అకున చేర్చుకున్నరు. ఒకో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చి ఒకరికి ఉద్యోగం కల్పించిండ్రు. మా తండ్రి అనాసి రమేశ్ సామాన్య రైతుగా పనిచేస్తూనే తెలంగాణ కోసం పురుగుల మందు తాగి 2009 డిసెంబర్ 10న ఆత్మహత్య చేసుకున్నడు. నాన్నను బతికించుకునేందుకు అష్ట కష్టాలు పడ్డం. అయినా బతుకలేదు. తెలంగాణ కోసం నాన్న చనిపోతే మా చెల్లెలు, నా చదువు కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సారు మా కుటుంబానికి అండగా నిలిచిన్రు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షలు ఇచ్చి ఒకరికి ఉద్యోగం ఇచ్చింది. నేను ప్రస్తుతం పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. -అనాసి అన్వేష్ , చందపల్లి, పెద్దపల్లి