అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరలేవనున్నది. నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానున్నది. ఉదయం 11 గంటల నుంచి ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవనున్నది. ఈ ప్రక్రియ ఈ నెల 10 దాకా ప్రతి రోజూ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనుండగా, ఎక్కడా ఎలాంటి అవంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఇప్పటికే రిటర్నింగ్ అధికారులను ఎన్నికల సంఘం ప్రకటించగా, అన్ని ఆర్వోల పరిధిలో బందోబస్తుతోపాటు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. మరోవైపు రాజకీయ వాతావరణం వేడెక్కనున్నది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు, బీఫారాలు అందుకొని నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మిగిలిన పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించలేని దుస్థితిలో ఉండగా, పలు నియోజకవర్గాల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
కరీంనగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కలెక్టరేట్ : 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నుంచే నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానున్నది. నిజానికి గత నెల 8న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదే నోటిఫికేషన్లో ఎన్నికల షెడ్యూల్ను సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే. దాని ప్రకారం చూస్తే.. ఈ నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతి రోజూ రిటర్నింగ్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఖచ్చితంగా నిర్దేశిత సమయంలోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలకు అధికారులు అవగాహన కల్పించారు.
అంతే కాదు, అభ్యర్థుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత నియోజకవర్గాల్లోనే రిటర్నింగ్ కార్యాలయాలను ఏర్పాటు చేసి.. అక్కడే నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే రిటర్నింగ్ అధికారులను, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను సైతం ఎన్నికల సంఘం ఖరారు చేసింది. సంబంధిత కార్యాలయాల్లో ఉన్న ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే పరిశీలించి.. తగు సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అన్ని రిటర్నింగ్ కార్యాలయాల పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలు చేయనున్నారు. కాగా, ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు.
నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో.. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. 3 నుంచి 10 లోపు వారికి కలిసి వచ్చే సమయం కోసం ఇప్పటికే సంబంధిత పండితులను సంప్రదించి తేదీలను ఖరారు చేసుకున్నారు. మరికొంత మంది రెండు లేదా మూడు నామినేషన్ సెట్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల విషయానికొస్తే.. భారత రాష్ట్ర సమితి ఫుల్ జోష్లో కనిపిస్తున్నది.
మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఆగస్టు 21నే ప్రకటించింది. గతనెల 15 నుంచి బీ ఫారాలు అందించింది. సదరు అభ్యర్థులు ఇప్పటికే ప్రచార ప్రక్రియలో మునిగి తేలుతున్నారు. అంతే కాదు, నామినేషన్ వేసే తేదీలను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్ ఇంకా సిరిసిల్ల, కరీంనగర్ టికెట్లు ప్రకటించలేదు. అలాగే బీజేపీ పెద్దపల్లి, హుస్నాబాద్, వేములవాడ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు.
అభ్యర్థుల నామినేషన్ ఫారం పూర్తి చేయడంలో ఏ తప్పు దొర్లినా సదరు నామినేషన్ తిరష్కరణకు గురయ్యే ప్రమాదమున్నది. అందుకే.. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి ఎవరిని పడితే వారిని నమ్మకుండా.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తదుపరి మాత్రమే నామినేషన్ దాఖలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాదు, సంబంధిత అధికారులు సైతం అన్ని రాజకీయ పార్టీలకు వివరించారు. దీంతోపాటు నామినేషన్ పత్రం సమర్పణకు అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర ఎన్నికల సంఘం ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచింది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చూస్తే వివరాలు ఇలా ఉన్నాయి.