Siricilla | సిరిసిల్ల టౌన్, మార్చి 24: అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం సిరిసిల్ల పట్టణంలోని బీఆర్ఎస్ విద్యార్థులు, నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సబ్బని హరీష్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో విద్యారంగానికి తొలి ప్రాధాన్యత కల్పించాలని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో భాగంగా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ తో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తమను ముందస్తు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని ఆపలేరని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. విద్యారంగానికి నిధులు కేటాయించే వరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అరెస్టైనవారిలో బీఆర్ఎస్వీ విభాగం నాయకులు కంచర్ల రవి గౌడ్, షేక్ సికిందర్, ఆఫ్రోజ్, శ్రీనివాస్, అజ్జు తదితరులు ఉన్నారు.