రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియామవళిని తూ.చ. తప్పకుండా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణమే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. సోమవారం కలెక్టరేట్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. నవంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13న పరిశీలన, 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందన్నారు. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయని చెప్పారు. కోడ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు చేయాలనుకునేవారు 1950 కంట్రోల్ రూం నంబర్ను సంప్రదించాలని కోరారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలకు ఉపక్రమిస్తామన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలాంటి గుర్తులున్నా 48గంటల్లోగా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కోడ్ అమలు కోసం ప్లయింగ్ స్వాడ్లు, ఎస్ఎస్టీ, వీఎస్టీ, ఎంసీఎంసీ టీంలను క్రియాశీలకం చేశామన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 171 (బీ) ప్రకారం డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం నేరమన్నారు. 171 (సీ) ప్రకారం ఓటర్లను బెదరించడం నేరమని ఆయన తెలిపారు. కరపత్రాలు, పోస్టర్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్యూనిట్లు కచ్చితంగా వాటిపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లను విధిగా ప్రచురించాలన్నారు. ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ల స్వీకరణకు పదిరోజుల ముందు వరకు అక్టోబర్ 1నాటికి 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కోరారు.
ప్రజాస్వామ్యానికి ఎన్నికలు గుండెకాయ వంటివి: ఎస్పీ
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు గుండె కాయలాంటివన్నారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ తమ వంతు సహకారం అందిస్తుందన్నారు. రాజకీ పార్టీల ప్రతినిధులు, ప్రజలు అందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు తప్పవని హెచ్చరించారు. మంగళవారం నుంచి జిల్లా సరిహద్దులోని అన్ని ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు మెస్సేజ్లు పెట్టకూడదని, వచ్చిన మేసేజ్లను వేరే వారికి, గ్రూపులలో ఫార్వర్డ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఫార్వర్డ్ చేసిన వ్యక్తులు, అడ్మిన్పైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్, డీపీఆర్వో దశరథం తదితరులు పాల్గొన్నారు.