వానకాలం సీజన్ మొదలై నెలదాటినా ఒక గట్టి వాన లేదు. ఎక్కడి నుంచీ వరదా లేదు. కానీ, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి.. కాళేశ్వరం జలాలతో నిండుకుండల్లా మారుతున్నాయి.. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద కాలువకు జీవం పోసి, 34 తూముల ద్వారా నీటిని విడుదల చేస్తుండగా, ఇప్పటికే కొన్నిచోట్ల మత్తళ్లు దుంకుతున్నాయి.. కాలువ పొంట పొలాలకు పరుగులు తీస్తున్నాయి.. వాన జాడ లేకపోయినా.. మొగులు కేసి చూడకుండా ఊరూరా జలదృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
– కరీంనగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, జూలై14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. ఈ వానకాలం సీజన్లో సాగుకు నీళ్లివ్వడమే కాకుండా.. తాగునీటికి ఢోకా లేకుండా ఉండేందుకు కాళేశ్వరం జలాలు ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 2న ఆదేశించారు. ఆ మేరకు అధికారులు ఎత్తిపోతలను ప్రారంభించి, నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఒక్కో ప్రాజెక్టు దాటి వస్తున్న కాళేశ్వరం జలాలు, ప్రస్తుతం నలువైపులా పరుగులు తీస్తున్నాయి. లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ, నంది, గాయిత్రీ పంపుహౌస్ల మీదుగా వరదకాలువకు చేరుతున్నాయి. వరదకాలువ 102 కిలోమీటర్ నుంచి ఎగువకు ఎదురెక్కుతూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. ఐదు రోజుల క్రితమే అంటే ఈ నెల 7న శ్రీరాంసాగర్ను ముద్దాడిన కాళేశ్వరం జలాలు, వరదకాలువ 102 కిలోమీటర్ వద్ద రెండు హెడ్రెగ్యులేటరీ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు ప్రాజెక్టు)లోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి దిగువనున్న దిగువమానేరు జలాశయానికి కూడా వెళ్తున్నాయి. ఇదే సమయంలో శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ జలాశయానికి తరలుతుండగా, అక్కడి నుంచి ఎత్తిపోయడంతో రంగనాయకసాగర్కు పరుగులు తీస్తున్నాయి. ఇటు వరద కాలువ తూముల ద్వారా చెరువులను నింపుతున్నాయి. మొత్తంగా చూస్తే కాళేశ్వరం జలాలు నలువైపులా పరుగులు తీస్తుండగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కాళేశ్వరం జలాలు రాష్ట్రంలోని నలు దిక్కులా పరుగులు పెడుతున్నాయి. కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఎత్తిపోతలతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ పైకి ఎగసి వస్తున్నాయి. వరదకాలువ ద్వారా శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతూనే.. మరోవైపు.. శ్రీరాజరాజేశ్వర, దిగువమానేరుతోపాటు అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకసాగర్ వైపు వెళ్తున్నాయి. ఎటు చూసినా ఉప్పెనలా కనిపిస్తున్న కాళేశ్వరం జలాలను చూసి.. సంబ్బడవర్గాలు సంబుర పడుతున్నాయి. వరుణుడు కరుణించకపోయినా.. చినుకు రాలకపోయినా కాలువల్లో ఉప్పొంగి వస్తున్న కాళేశ్వర జలాల దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
– కరీంనగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తిప్పలు తప్పినయ్
మా ఊరి శివారు మీదుగా వరదకాలువ పోతున్నది. సీఎం కేసీఆర్ సారు రెండు తూములు ఏర్పాటు చేయించిండు. ఈ తూముల ద్వారా నీళ్లియ్యడంతో పెద్ద చెరువు, కన్నేరుకుంట, చింతల చెరువు, వీరన్న కుంటలు నీళ్లతో నిండినయ్. గతంలో ఈ ప్రాంతంలో భూములు బీడు ఉండె. ఎండకాలంలో తాగునీటికి ఇబ్బంది ఉండె. ఇప్పుడు వానకాలం, యాసంగి రెండు పంటలు సాగు చేస్తున్నం. చెరువులు నీటితో నిండడంతో భూగర్బ జలాలు పెరిగినయ్. తాగునీటికి తిప్పలు తప్పినయ్. నాడు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన విమర్శకులకు దిగువ నుంచి ఎగువకు పంపిన కాళేశ్వర జలాలతో సీఎం కేసీఆర్సారు సమాధానం చెప్పిండు.
– ఆదె లక్ష్మీరాజం, రైతు (కల్వకోట) (కథలాపూర్ మండలం)
చెరువులకు జలకళ
కాళేశ్వరం జలాలు నలుదిక్కులా పరుగులు పెడుతున్నాయి. వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతూనే, మరోవైపు తూముల ద్వారా చెరువుల్లోకి చేరుతున్నాయి. ప్రధానంగా జగిత్యాల జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. కథలాపూర్ మండలం దూలూరులోని నాగలమల్లప్ప చెరువు మత్తడి దుంకుతుండగా, దిగువన సిరికొండలోని నల్లచెరువు, పెగ్గెర్లలోని ఉర చెరువులు నిండాయి. తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన ఉదకమ్మ చెరువు మత్తడి దుంకుతున్నది. మేడిపల్లి మండలంలోని కల్వకోట పెద్ద చెరువు, కన్నేరు కుంట, చింతల చెరువు, వీరన్నకుంటలు నిండి మత్తడి దుంకుతున్నాయి. కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎకీన్పూర్ శివారులోని స్తంభాల చెరువుకు కూడా గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇది మత్తడి దుంకితే తాళ్ల చెరువులోకి, అక్కడి తూము ద్వారా కంచరకుంట, మద్దుల చెరువులోకి చేరనున్నాయి. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మాన్వాడ ఎస్సారార్ జలాశయం లెఫ్ట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తుండగా, నర్సింగాపూర్ ఊర చెరువుకు జలకళవచ్చింది. ఇదే మండలంలో వరదకాలువ నుంచి రెండు పంపులు ఎత్తి పోయగా, గోదావరి జలాలు విలాసాగర్ పెద్ద చెరువుకు చేరాయి. ఈ చెరువు నుంచి ఫీడర్ చానల్ ద్వారా దిగువన ఉన్న పొలాలకు పరుగులు తీశాయి. అలాగే గంగాధర మండలం బూరుగుపల్లి వద్ద వరద కాలువ తూముల ద్వారా బూరుగుపల్లి చెరువులోకి చేరి, మత్తడి దుంకాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాడు వరదకాలువ తమ వ్యవసాయ భూముల పక్క నుంచే వెళ్లినా చుక్కనీరు లేక ఇబ్బంది పడ్డామని గుర్తు చేశారు. ఇప్పుడు జీవనదిగా మారడంతో సాగునీటి గోస తీరిందని సంబురపడుతున్నారు. తూముల ద్వారా చెరువులకు నీళ్లిస్తున్నారని, అలాగే భూగర్భజలాలు పెరిగాయని సంతోష పడుతున్నారు. తమ గోస తీర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
వానల్లేకున్నా చెరువు నిండింది
గోదారి జలాలు వరదకాలువలో ఎదురెక్కుతున్నయి. వరదకాలువకు తూము ఏర్పాటు చేసి నీళ్లిడిసిండ్రు. పిల్ల కాలువ ద్వారా మా కల్వకోటలోని పెద్ద చెరువుకు నీళ్లచ్చినయ్. సీఎం కేసీఆర్ సారు మా కుల వృత్తిని బతికించిండు. ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను చెరువులో పోసి పెంచుతున్నం. మాకు ఉపాధి దొరికింది. గతంలో నీళ్లు లేక చెరువు ఎండిపోయింది. అప్పుడు కూలి పనికి పోయినం. ఇప్పుడు వానల్లేకున్నా చెరువు నిండుగా ఉన్నది. సాధ్యం కాదనుకున్న పనిని కేసీఆర్ సారు సాధ్యం చేసిండు. ఆ సారుకు రుణపడి ఉంటం.
– కట్కూరి గంగాధర్, మత్సకారుడు (కల్వకోట)
అందరి కండ్లలో ఆనందం చూస్తున్న
నాడు నేను కరువు చూసిన. కేసీఆర్ సారు పుణ్యమాని ఇప్పుడు అందరి కండ్లల్లో ఆనందం చూస్తున్న. 25 ఏండ్ల క్రితం ఎండిన చెరువులతో బాధపడ్డం. కానీ, కాళేశ్వరం నీళ్లతో చెరువులు నిండి మత్తడి దుంకుతున్నయ్. చెరువులో చేప పిల్లలను పోసి పెంచుతున్నం. మా కుటుంబాలు సంతోషంతో ఉన్నయి. కేసీఆర్ సారు చేసిన కృషి ఫలించింది. కాళేశ్వర జలాలు దిగువ నుంచి ఎగువకు పంపిన కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటం.
– కట్కూరి లస్మయ్య, మత్సకారుడు (కల్వకోట)
రెండు పంటలు పండిస్తున్నం
మా ఊరు కల్వకోట శివారుగుండా వరదకాలువ పోయింది. వానకాలంల మాత్రమే వరదకాలువల నీళ్లుండేటియి. ఎండకాలంల ఎండిపోయి ఎడారికి లెక్క అయ్యేది. ఇప్పుడు కేసీఆర్ సారు కృషితో జీవనది లెక్క అయింది. చెర్లకు నీళ్లస్తన్నయ్. వానకాలం, యాసంగి రెండు పంటలు పండిస్తున్నం. వ్యవసాయసాగు విస్తీర్ణం పెరిగింది. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– ఎండీ గాజీపాషా, రైతు (కల్వకోట)
జీవనదిలా వరదకాలువ
గత ప్రభుత్వాల హయాంలో దిగువకు నీటిని తీసుకొచ్చేందుకు మాత్రమే వరదకాలువను వినియోగించారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేధాశక్తితో బహుళ ప్రయోజనాలు అందించేలా మార్చారు. ఇప్పటికే కాళేశ్వరం జలాలను ఎదురెక్కించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపుతున్నారు. ఇదే సమయంలో వరద కాలువను 122 కిలోమీటర్ల పొడవునా నాలుగు రిజర్వాయర్లుగా మలిచి, దాదాపు 1.5 నుంచి రెండు టీఎంసీల నీరు కాలువలో నిరంతరం ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా కాలువ పరీవాహక ప్రాతంలో భూగర్భజలాలు భారీగా పెరుగుతున్నాయి. అలాగే, ఈ కాలువ ఆధారంగా దాదాపు 33 వేల వరకు విద్యుత్ మోటర్లు నడుస్తున్నాయి. దీంతోనే సరిపెట్టకుండా.. వరదకాలువ ద్వారా వీలైనన్నీ ఎక్కువ చెరువులు నింపేందుకు కావాల్సిన తూములకు అనుమతి ఇచ్చి.. క్షేత్రస్థాయిలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు. వాటి ఫలితం రైతులకు ప్రస్తుతం అందుతున్నాయి.
34 తూముల ద్వారా 80 చెరువులకు నీరు
నిజానికి వరద కాలువ నిర్మాణానికి 1991లో శంకుస్థాపన చేయగా, దాదాపు 19 ఏండ్ల పాటు పనులు సాగి 2010లో అందుబాటులోకి వచ్చింది. గత ప్రభుత్వాల పాలనలో వరదకాలువకు 16 తూములు మాత్రమే ఉండేవి. వాటిని కూడా అశాస్త్రీయంగా పెట్టారన్న విమర్శలు ఉండేవి. 6 మీటర్ల ఎత్తులో 1 నుంచి 1.5 డయాతో తూములను గతంలో ఏర్పాటు చేశారు. అంటే వరద కాలువలో 6 మీటర్ల ఎత్తులో నీళ్లు ఉంటే మాత్రమే ఆ తూములు ఉపయోగపడేవి. ఒక వేళ నీరున్నా డయా తక్కువగా ఉండడం వల్ల తక్కువగా నీరు వచ్చేది. దీంతో పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. వీటిపై గతంలో రైతులు విజ్ఞప్తి చేసినా నాటి పాలకులు పట్టించుకోలేదు. ఈ విషయాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వరదకాలువ తూములను సమూలంగా మార్చేశారు. గతంలో ఉన్న 16తో కలిపి వాటి సంఖ్యను ప్రస్తుతం 34కు పెంచారు. అయితే పాత తూములను అలాగే ఉంచి వాటి పక్కనే కొత్త తూములను ఏర్పాటు చేశారు. కాలువ పరిధిలో ఉన్న చెరువుల ఎత్తు పల్లాలను పరిగణలోకి తీసుకొని.. ఒక శాస్త్రీయ పద్ధతిలో వీలైనంత సులువుగా ఎక్కువ నీరు చెరువుల్లో చేరేందుకు వీలుగా డిజైన్ చేశారు. అందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువులకు ఎత్తు పల్లాలను పరిగణలోకి తీసుకొని గతంలో ఉన్న ఆరు మీటర్ల ఎత్తును 2 నుంచి 4 మీటర్లకు కుదించారు. అలాగే, డయాను మూడు ఫీట్లకు పెంచి తూములను ఏర్పాటు చేశారు. దీని వల్ల కాలువలో కొద్ది పాటి నీళ్లున్నా సంబంధిత చెరువులకు నీళ్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటున్నది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన 34 తూముల ద్వారా 80 చెరువులకు నీటిని వదులుతున్నారు. దీంతో చాలా చెరువులు ఇప్పటికే 75 శాతం నిండగా, కొన్ని చెరువులు మత్తడి దుంకుతున్నాయి.
కేసీఆర్ సారు దయనే
నాకు బూరుగుపల్లిలో చెరువు పొంటి ఆరెకరాల భూమి ఉన్నది. తొమ్మిదేళ్ల కిందటి వరకు చెరువుల నీళ్లు ఉండేటియి కాదు. ఎప్పుడు చూసినా ఎండిపోయినట్లే ఉండేది. వానకాలం కూడా 10 గుంటల పొలం పారలె. పొలం ఏసుడు బందు చేసి పత్తి, మక్క పెట్టిన. నీళ్లు లేక దిగుబడి రాలె. ధైర్యం చేసి వరి ఏత్తే పంట ఎండిపొయ్యి పెట్టుబడి లాసైంది. చేసేదేంలేక భూమిని బీడు పెట్టెటోన్ని. కేసీఆర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినంక నీళ్లకు ఢోకా లేకుండా అయింది. 2017 నుంచి ఇప్పటి వరకు మా బూరుగుపల్లి చెరువు ఒక్కసారి కూడా ఎండిపోలె. ఆరేండ్లల్ల తొమ్మిది సార్లు మత్తడి దుంకింది. మొన్నటికి మొన్న ఎండకాలంలో రెండు సార్లు మత్తడి దుంకింది. ఇప్పుడు నాకున్న ఆరెకరాలల్ల మొత్తం పొలం వేస్తున్న. పంట మంచిగా పండిస్తున్న. ఈ రోజు మా రైతులం సంతోషంగా పంటలు పండించుకుంటున్నామంటే అదంతా కేసీఆర్ సారు దయనే.
– దూలం బాలగౌడ్, బూరుగుపల్లి (గంగాధర)
ప్రాజెక్టు లేకుంటే ప్రశ్నార్థకమే
వానకాలం మొదలైన నెల రోజులవుతున్నా వాన జాడలేదు. రైతులు నారు పోసేందుకు ముందుకు రాలేదు. పంపుహౌస్లతో ఎత్తిపోతలు ప్రారంభమవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రైతులకు దక్కుతున్నయి. మా రాజేశ్వర్రావుపేట పంపుహౌస్కు భారీగా కాళేశ్వరం నీళ్లు వచ్చాయి. ఇక్కడ మోటర్లతో నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నరు. అంతేకాకుండా మా ఊరు పక్కనే ఉన్న బండలింగాపూర్ చెరువు నింపేందుకు వరదకాలువ తూము ద్వారా నీరు వదిలారు. వరదకాలువల నిండుగా నీళ్లు ఉండడంతో వరి నారు పోసినం. రైతులమంతా నాట్లేసేందుకు సిద్ధమైతున్నం. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరువును ఎదుర్కోవచ్చన్న నమ్మకం రైతుల్లో బలపడుతున్నది. ఈ ప్రాజెక్టు లేకుంటే పంటల సాగు ప్రశ్నార్థకంగా ఉండేది.
– మటేరు రాజశేఖర్, రైతు, రాజేశ్వర్రావుపేట(మెట్పల్లి మండలం)