సిరిసిల్ల దవాఖానలోని ప్రసూతి విభాగం అరుదైన ఘనత సాధించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రసవాల్లో రికార్డు సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు గత నవంబర్లో ఏకంగా 330 డెలివరీలు చేసి టాప్లో నిలువగా, వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ అనురాగ్ అభినందించారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 4 : మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన దవాఖానలు.. స్వరాష్ట్రంలో పుట్టింటిని మరిపించే రీతిలో తల్లీబిడ్డలకు భరోసానిస్తున్నాయి. ఇందుకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానే నిదర్శనంగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ కృషితో అధునాతన వసతులు సమకూర్చుకొని ప్రసూతి సేవల్లో దూసుకెళ్తున్నది. ప్రైవేటు దవాఖానల్లో సిజేరియన్ ప్రసవాలు అధిక సంఖ్యలో జరుగుతుండగా, ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా దవాఖానలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా ప్రత్యేక దృష్టి సారించారు. నలుగురు గైనకాలజిస్టులు 24గంటలు అందుబాటులో ఉండడంతో పాటు పుట్టిన చిన్నారులకు అత్యవసర వైద్య సేవల కోసం ఎస్ఎన్సీయూ అందుబాటులోకి తెచ్చారు. కేసీఆర్ కిట్తో పాటు నిరంతర, అత్యవసర వైద్య సేవలు అమలులోకి రావడంతో జిల్లా దవాఖానలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
జిల్లా దవాఖాన ప్రసవాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా ప్రతి నెలా దాదాపుగా 320ప్రసవాలు జరుగుతున్నాయి. అయితే నవంబర్లో అత్యధికంగా 330 ప్రసవాలు నమోదయ్యాయి. వీటిలో 207 సిజేరియన్ కాగా, 123 సాధారణ ప్రసవాలు కావడం గమనార్హం. వీటితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ విభాగాల్లో 307 సర్జరీలు అయినట్లు జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ మురళీధర్రావు తెలిపారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో ప్రసవాల నమోదు గణనీయంగా పెరుగుతున్నదని చెప్పారు.