ఉమ్మడి పాలనలో అన్నింటా వెనుకబడిపోయిన గర్శకుర్తి నేడు పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వ సహకారం, పాలకవర్గం కృషితో సకల హంగులు అద్దుకొని అద్దంలా మెరిసిపోతున్నది. వీధి వీధినా తళతళలాడే రోడ్లు, శుభ్రమైన డ్రైనేజీలతో కళకళలాడుతున్నది. నిత్యం చెత్త సేకరణతో పారిశుధ్యానికి కేరాఫ్గా నిలుస్తున్నది. అంత్యక్రియల చింత తీర్చేందుకు సకల సౌకర్యాలతో వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది. తీరొక్క మొక్కలతో పల్లె ప్రకృతివనం రూపుదిద్దుకున్నది. మియావాకీ ద్వారా చేపట్టిన మొక్కల పెంపకంతో హరితశోభను సంతరించుకున్నది.
-గంగాధర, మే 7
గంగాధర మండలం గర్శకుర్తి గ్రామం సమైక్య రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైంది. మౌలిక వసతుల్లేక పల్లె జనం అల్లాడింది. ఊరిలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు చేసేందుకు అపసోపాలు పడ్దది. స్నానాలు చేసేందుకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఉండేది. పారిశుధ్యలోపంతో అనారోగ్యం బారినపడి సంపాదించిన సొమ్మును దవాఖానల పాల్జేసింది. గతుకుల రోడ్లతో జనం నరకం అనుభవించింది. కంపుకొట్టే మురుగు కాల్వలతో నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అయితే సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతితో ఆ ఊరు రూపు రేఖలు మారాయి. మూడున్నరేండ్ల కిందట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా పాలకవర్గ సభ్యులు గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను గుర్తించారు. పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకు కదిలారు. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడు గుంత నిర్మించుకోవాలని అవగాహన కల్పించడం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు.
ఆదర్శ గ్రామంగా..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి స్ఫూర్తినందుకొని గర్శకుర్తి గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వం నెలనెలా మంజూరు చేస్తున్న పల్లె ప్రగతి నిధులు గ్రామంలో అనేక పనులు చేపట్టారు. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేసి తడి పొడి చెత్తను సేకరిస్తున్నారు. 8 లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి ఊరిలో సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్డుకు తరలిస్తున్నారు. ట్యాంకర్ ద్వారా హరిత మొక్కలకు నీళ్లు పడుతున్నారు. రైతు ముచ్చట్ల కోసం రూ. 22 లక్షలతో రైతు వేదికను నిర్మించారు. రూ. 12.60 లక్షలతో ఆధునిక వైకుంఠధామం, రూ. 2.30 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు. గ్రామంలో కొత్తగా 30 కరెంట్ స్తంభాలు వేశారు. లూజ్ వైర్లను సరి చేయడంతో పాటు 4 కిలో మీటర్ల మేరకు థర్డ్ వైర్ వేశారు. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఏండ్లనాటి విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపారు. హరితహారంలో భాగంగా గ్రామ శివారులో మియావాకీ వనాన్ని ఏర్పాటు చేసి 4 వేల మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో 1100, అవెన్యూ ప్లాంటేషన్ కింద వెయ్యి మొక్కలు నాటారు. మొక్కలు ఎండిపోకుండా వాచర్ను ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతి మాకు దిశానిర్దేశం చేసింది. నిత్యం గ్రామంలో పర్యటించడంతో సమస్యలపై అవగాహన కలిగింది. ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఇప్పటికే గ్రామంలో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, రైతువేదికను నిర్మించినం. మియావాకీ, ప్రకృతి వనంలో మొక్కలు నాటడంతో పాటు ఇంటింటికీ ఐదు మొక్కలు పంపిణీ చేసి సంరక్షిస్తున్నాం. ప్రతిరోజూ పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నం.
– అలువాల నాగలక్ష్మి, సర్పంచ్