Thimmapur | తిమ్మాపూర్, మే 13 : ముంపునకు గురై ఎఫ్టీఎల్కు దూరంగా ఖాళీగా ఉన్నటువంటి భూములలో ఒక సీజన్ వ్యవసాయం చేసుకుంటూ పండించిన వరి పంటను అధికారులు కొనుగోలు చేసేలా సహకరించాలని రామక్రిష్ణకాలనీ గ్రామ రైతులు తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డిని కోరారు. ఈ మేరకు బాధిత రైతులు ఆయనను బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎల్ఎండీ రిజర్వాయర్ పరిధిలో ముంపునకు గురైన భూములలో సుమారు 70 మందికి పైగా గత 25 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ తద్వారా వచ్చిన పంటలను అమ్ముకుంటూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఇలా పండించిన వరి ధాన్యాన్ని స్థానిక కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయడం లేదని వాపోయారు.
న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో వారు తహసీల్దార్ను కలిసి సమస్యను వివరించారు. వ్యవసాయం తప్ప వేరే పనులు అలవాటు లేని తాము ఇలాంటి భూములలో పండిస్తున్న పంటలను మానవతా దృక్పథంతో ఆలోచించి కొనుగోలు చేయాలని వినతిపత్రం ద్వారా కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో రైతు ద్వారా ధ్రువీకరించిన పత్రంనకు వ్యవసాయ అధికారి ద్వారా అనుమతి తీసుకొన్న తర్వాత కొనుగోలు చేశారని అదే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించి కొనుగోలు చేసేలా సహకరించాలని రైతులు గోనెల భూమయ్య, గంగు రాజమల్లు, కోతి మల్లేశం, ఆవుల లచ్చయ్య, గంగు తిరుపతి, అట్ల అంజయ్య తదితరులు తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం అరుణ్, కోతి రాజు ఉన్నారు. ఉన్నతాధికారులకు నివేదించి సమస్య పరిష్కారం చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు.