పెద్దపల్లి, జూన్ 27(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్యన మంచిర్యాల జిల్లా ఇందారం మధ్య వంతెన ఉన్నది. రెండు జిల్లాల ప్రజలకు ఇదే ప్రధాన మార్గం. అయితే ఇది నిత్యం రద్దీగా ఉంటుంది. ఇంకా హైదరాబాద్-మహారాష్ట్ర వాహనాలు ఇదే వంతెన గుండా వెళ్తుండగా, గోదావరిఖనిలో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. అయితే అంతర్గాం వద్ద గోదావరిపై వంతెన నిర్మిస్తే మంచిర్యాల నుంచి కరీంనగర్, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు గోదావరిఖని రాకుండా నేరుగా పెద్దపల్లి నుంచి బసంత్నగర్, బుగ్గరోడ్, అంతర్గాం మీదుగా మంచిర్యాల వెళ్లిపోనున్నాయి. దీని ద్వారా పెద్దపల్లి-మంచిర్యాల మధ్య 22కిలో మీటర్ల దూరం తగ్గనున్నది. ఈక్రమంలో మంచిర్యాల-అంత ర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మించాలని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు నాలుగు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ, అప్పటి ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదు.
మాట ఇచ్చి నిలుపుకొని
అటు మంచిర్యాల జిల్లా, ఇటు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గాల ప్రజలు గోదావరిపై వంతెన నిర్మించాలని ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్, టీడీపీ ఈ అవకాశాన్ని ఎన్నికల హామీగానే వాడుకున్నాయో తప్ప నిర్మించలేదు. అయితే స్వరాష్ట్రంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, రామగుండం ఎమ్మెల్యే చందర్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు వంతెన కోసం పలుసార్లు సీఎం కేసీఆర్కు విన్నవించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ 2018లో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సభలో అంతర్గాం వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి, నిధులు కూడా మంజూరు చేశారు. అయితే ఇటీవలే 164కోట్లు మంజూరు చేసి, ఈ నెల 9న మంచిర్యాల వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తగ్గనున్న ధూరభారం
అంతర్గాం వద్ద గోదావరిపై వంతెన నిర్మిస్తే మంచిర్యాల నుంచి కరీంనగర్, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు గోదావరిఖని రాకుండా నేరుగా పెద్దపల్లి నుంచి బసంత్నగర్, బుగ్గరోడ్, అంతర్గాం మీదుగా మంచిర్యాల వెళ్లిపోనున్నాయి. దీని ద్వారా పెద్దపల్లి-మంచిర్యాల మధ్య 22కిలో మీటర్ల దూరం తగ్గనున్నది. ఇంకా అంతర్గాం మండల ప్రజలు వైద్యం, చదువులు, నిత్యావసర వస్తువులు సహా మరే అవసరం ఉన్నా 20కిలోమీటర్ల దూరంలోని గోదావరిఖనికి వెళ్లి వెళ్తున్నారు. ఈ వంతెన పూర్తయితే మంచిర్యాల జిల్లా కేంద్రం అంతర్గాం ప్రజలకు కేవలం 4కిలోమీటర్ల దూరంలోనే ఉండనున్నది. కాగా, వంతెన నిర్మాణానికి శంకుస్థాపన కావడంతో అంతర్గాం మండలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వ్యవసాయ భూములు, కమర్షియల్ భూముల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. మొన్నటిదాకా 2లక్షలు ఎకరం ఉన్న భూమి, ఒక్కసారి 40లక్షలకు పెరిగిపోయింది.
మొదలైన పనులు
గోదావరి నదిపై ఇటు అంతర్గాం.. అటు మంచిర్యాల మధ్య డబుల్ లైన్తో కిలోమీటర్ పొడవునా వంతెన నిర్మాణానికి ఈ నెల 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పనులను దక్కించుకున్న వల్లభనేని కన్స్ట్రక్షన్స్ కంపనీ నదికి ఆవలివైపు మంచిర్యాల వద్ద పనులు వేగంగా చేస్తున్నది. ప్రస్తుతం పిల్లర్ల కోసం గుంతలు తవ్వే పనులు నడుస్తున్నాయి. ఇటు అంతర్గాం వద్ద త్వరలోనే పనుల మొదలుకానున్నాయి.
నా చిన్నప్పటి నుంచి వింటున్న..
అంతర్గాం వంతెన నిర్మాణం ముచ్చట నా చిన్నప్పటి నుంచి వింటున్న. మాటలు తప్ప చేతలు కనిపించలేదు. ఏ ఎన్నిక వచ్చినా.. అంతర్గాం వంతెన కట్టిస్తామని చెప్పుడే కానీ, చేసినోడు లేడు. సీఎం కేసీఆర్ సార్ ఎన్నికల సమయంలో చెప్పిండు. మంజూరు చేసిండు. మొన్ననే పనులు కూడా మొదలు పెట్టిండు. మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంట.
– అనంతుల సత్యనారాయణ, కిరాణా షాపు నిర్వాహకుడు (అంతర్గాం)
భూముల ధరలకు రెక్కలచ్చినయ్..
వంతెన నిర్మాణ పనులు మొదలవడంతో అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని భూముల ధరలకు రెక్కలచ్చినయ్. మునుపెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ధరలు పెరిగినయ్. వ్యవసాయ భూములన్నీ కమర్షియల్ భూములు అయితున్నయ్. అతి త్వరలోనే మా అంతర్గాం మండలం దశనే మారిపోనున్నది. ఆ ఘనత పూర్తిగా సీఎం కేసీఆర్ సార్కే దక్కుతుంది.
– కట్కూరి వెంకట్రెడ్డి, రైతు, గోలివాడ (అంతర్గాం మండలం)
దూర భారం తగ్గుతుంది..
వంతెన పూర్తయితే పెద్దపల్లి నుంచి మంచిర్యాల వెళ్లే మాకు దూరభారం తగ్గుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతయి. ఇప్పుడు మంచిర్యాల వెళ్లాలంటే చుట్టూ తిరిగి గోదావరిఖనికి మీదుగా వెళ్లాలి. బ్రిడ్జి పూర్తయితే గోదావరిఖనికి పోయే బాధ తప్పుతది. 22కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మాకు టైం మిగులుతది. పని తొందరగ అయితది.
-ఫణి అక్షిత్, ప్రైవేటు ఉద్యోగి (పెద్దపల్లి)