కరీంనగర్ రవాణా శాఖ అధికారుల పనితీరు చర్చనీయాంశమవుతున్నది. మిగతా జిల్లాల్లో లేని విధంగా వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నట్టు తెలుస్తున్నది. మెట్రో నగరాల్లో అమలు చేయాల్సిన నిబంధనలను చూపి.. తమ జేబులు నింపుకునేందుకు ప్రైవేట్ ఉద్యోగులను నియమించి మరి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్టు విమర్శలు వస్తుండగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ రాంనగర్, మే 27 : వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో రైతులు ట్రాక్టర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. తమ పనితోపాటు చుట్టుపకల వారి పనులు చేస్తే ఉపాధి దొరుకుతుందని వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకూ కొనుగోళ్లు పెరగడం గమనించిన అధికారులు అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలు చేసిన ట్రాక్టర్లను రిజిస్ట్రేషన్కు తీసుకొస్తే ప్రొసీడింగ్ లేనిదే రిజిస్ట్రేషన్ చేయరాదని, భూమి ఉంటేనే వ్యవసాయ పనులకు ట్రాక్టర్ కొనుగోలు చేయాలని కొర్రీలు పెడుతున్నారు. అసలు రైతులు ట్రాక్టర్ కొనే సమయంలోనే వాహన షోరూంలో తమ భూమి పత్రాలు చూపిస్తారు.
వాణిజ్య అవసరాలకు కొనే వారికి ఈ నిబంధన ఉండదు. వాటికి త్రైమాసిక పన్ను విధానం ఉంటుంది. అయితే, అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ కోసం వస్తున్న ట్రాక్టర్లకు పాస్బుక్లు చూపాలని, ప్రొసీడింగ్ తీసుకోకుండా ఎలా కొనుగోలు చేశారంటూ రిజిస్ట్రేషన్ చేయలేమని చెబుతున్నారు. రూ.లక్షలు పోసి, అప్పులు చేసి, ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్ కొన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులను బతిమిలాడితే.. తమ ప్రైవేట్ ఉద్యోగులకు అప్పగించి నిబంధనలకు విరుద్ధంగా ‘మీ కోసం చేస్తున్నా’మంటూ అందిన కాడికి దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే ఆటోలు నడవక ఆటోవాలాలు బలవన్మరణానికి పాల్పడుతుంటే రవాణాశాఖ అధికారులు కొత్తగా ఆటోలు కొనే వారికి చుకలు చూపిస్తున్నారు. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆటోల కొనుగోలుపై ఆంక్షలున్నాయి. అక్కడ కొనాలనుకుంటే ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆ ప్రొసీడింగ్స్ ద్వారా కొనుగోలు చేయాలి. కానీ, కరీంనగర్ జిల్లాలోనూ ఆటోలు రిజిస్ట్రేషన్కి వస్తే ప్రొసీడింగ్ లేకుండా ఎలా కొంటావని అధికారులు బెదిరిస్తున్నట్టు తెలుస్తున్నది. రిజిస్ట్రేషన్ చేయలేమని ప్రొసీడింగ్ లేకుండా కొనుగోలు చేయడం నిబంధనలకు విరుద్ధమంటూ ఆటోవాలాలను భయపెట్టి.. రిజిస్ట్రేషన్కు అనుమతిస్తూ అందిన కాడికి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లా రవాణా శాఖ అధికారుల అవినీతి దాహానికి రైతులు, ఆటోవాలాలు తమ జేబులు గుళ్లవుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగతా జిల్లాల్లో లేని నిబంధనలు రాష్ట్ర రవాణా మంత్రి సొంత జిల్లాలో అమలు చేయడంపై అధికారుల అవినీతి కారణమని తెలుస్తున్నది. ఇకనైనా దీనిపై దృష్టి సారించి లేని నిబంధనలు అమలు చేస్తున్న అధికారులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరమున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాహనాల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా గ్రేటర్ కార్పొరేషన్లో అమలు చేయాల్సిన నిబంధనలు పాటిస్తున్నామని కరీంనగర్ డీటీసీ పురుషోత్తం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో రవాణాశాఖ డివిజన్లు రెండే ఉండగా హుజూరాబాద్ మినహా కరీంనగర్ కార్పొరేషన్ గ్రేటర్ కార్పొరేషన్గా భావించి అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులు కొనుగోలు చేసే ట్రాక్టర్లకు తప్పనిసరిగా పాసుబుక్కులు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ గ్రేటర్ పరిధిలో లేదని అడిగిన ప్రశ్నకు వివరణ ఇస్తూ.. దీనిపై కలెక్టర్తో మాట్లాడాల్సి ఉందని సమాధానం చెప్పారు.