Ramagundam | కోల్ సిటీ, సెప్టెంబర్ 17 : రాష్ట్రంలో ఒకతీరు, రామగుండం నగర పాలక సంస్థలో మరో తీరు కొనసాగుతుందనీ, ప్రతీ నెల నిర్వహించాల్సిన కౌన్సిల్ మీటింగ్ లను ఎత్తివేయడానికి గల సాంకేతిక కారణాలేమిటో ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ రామగుండం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ డిమాండ్ చేశారు. నగర పాలక కార్యాలయంలో కమిషనర్ జే అరుణ శ్రీని గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక చట్టం ప్రకారం ప్రతీ నెల క్రమం తప్పకుండా కౌన్సిల్ మీటింగ్ లు నిర్వహించాలన్న నిబంధన రామగుండం కార్పొరేషన్ కు మినహాయించారా..? అని ప్రశ్నించారు.
అధికారుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ లో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. తమను నమ్ముకొని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిని ప్రతీ కార్పొరేటర్ ఎదుర్కొంటున్నారన్నారు. పాలక వర్గం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా రెండవ కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మొదటి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను ఎంతవరకు పరిష్కరించారో చెప్పాలని పట్టుబట్టారు. రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా ఇకనైనా రెండవ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆ సంప్రదాయంను కొనసాగించి కార్పొరేషన్ పరువు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ బీఆర్ఎస్ ప్రతినిధి తోకల రమేష్ పాల్గొన్నారు.