పిల్లల ఆటాపాటలతో కరీంనగర్లోని ‘ఫ్రీ సమ్మర్ క్యాంప్’ ఫుల్ జోష్గా నడుస్తున్నది. ఈ నెల 5న అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరం హుషారెత్తిస్తున్నది. 27 క్రీడాంశాల్లో ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 8గంటల వరకు శిక్షణ ఇస్తుండగా, సుమారు 3వేల మంది పిల్లలతో ఎటు చూసినా సందడి కనిపిస్తున్నది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడాశాఖ, ఒలింపిక్ అసోసియేషన్ల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో విద్యార్థులకు పౌష్టికాహారం సైతం అందిస్తుండగా, బాలబాలికల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కొత్తపల్లి, మే 20 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపు జోరుగా.. హుషారుగా సాగుతున్నది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడాశాఖ, ఒలింపిక్ అసోసియేషన్ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నది. ఎప్పటిలాగే నగరపాలక సంస్థ నెల రోజుల శిక్షణ శిబిరాన్ని ఈ నెల 5న ప్రారంభించింది. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 8 గంటల దాకా శిక్షణ సాగుతుండగా, పెద్ద సంఖ్యలో పిల్లలు పాల్గొంటున్నారు. వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, కబడ్డీ, కరాటే, రోలర్ స్కేటింగ్, బ్మాడింటన్, ఆర్చరీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్, ఖోఖో, వాటర్ స్పోర్ట్స్, క్రికెట్ ఇలా 27 క్రీడాంశాల్లో సుమారు 3వేల మంది శిక్షణ పొందుతున్నారు. శిక్షణకు హాజరయ్యే పిల్లలకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోనే ప్రతిరోజూ గుడ్డు, పాలు, అరటిపండును ఇస్తున్నారు. డీవైఎస్వో కీర్తి రాజవీరు పర్యవేక్షిస్తున్నారు. కోచ్లకు నగరపాలక సంస్థ 8వేలను గౌరవ వేతనంగా ఇస్తున్నదని మేయర్ వై సునీల్రావు తెలిపారు. కాగా, ఈ సమ్మర్ క్యాంపు వచ్చే నెల 5వ తేదీ దాకా నిర్వహించనున్నారు.
నగర పౌరులను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచేందుకే నగరపాలక సంస్థ ఏటా వేసవిలో ఉచిత క్రీడా శిబిరాలను నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది క్రీడల శిక్షణకు రూ.45 లక్షల వ్యయం చేస్తున్నాం. ఇప్పటికే శిక్షణకు అవసరమైన క్రీడా సామగ్రిని కోచ్లకు అందించాం. నెల రోజుల పాటు నిర్వహించే శిబిరంలో శిక్షణ తీసుకున్న విద్యార్థులకు ప్రతిరోజూ పాలు, గుడ్డు, అరటిపండును అందజేస్తున్నాం. శిక్షణలు పొందుతున్న వారు రాబోయే రోజుల్లో మంచి క్రీడాకారులుగా ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
– వై సునీల్రావు, మేయర్ (కరీంనగర్)
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నాం. క్రీడా కోచ్లకు, శిక్షణ పొందుతున్న వారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే చేసిపెడుతున్నాం. నగరపాలక సంస్థతో పాటు జిల్లా యువజన, క్రీడా శాఖ, ఒలింపిక్ అసోసియేషన్ సహకారంతో శిక్షణను విజయవంతంగా కొనసాగిస్తున్నాం. నేటి పరిస్థితుల్లో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు చాలా ముఖ్యం. క్రీడల్లో రాణిస్తే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడిప్పుడే క్రీడల ప్రాముఖ్యత తెలుస్తుంది. అందుకే ప్రతిరోజు వారే పిల్లలను స్టేడియానికి తీసుకువచ్చి మళ్లీ తీసుకెళున్నారు.
– కీర్తి రాజవీరు, డీవైఎస్వో (కరీంనగర్)
నాకు కరాటే అంటే చాలా ఇష్టం. అందుకే సమ్మర్ క్యాంపులో చేరి 15 రోజులుగా శిక్షణ తీసుకుంటున్న. ఇంట్లో ప్రతి ఒక్కరినీ నా కరాటే పంచ్లతో అదరగొడుతున్న. ఈ విద్యతో నాలో నాకే తెలియని శక్తి వచ్చినట్లు అనిపిస్తున్నది. బలంగా తయారయ్యా. ఇప్పుడు ఎవరితోనైనా ఫైటింగ్ చేయడానికి రెడీ. శిక్షణ ముగిసిన తర్వాత కూడా నేర్చుకుంటా.
– చరిత, కరాటే
సమ్మర్ క్యాంపులో ఎక్కువగా బాస్కెట్బాల్లో శిక్షణ పొందేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సుమారు 100 మంది ప్రతిరోజూ కోచింగ్ తీసుకుంటున్నారు. క్రీడలో బేసిక్ అంశాలను పూర్తి చేసి మెళకువలు నేర్పిస్తున్నా. తక్కువ సమయంలోనే విద్యార్థులు చక్కటి ప్రతిభచూపుతున్నారు. నిరంతరం క్రీడా సాధనతో శారీరకంగా, మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టమైన క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తే వారి భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది.
– శ్రీనాథ్రెడ్డి, బాస్కెట్బాల్ కోచ్
యుద్ధ క్రీడ అయిన ఉషులో శిక్షణ తీసుకుంటున్న. ఉషు కోచ్ కోడూరి శేఖర్ ఆధ్వర్యంలో క్లిష్టమైన ఫిట్స్ను సునాయాసంగా చేస్తున్నా. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించాలనే కసితో మా అమ్మానాన్న ప్రోత్సాహంతో శిక్షణ తీసుకుంటున్న.
– బండారి తేజస్విని, ఉషు