Roshayya | జగిత్యాల, జులై 4 : మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో శుక్రవారం కొణిజెటి రోశయ్య జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొణిజెటి రోశయ్య చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైయస్సార్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారని, ఆర్థిక శాఖతో పాటు రోడ్లు భవనాలు రవాణా శాఖ మంత్రిగా, హౌసింగ్ శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా, హోమ్ మినిస్టర్, వైద్య ఆరోగ్యం, విద్యాశాఖ మంత్రిగా కూడా కొంతకాలం తన సేవలు అందించారాని తెలిపారు.
వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత ముఖ్యమంత్రిగా కొంత కాలం సేవలు అందించారని, అనంతరం తమిళనాడు గవర్నర్గా పని చేసారని తెలిపారు. మహనీయులను ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితం చేయకుండా ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, బీసీ సంక్షేమ అధికారి జీ సునీత, జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి రవి, డీఆర్డిఏ పీడీ రఘువరన్, ఇతర, జిల్లా అధికారులు, కలెక్టరెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.