మీరు ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగిస్తున్నారా..? ఫుల్ చార్జింగ్ చేసి బయటికి వెళ్తే ఎప్పుడు బ్యాటరీ లో అవుతుందో.. బండి ఎక్కడ ఆగిపోతుందో అని టెన్షన్ పడుతున్నారా..? తిరిగి ఇంటికి చేరుతామా..? అలా జరిగితే ఎం చేయాలోనని చింతిస్తున్నారా..? అలాంటి టెన్షన్ ఇక అవసరం లేదు.. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ రేట్లు, కోరలుచాస్తున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన పట్టణాల్లో చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పాలని నిర్ణయించింది. ఆ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 128చోట్ల ఏర్పాటు చేయబోతుండగా, ఇప్పటికే రంగంలోకి దిగిన రెడ్కో అనువైన స్థలాలను గుర్తించింది. ప్రతి లొకేషన్లో ఫాస్ట్ స్పీడ్, స్లోస్పీడ్ చార్జింగ్ కేంద్రాలు పెట్టేందుకు కసరత్తు మొదలు పెట్టగా, ఈవీ వాహనదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– కలెక్టరేట్, ఆగస్టు 29
కలెక్టరేట్, ఆగస్టు 29 : రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. అనేక మంది తమ వాహనాలను ఇండ్లకే పరిమితం చేసి బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు కాలుష్యం కూడా మితిమీరి పోతుండడంతో ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారుల ఆసక్తి మేరకు పలు కంపెనీలు వివిధ మాడళ్లలో వాహనాలను తీసుకురావడం, రాష్ట్ర సర్కారు సైతం ప్రోత్సహిస్తుండడంతో వీటి విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ వాహనాలు నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండా, వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా లేకుండా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాలు దర్శనమిస్తున్నాయి. తమ అవసరం కోసం వాహనదారులు ఎలాంటి శబ్ద కాలుష్యం కూడా చేయకుండా రయ్మంటూ దూసుకుపోతున్నారు. ఒకసారి చార్జింగ్ చేస్తే కనీసం 100 కిలోమీటర్లు వెళ్లే అవకాశం ఉండడంతో, పరిసర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రజలు కూడా వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చిపోయే వారు కూడా వీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
వాహనాలు రయ్య్మ్రంటూ దూసుకెళ్తున్నప్పటికీ వినియోగదారులను చార్జింగ్ భయం వెంటాడుతున్నది. మార్కెట్లో మోడల్ను బట్టి ఒక్కోటి 50కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వాహనాలు ఉన్నప్పటికీ పెరిగిన ప్రయాణాలతో చార్జింగ్ చేయడం సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో వారి అభ్యర్థన మేరకు తెలంగాణ సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పబ్లిక్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 128చోట్ల ఈవీ చార్జింగ్ సెంటర్లు ఇన్స్టాలేషన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతి లొకేషన్లో ఫాస్ట్ స్పీడ్, స్లోస్పీడ్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రెడ్కో డీఎం పేర్కొన్నారు.
నాలుగు కొత్త జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో టీవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. పీపీపీ పద్ధతిలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నది. కరీంనగర్ జిల్లాలో 72, పెద్దపల్లి 30, జగిత్యాల 14, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులైన చార్జ్ పాయింట్ ఆపరేటర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ, ఇటీవలే నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. సదరు చార్జ్ పాయింట్ ఆపరేటర్లకు రెవెన్యూ షేరింగ్ ఆధారంగా పదేళ్ల వరకు స్థలం కేటాయించనున్నారు. ఈ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సొంత ఖర్చులతో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్ రెడ్కో డీఎం పరమాచారి తెలిపారు.
కరీంనగరంలో 15 చోట్ల చార్జ్ పాయింట్లు ఏర్పాటు చేయనుండగా, కలెక్టరేట్లో, కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్లో, జ్యోతినగర్లోని మోర్ సూపర్ మారెట్ ఎదురుగా మున్సిపల్ పారు పకన, జడ్పీ క్వార్టర్స్లో, కమాన్ బస్టాండు ఎదురుగా, మెయిన్ బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మాతాశిశు సంరక్షణ కేంద్రం పకన, ఉమెన్స్ డిగ్రీ కళాశాల సమీపంలో, సంగీత మొబైల్ పకన, ఆర్టీసీ వర్క్షాప్ పకన ఆర్టీసీ దవాఖాన ప్రాంగణంలో, ఆర్ట్స్ కళాశాల మైదానంలో, రాంనగర్లోని మార్క్ఫెడ్ కార్యాలయం, వ్యవసాయ మారెట్ యార్డు ఆవరణలో, బొమ్మకల్ బైపాస్ రోడ్డులో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు. చార్జింగ్ పాయింట్ ఆపరేటర్ల ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే ఈ స్థలాలు కేటాయించనున్నట్లు, అనంతరం ఈవీ స్టేషన్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు.