అత్యాధునిక వైద్య పరికరాలు.. ఆపరేషన్ థియేటర్లు.. విశాలమైన గదులు.. అపార అనుభవమున్న వైద్య బృందం.. ఇలా కార్పొరేట్కు దీటుగా వేములవాడ దవాఖాన ప్రసూతి సేవలందిస్తున్నది. రాష్ట్ర సర్కారు చొరవ.. వైద్యుల ప్రత్యేక దృష్టితో పుట్టింటిని మరిపించే రీతిలో భరోసా కల్పిస్తున్నది. శస్త్రచికిత్సలతో కలిగే అనర్థాలను వివరిస్తూ.. సుఖప్రసవమయ్యేందుకు పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పిస్తున్నది. ఇంకా నెలలు నిండిన వారికి దవాఖానలో ప్రత్యేక వ్యాయామ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయగా, రోజురోజుకూ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. ప్రతి నెలా 100కు పైనే డెలివరీలు, అందులో తొలికాన్పుల్లో 50శాతం నార్మలే చేస్తూ గర్భిణులకు ఆర్థిక భారం తప్పిస్తుండగా, పేద, మధ్యతరగతి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– వేములవాడ, మే 30
వేములవాడ, మే 30: మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన దవాఖానలు.. స్వరాష్ట్రంలో పుట్టింటిని మరిపించే రీతిలో తల్లీబిడ్డలకు భరోసానిస్తున్నాయి. ఇందుకు వేములవాడ 100 పడకల దవాఖానే నిదర్శనంగా నిలుస్తున్నది. రాష్ట్ర సర్కారు చొరవతో అధునాతన వసతులు సమకూర్చుకొని ప్రసూతి సేవల్లో దూసుకెళ్తున్నది. ప్రైవేటు దవాఖానల్లో సిజేరియన్ ప్రసవాలు అధిక సంఖ్యలో జరుగుతుండగా, ప్రభుత్వ సూచనల మేరకు దవాఖానలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా ప్రత్యేక దృష్టి సారించారు. నెలలు నిండిన గర్భిణులకు దవాఖానలో ప్రతివారం వైద్య పరీక్షలు చేయడం, నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుండగా, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
సుఖ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి..
సిజేరియన్లతో మహిళలకు భవిష్యత్లో ఇబ్బందులు కలిగే ప్రమాదాలతో దవాఖానలో సుఖ ప్ర సవాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖ ప్రసవా లు అయ్యేందుకు పాటించాల్సిన నియమాలపై దవాఖానలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రతి నెలా 9వ తేదీన సమావేశాలు నిర్వహిస్తున్నారు. శస్త్ర చికిత్స తదుపరి వచ్చే అనారోగ్య సమస్యలను వివరిస్తున్నారు. సుఖప్రసవాలతో పుట్టిన గంటలోపే బిడ్డకు పాలు ఇవ్వడం, ఆరోగ్యంగా ఉండి యధావిధిగా పనులు చేసుకునేందుకు శరీరం సహకరిస్తుందని వివరిస్తున్నారు.
ప్రత్యేక వ్యాయామ కేంద్రం..
సుఖ కాన్పుల కోసం దవాఖానలో ప్రత్యేక వ్యాయామ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైద్యురాలు, స్టాఫ్ నర్సుల పర్యవేక్షణలో రోజూ ఉద యం 11 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎనిమిది నెలలు నిండిన గర్భిణులతో వ్యాయామం చేయిస్తున్నారు. ఇంటి వద్ద చేసే వ్యాయామాన్ని ఆశ కార్యకర్తలతో నిశితంగా పరిశీలిస్తున్నారు. చిన్నారుల్లో ఇమ్యూనిటీని పెంపొందించేందుకు పుట్టిన గంటలోపే తల్లిపాలను బిడ్డకు పట్టిస్తున్నా రు. ముర్రు పాలు తాగించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
ప్రతి నెల వంద ప్రసవాలు
రాష్ట్ర సర్కారు తీసుకున్న ప్రత్యేక చర్యలతో దవాఖానలో అత్యాధునికమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. డయాలసిస్, ఐసీ యూ, బ్లడ్ బ్యాంకు వంటి కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు సమకూరాయి. ప్రసూతి, మాతా శిశు సం రక్షణ విభాగానికి అవసరమైన ప్రత్యేక వైద్య బృం దాన్ని అందుబాటులో ఉంచారు. ఇందులో స్త్రీ వైద్య నిపుణురాలు, చిన్నపిల్లల వైద్యులు, మత్తుమందు నిపుణులతో పాటు నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండడం, ప్రైవేటుకు ధీటైన వైద్య సేవలు అందిస్తుండడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతినెలా 100కు పైనే ప్రసవాలు చేస్తున్నారు. మొదటి కాన్పు వారిలో 50 శాతానికి పైగా సుఖప్రసవాలే అవుతున్నాయని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు తెలిపారు.
నార్మల్ డెలివరీ చేసిన్రు..
మాది కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామం. పేద కుటుంబం. వేములవాడ దవాఖానలో మంచిగా చూస్తున్నారని మాకు తెలిసినోళ్లు చెబితే ఇక్కడికి వచ్చిన. ప్రతి నెలా ఇక్కడే చూపించుకున్న. వైద్యులు బాగా చూసిన్రు. నార్మల్ డెలివరీ కోసం ఏం చేయాలో, ఏం తినాలో చెప్పిన్రు. నాకు ఎనిమిది నెలలు పడ్డ తర్వాత దవాఖానలో వ్యాయామం చేయించిన్రు. ఇంటి వద్ద కూడా చేసిన. వైద్యులు అన్నట్టే నాకు నార్మల్ డెలివరీ అయింది. కొడుకు పుట్టిండు. చాలా సంతోషంగ ఉంది. ఇదే ప్రైవేట్కు పోతే రూ.40 వేల దాకా ఖర్చయితుండె.
– స్రవంతి, నిజామాబాద్, కోనరావుపేట మండలం
అవగాహన పెరిగింది
శస్త్ర చికిత్సలతో కలిగే అనర్థాలు, సుఖ ప్రసవాలతో కలిగే మేలుపై గర్భిణులకు వివరిస్తున్నాం. వారిలోనూ అవగాహన పెరిగింది. మేం చెప్పినట్టే చేస్తున్నారు. ఆరోగ్య నియమాలు పాటిస్తున్నారు. దవాఖానకు వచ్చే గర్భిణులకు తొలి కాన్పు అయితే సుఖ ప్రసవానికే ట్రై చేస్తున్నాం. ప్రత్యేక ఎక్సర్సైజులు చేయిస్తూ వారిని అందుకు సిద్ధం చేస్తున్నాం. అత్యవసరమైతేనే శస్త్ర చికిత్స చేస్తున్నాం. మొత్తానికి 50 శాతం నార్మల్ డెలివరీలే చేస్తున్నాం.
– డాక్టర్ చైతన్య సుధా, స్త్రీ వైద్య నిపుణురాలు, ఏరియా ఆసుపత్రి వేములవాడ
ప్రసవాల సంఖ్య పెరిగింది..
దవాఖాన లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. వందపడకలుగా మారి న తర్వాత అధునాత సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్కు దీటుగా సేవలందుతుండడంతో వేములవాడ దవాఖానపై గర్భిణుల ఆదరణ పెరిగింది. ప్రతినెల వందకుపైనే ప్రసవాలు చేస్తున్నాం. నార్మల్ డెలివరీలపై అ వగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, అం దుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలను వివరిస్తున్నాం. తొలి కాన్పుల్లో 50 శాతం సుఖ ప్రసవాలే చేస్తున్నాం.
– డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు, దవాఖాన సూపరింటెండెంట్