కరీంనగర్ కార్పొరేషన్, డిసెంబర్ 22 : కరీంనగర్లోని రేకుర్తి ప్రాంతంలోని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని రేకుర్తి ప్రాంత వాసులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో స్థానిక ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో ఆందోళనకు దిగారు. రేకుర్తి చెందిన వందలాది మంది ముందుగా రేకుర్తిలోని ప్రధాన రోడ్డుపై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని, పట్టా భూములు ఉన్నా అమ్ముకోలేని పరిస్థితి ఉన్నదని ఆవేదన చెందారు.
రిజిస్ట్రేషన్లు నిలిపి వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్కు ర్యాలీ తరలివచ్చారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఎదుర్ల రాజశేఖర్ మాట్లాడుతూ, తమ రేకుర్తి ప్రాంతంలో ఒకటి నుంచి 230 వరకు సర్వే నంబర్లు ఉన్నాయని, అందులో కొంత ప్రభుత్వ భూమి ఉందని, మిగిలినవి అన్ని కూడా పట్టా భూములేనని చెప్పారు. అయితే, అధికారులు ఈ భూములన్నింటినీ 22 ఏ కింద చేర్చి రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపివేశారని ఆవేదన చెందారు.
ఆరు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచి ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ భూముల్లో ఇప్పటికే 90 శాతం మేరకు ఇండ్ల నిర్మాణం చేసుకొని అక్కడే ఉంటున్నారని తెలిపారు. సుమారుగా 3 వేలకుపైగా ఇండ్ల నిర్మాణం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల ఆస్తులు ఉండి కూడా ఏమీ చేయలేని దుస్థితి నెలకొందన్నారు. గతంలో గ్రామ పంచాయతీ నుంచి, ఇటీవల నగరపాలక సంస్థ నుంచి అనుమతులు తీసుకొని ఇండ్ల నిర్మాణం చేసుకున్నారని తెలిపారు. వీటితో పాటు ఈ ఇండ్లకు సంబంధించి పూర్తిస్థాయి ఇంటి పన్నులు చెల్లింపులతోపాటు ఇతర అన్ని రకాల చెల్లింపు కూడా చేస్తున్నారని తెలిపారు.
దీంతోపాటు పలువురు గృహ రుణాలు కూడా తీసుకొని వాయిదాలు చెల్లిస్తున్నారని చెప్పారు. పూర్తిగా పట్టా భూముల సర్వే నంబర్లను కూడా 22 ఏ కింద చేర్చి రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపివేయడం అన్యాయమన్నారు. ఈ భూములన్నీ కూడా తహసీల్దార్, ఆర్డీవో రికార్డుల్లో ఆయా యజమానుల పేర్లపై జమాబందీ కూడ ఉన్నాయన్నారు. కానీ, అకస్మాత్తుగా రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం వల్ల అవస్థలు పడుతున్నారని వాపోయారు. ముఖ్యంగా అనేక మంది పేదలు తమ ఆర్థిక అవసరాల కోసం, పిల్లల పెళ్లిళ్ల కోసం ఆయా భూములను, ఇళ్లను అమ్ముకునేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పట్టా భూములపై ఉన్న ఆంక్షలను తొలగించాలని కోరారు. లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆస్తులను అమ్ముకునే అవకాశం లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం జిల్లా అధికారులకు రేకుర్తి ప్రజలు వినతిపత్రం అందించారు. ఈ ఆందోళనలో రేకుర్తి ప్రాంత ప్రజలు పాశం మోహన్రెడ్డి, జాడి బాల్రెడ్డి, ఎంఏ రహీం, అందే శ్యాంసుందర్, ఆకుల కృష్ణ, శ్రీను, రవీందర్, నరేందర్, తిరుపతి, కార్తీక్, రాజగోపాల్, అంజయ్య, శ్రీనివాస్, రవీంద్రచారి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.