కొండగట్టు క్షేత్రంలో దట్టమైన అటవీ ప్రాంతాన్ని సృష్టించి, హరిత సొబగులు అద్దడమే గ్రీన్ ఇండియా చాలెంజ్ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని, ప్రకృతిని కాపాడేందుకు, భవిష్యత్ తరాలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఈ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా కొండగట్టు రిజర్వ్ ఫారెస్ట్లో 1,094 ఎకరాల భూమిని దత్తత తీసుకొన్న ఆయన, శనివారం అటవీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి కొండగట్టు అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులు, వాచ్టవర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణలో జరుగుతున్న పచ్చదనం స్ఫూర్తి విశ్వవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు.
జగిత్యాల, జూలై 15, (నమస్తే తెలంగాణ)/మల్యాల : కొండగట్టు దివ్యక్షేత్రానికి హరిత సొబగులు అద్దడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ముందు తరాలకు అందించాల్సిన అవసరం, బాధ్యత ప్రజలపై ఉందన్నారు. యువత ముఖ్యంగా ముందు తరాల వారి కోసం ప్రకృతిని కాపాడే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో జరుగుతున్న పచ్చదనం స్ఫూర్తి విశ్వవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ ఈ యేడాది ఫిబ్రవరిలో కొండగట్టు క్షేత్రాన్ని దర్శించుకొని అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయడంతోపాటు రూ.వంద కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే, ఆలయ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల వరకైనా కేటాయిస్తామని ప్రకటించిన విషయం విధితమే. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కొండగట్టు పుణ్యక్షేత్రం ఉన్న రిజర్వు ఫారెస్ట్ను దత్తత తీసుకుంటున్నామని, దీన్ని దేశంలోనే గొప్ప అటవీ క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కాగా, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదేళ్లు పూర్తి చేసుకుని, ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్నతరుణంలో శనివారం ఆయన దత్తత కార్యక్రమంతోపాటు అటవీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దత్తత తీసుకున్న 1094 ఎకరాల రిజర్వు ఫారెస్ట్లో కొండగట్టు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధికి 1.04 కోట్లతో పనులు, అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండగట్టును సందర్శించే భక్తులు సేదతీరేందుకు వీలుగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అర్బన్ ఫారెస్ట్ పార్ను తీర్చిదిద్దుతామన్నారు. కొండగట్టు ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని రక్షించి వృద్ధి చేయడంతోపాటు అడవి పలుచగా ఉన్న ఫారెస్ట్ భూముల్లోనూ దట్టంగా అడవిని పెంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. అడవిని చిక్కబరిచేందుకు అటవీ శాఖ చేపట్టే చర్యలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ తనవంతు సహకారం అందిస్తుందన్నారు.
ఎంపీ నిధుల నుంచి 1,04,85,000 కేటాయించామని, అటవీ ప్రాంతానికి రక్షణ కంచె, వాకింగ్ ట్రాక్, వాచ్ టవర్, గజిబోలు, తదితర నిర్మాణాలను చేపట్టనున్నామన్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించామని, గత ఐదేళ్లలో పర్యావరణ రక్షణకు, ప్రకృతి పునరుద్ధరణకు పాటుపడడం అత్యంత సంతృప్తిని కలిగించిందని చెప్పారు. విచ్చల విడిగా పెరిగిన ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, కాలుష్యం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన పెంచడం, పచ్చదనం వృద్ధి లాంటి కార్యక్రమాలను ఆరో విడుత గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రాధాన్యతగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వల్ల పుడమికి పెను ప్రమాదం ముంచుకు వస్తుందని, దానిని ఇప్పటికిప్పుడు పూర్తిగా నిర్మూలించలేకపోయినా, నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సృష్టించే లక్ష్యంతోనే ముందుకు సాగుతామన్నారు. కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు చెందిన నాలుగువేల మంది విద్యార్థులు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగస్వాములుగా మారి, మొక్కలు నాటేందుకు రావడం సంతోషంగా ఉందని, వారందరూ అభినందనీయులన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరికి చెందింది కాదని, ఒక్కరితో జరిగేది కాదన్నారు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. సకల రంగాల్లో అభివృద్ధితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిసున్నారని చెప్పారు. కాళేశ్వరం కట్టినా, యాదాద్రి పునర్నిర్మాణం చేసినా, ఇప్పుడు కోటి మొకుల దేవుడు కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధి నిర్ణయమైనా సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం సెక్రెటరీ భూపాల్రెడ్డి, సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ బాషా, పీసీసీఎఫ్ దొబ్రియాల్, సీసీఎఫ్ శరవణన్, జిల్లా అటవీ శాఖ అధికారి బీ వెంకటేశ్వర్రావు, కరీంనగర్ మేయర్ సునీల్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, పొన్నం అనిల్ గౌడ్, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ఇండియా చాలెంజ్ దేశానికే ఆదర్శం
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం దేశానికే ఆదర్శం. పర్యావరణ సృ్పహను ప్రచారం చేస్తూ, అన్నివర్గాల వారితో మొకలు నాటిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ప్రయత్నం దేశంలో ప్రతి ఒకరికీ ఆదర్శం. సీఎం కేసీఆర్ ఆశయాన్ని సాధించే క్రమంలో భాగంగా కొండగట్టు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని అటవీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన నేతృత్వంలో కొండగట్టు అటవీ ప్రాంతం దట్టమైన అడవిగా వృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు సరిపడా ఆక్సిజన్ అందే పరిస్థితులు వస్తాయి. సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా 265 కోట్ల మొకలను ఇప్పటి వరకు నాటాం. ఈ యేడాది మరో 25 కోట్ల మొక్కలు నాటుతాం. హరితహారంతో అన్ని పల్లెలు, పట్టణాలు పచ్చదనం సంతరించుకున్నాయి. పచ్చదనానికి, పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. సీఎం కేసీఆర్ కృషి వల్ల ఇటీవలే 1.50 లక్షల మందికి నాలుగు లక్షల ఎకరాల పోడు భూముల పంపిణీ జరిగింది. ఇక భవిష్యత్తులో అటవీ సంపద పెరుగుతుంది.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి