రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో రైతులు పామాయిల్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1600 ఎకరాల్లో సాగుకు ఉద్యానవన శాఖ లక్ష్యం నిర్ధేశించగా, ఇప్పటికే 1280 ఎకరాల్లో మొక్కలు నాటారు. మరోవైపు గింజల నుంచి నూనె తీయడానికి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చొరవతో ఎఫ్జీవీ, ప్రియూనిక్ కంపెనీలు ముందుకు రాగా, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో స్థలాలను పరిశీలించారు. ఈ ఏడాదిలో ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతులు డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రోత్సహిస్తుండడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మార్కెట్లో వంట నూ నెల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆయిల్ తోటలను సాగు చేయాలన్న సర్కారు నిర్ణయానికి జైకొడుతున్నారు.
సిరిసిల్లలో 1280 ఎకరాల్లో సాగు
గత సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల బృందం పర్యటించి 8 వేల ఎకరాల వరకు ఆయిల్ తోటలను సాగు చేయవచ్చని నివేదికలు ఇచ్చింది. పలు మండలాల్లోని రైతులకు ఆయిల్పాం తోటల సాగుపై అవగాహన కల్పించింది. వారి సూచనల మేరకు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు పల్లెల్లో రైతులతో సమావేశాలు పెట్టి అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ గురించి వివరించారు. పంట దిగుబడితో వచ్చిన గెలలు కొనేదెలా?, ఇక్కడ ఆయిల్ తీసే కర్మాగారాలు లేవు కదా?, ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో మాత్రమే ఉన్న ఫ్యాక్టరీకి తరలించాలంటే రవాణా ఖర్చులు భారమవుతాయని రైతులు అభిప్రాయాలు వెల్లడించడంతో ఈ విషయాన్ని ఉద్యానవనశాఖ అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి తొలుత సిద్దిపేటలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 1600ల ఎకరాల్లో సాగు చేయాలన్న లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1280 ఎకరాల్లో 300 మంది రైతులు సాగు చేశారు. అందుకు అనుగుణంగా జిల్లాలోనే గింజల నుంచి నూనె తీసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు మలేషియాకు చెందిన ఎఫ్జీవీ కంపెనీ తొలుత ముందుకొచ్చింది.
ముందుకొచ్చిన రైతులు
సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ మండలం మోహినికుంటలో 15 ఎకరాల్లో తానే స్వయంగా ఆయిల్ పామ్ తోటను సాగుచేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనతో రైతుల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 300 మంది రైతులు 1280 ఎకరాల్లో పామాయిల్ తోటలను సాగు చేస్తున్నారు. ఈ తోటల్లో అంతర పంటలను సాగు చేసే అవకాశముండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. మరింత మంది తాము సాగు చేస్తామంటూ ఉద్యానవన శాఖకు దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లా రెండు ఫ్యాక్టరీలు
పామాయిల్ నూనె తీసే ఫ్యాక్టరీ ఉమ్మడి జిల్లా రైతులకు అందుబాటులో ఉండేలా మంత్రి కేటీఆర్ ఆలోచన చేస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్లో మలేషియాకు చెందిన ఎఫ్జీపీ సిరిసిల్లలో ప్రారంభించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిశారు. ఆ సంస్థతో పాటు రాష్ర్టానికి చెందిన ప్రియూనిక్ సంస్థ కూబి సిరిసిల్లలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ రెండు కంపెనీల ఏర్పాటు కోసం వివిధ మండలాల్లోని ప్రభుత్వ స్థలాలను అధికారులు సర్వే చేస్తున్నారు. అందులో భాగంగా ముస్తాబాద్ మండలం మోహినికుంట, తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్స్ పార్కు వెనుకాల గల రెవెన్యూ స్థలాలను పరిశీలించారు. ఒక్కో ఫ్యాక్టరీకి 20 ఎకరాల వరకు అవసరం ఉంటున్నందున రవాణా సౌకర్యం, రైతులకు అందుబాటులో ఉండేలా స్థలాలను ఎంపిక చేస్తున్నారు. త్వరగా ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
స్థలాలను పరిశీలిస్తున్నాం
ఆయిల్పామ్ తోటల సాగుకు అన్నదాతలు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. వారికి అన్ని విధాలుగా సర్కారు అండగా ఉంటుంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లాలో ఆయిల్పామ్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తు న్నారు. ముందుకొచ్చిన ప్రియూనిక్ కంపెనీకి స్థలం కేటాయించేందుకు పరిశీ లించాం. పామాయిల్ సాగు చేసిన రైతులకు ఇబ్బంది లేకుండా జిల్లాలోనే పామాయిల్ గింజల నుంచి నూనెతీసే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. మార్కెటింగ్ కోసం రైతులు సందేహాలు పెట్టుకోవద్దు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది.
– జ్యోతి, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి (సిరిసిల్ల)