Ramagundam | పెద్దపల్లి, ఫిబ్రవరి 24( నమస్తే తెలంగాణ) : రామగుండం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్లో ఇటీవల జరిగిన కార్పొరేటర్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ రద్దు చేసి తిరిగి ఎన్నికలను నిర్వహించాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్కు పాల్పడిందని, అంతే కాకుండా కరెంట్ తీసేసి బ్యాలెట్ బాక్స్లను సైతం మార్చారని ఆరోపిస్తూ పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఆయన మంగళవారం వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్ కార్యాలయం ఎదుటు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు. ఇందుకు గాను స్థానిక ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, ఓటర్లను బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేసి రిగ్గింగ్తో పాటుగా బ్యాలెట్ బాక్స్లనే మార్చివేశారన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43డివిజన్లలో అక్రమాలు జరిగాయని, ఆ డివిజన్లలో రీపోలింగ్ జరగాలన్నారు. ఈ ఎన్నికలపై తమకు పూర్థి స్థాయి అనుమానాలున్నాయని, రిజల్ట్కు సంబంధించి సైతం బ్యాలెట్లు ఓపెన్ చేసిన తర్వాత ఏ డబ్బా ఓపెన్ చేసినా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తులు రావడం చూస్తే ఓటర్లంతా విస్తుపోయారన్నారు. వాడలల్లో చూసినట్లెతే ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశామని చెబుతుంటే ఫలితాలు ఇలా రావడాన్ని ప్రజలు సైతం స్వాగతించడం లేదన్నారు. అందుకే మెజార్టీ ప్రజలు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గరికి వెళ్లకుండా ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థుల వద్దకు వచ్చారన్నారు.
గెలిచిన అభ్యర్థుల దగ్గరికి వెళ్లకుండా ఓడిన అభ్యర్థుల వద్దకు ప్రజలు ఇలా వేలాదిగా తరళి వచ్చి ఓదార్చుతున్నారని, అక్రమాలకు ఇదే నిదర్శనమన్నారు. నిజాయితీగా ఎన్నికలను నిర్వహించామనే ధీమానే ఉంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఈ డిమాండ్కు తలొగ్గి రీపోలింగ్కు సహకరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత, ఫలితాల వెళ్లడి రోజు ఆరోజు పూర్తిగా కరెంటు పోయిందని, సీసీ కెమరాలకు సంబంధించిన పూర్తి విజువల్స్ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఆ బ్యాలెట్లను సైతం ఎంత సేపు ఎక్కడ ఉంచారనే విజువల్స్ను సైతం బయటపెట్టాలన్నారు. అవినీతి పరమైన, అరాచకమైన, గుండాయిజంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో గెలవాలనే విధానానికి చరమగీతం పాడాలన్నారు. పెద్దపల్లి కలెక్టర్ నిస్పక్షపాతంగా విచారణ జరిపి ఎన్నికలను నిర్వహించాలన్నారు. త్వరలోనే ఎన్నికల కమిషన్ను సైతం కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు నారాయణదాస్ మారుతితో పాటు పలువురు ఉన్నారు.