Banda Srinivas | హుజూరాబాద్ రూరల్, మే19 : రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా అరిగోస పెడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్ వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం పండించిన పంటను కూడా కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్లాల మీదే ధాన్యం కొనుగోలు చేసేవారని గుర్తు చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు కొర్రీలు పెడుతూ ఒక్కో బస్తా మీద నాలుగు నుంచి ఐదు కిలోల తరుగు తీయడంతో పాటు ధాన్యానికి ప్రభుత్వ మద్ధతు ధర చెల్లించడం లేదని అన్నారు. ప్రభుత్వం వహిస్తున్న అలసత్వం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, పలువురు రైతులు మానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఎద్దు ఏడ్చిన యవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదనే సత్యాన్ని గ్రహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.