మెట్పల్లి రూరల్, డిసెంబర్ 1: మొదటి విడుత పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా 17 కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించగా, ఓ అభ్యర్థి రూ.28.60 లక్షలకు పాడి ద్విముఖపోరులో నిలిచాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని ఓ గ్రామంలో సోమవారం జరుగగా, జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మెట్పల్లి మండలంలోని ఓ గ్రామ సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్కు కేటాయించగా, 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో ఓ అభ్యర్థికి మరో సామాజిక వర్గం పూర్తి మద్దతు ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. దీంతో గ్రామంలోని 17 కుల సంఘాల సభ్యులు సోమవారం సమావేశం నిర్వహించి, మిగతా 11 మంది సర్పంచ్ అభ్యర్థులతో చర్చలు జరిపారు.
మీరంతా పోటీలో ఉంటే ఓట్లలో చీలిక వచ్చి, మరో సామాజిక వర్గం బలపర్చిన అభ్యర్థి గెలుపొందే అవకాశముందని తెలిపారు. 11 మందిలో ఒక్కరే పోటీలో ఉండాలని వేలంపాట నిర్వహించగా, రూ. 28.60 లక్షలకు ఓ అభ్యర్థి దక్కించుకున్నారు. మిగిలిన పది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని, లేకపోతే రూ.5 లక్షలు జరిమానా విధిస్తామని హుకుం జారీచేశారు. ధిక్కరించిన అభ్యర్థి జరిమానా కట్టకుంటే సంబంధిత కుల సంఘం బాధ్యత వహించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ విషయం కాస్త దావానంలా వ్యాపించడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.