Korukanti Chander | కోల్ సిటీ, సెప్టెంబర్ 15 : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్న విఘ్నాలు తొలగిపోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ వేడుకున్నారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోదావరిఖని జవహర్ నగర్ లో మహావీర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సకల విఘ్నాలు తొలగించే గణనాథుడి ఆశీస్సులు రామగుండం నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంకు కనువిప్పు కలిగేలా చూడాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేలా తెలంగాణ రాష్ర్టానికి పదేళ్ల నాటి పూర్వవైభవం రావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే వినాయక చవితి నవరాత్రి వేడుకలను రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నీరటి శ్రీనివాస్, నారాయణదాసు మారుతి , కోడి రామకృష్ణ తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.