పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టిన గృహలక్ష్మి పథకం వేగం పుంజుకున్నది. సొంత స్థలం ఉండి, ఇల్లు లేని వారికి రూ.3లక్షలు అందించబోతుండగా, కరీంనగర్ జిల్లాలో ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు 31,598 దరఖాస్తులు రాగా, యంత్రాంగం రంగంలోకి దిగి డోర్ టూ డోర్ సర్వే చేపట్టింది. వివరాలన్నీ పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. ఒకటి, రెండు రోజుల్లో తుది జాబితా ఖరారయ్యే అవకాశం కనిపిస్తుండగా, వీరందరికీ మరో పది రోజుల్లో ఖాతాల్లో డబ్బులు జమచేయబోతున్నది.
– కలెక్టరేట్, సెప్టెంబర్ 8
కలెక్టరేట్, సెప్టెంబర్ 8 : స్వరాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే ధ్యేయంతో ముందుకు సాగుతోంది. అర్హులైన వారికి ఇప్పటికే ఉచితంగా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి అందిస్తున్నది. అలాగే, సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి రూ. 3 లక్షల ఆర్ధిక సాయం అందజేసే పథకాన్ని ప్రకటించి, అమలుకు శ్రీకారం చుట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించి, పరిశీలన కూడా చేపట్టాలని ఆదేశించింది.
31,598 దరఖాస్తులు
ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 31,598 దరఖాస్తులు రాగా, గత నెల పది వరకు జిల్లావ్యాప్తంగా 26,461 ధరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజవకర్గ పరిధిలోనివే ఉన్నాయి. ఆ సెగ్మెంట్ పరిధిలోని కమలాపూర్ మినహా మిగతా మండలాల నుంచి 13,437, మానకొండూర్ పరిధిలోని మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం మండలాల్లో 4,499, కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 3,429, చొప్పదండిలోని చొప్పదండి, రామడుగు, మంగాధర మండలాల్లో 3,176, హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న జిల్లాలోని వెన్కెపల్లి సైదాపూర్ మండలంలో 734, చిగురుమామిడి మండలంలో 1186 అర్జీలు వచ్చాయి.
రెండ్రోజుల్లో తుది జాబితా..
గత నెల 10 వరకు వచ్చిన వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించే ప్రక్రియను అధికార యంత్రాంగం శరవేగంగా పూర్తి చేసింది. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించడంతో కొన్ని రోజులుగా సంబంధిత అధికారులు దరఖాస్తుదారుల ఇండ్ల వద్దకు వెళ్లి ఆధార్, రేషన్, ఓటరు గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు, ఇంటి స్థలం తదితర వివరాలు పరిశీలిస్తూ, పక్కాగా సమాచారం సేకరించారు. ఒకటి, రెండు రోజుల్లో తుది జాబితాలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలుస్తోంది. కాగా, అర్హులకు మూడు విడుతలుగా ఆర్థిక సాయం అందజేయనున్నారు. మొదటి విడతగా వారి ఖాతాల్లో రూ.లక్ష జమ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరికి పూర్తైన అనంతరం రెండో దశ లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నట్లు వెల్లడిస్తున్నారు.
మొదటి విడుత 10,500 మందికి
అర్హులందరికీ ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సముఖంగా ఉండగా, మొదటి విడతలో కరీంనగర్ పరిధిలో మూడు వేల మందికి, మానకొండూర్లో రెండు వేల మందికి, చొప్పదండిలో 1650 మందికి, హుజురాబాద్లో 2,600 మందికి, వెన్కేపల్లి సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో 1,250 మంది, మొత్తంగా 10,500 మందికి వారి బ్యాంకు ఖాతాల్లో ఆర్ధిక సాయం జమచేయనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.