భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కింది స్థాయి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తూనే అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సిరిసిల్లలోని నీటమునిగిన పలు కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న వారితోపాటు లోతట్టు, మంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగే వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు వేములవాడ పట్టణంలో పరిశీలించారు. 35 బుడగజంగాల కుటుంబాలకు రూ.3వేల చొప్పుల ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించారు.
– రాజన్న సిరిసిల్ల, జూలై 27 (నమస్తే తెలంగాణ)
భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్గా ఉండి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలు ముమ్మురం చేయాలి. వారం రోజులుగా విడవకుండా కురుస్తున్న వానల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. సిరిసిల్ల పైన ఉన్న చిన్న బోనాల చెరువు కట్ట తెగినందున పట్టణ ప్రభావిత ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి, సహాయక చర్యలు చేపట్టాలి. అవసరమైతే సహాయక చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ నుంచి యంత్రాలను పంపిస్తాం. ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలోనే ఉండి సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి.
– ఫోన్ ద్వారా కలెక్టర్, ఎస్పీకి మంత్రి కేటీఆర్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టాలి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు, ప్రమాదం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
– ప్రగతి భవన్ నుంచి కరీంనగర్ కలెక్టర్, సీపీ, ప్రజాప్రతినిధులకు వినోద్కుమార్ సూచన
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు భారీ వర్షాన్ని సైతం లేక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజల మధ్యనే ఉండి సేవలందిస్తున్నారు
– రాజన్న సిరిసిల్ల, జూలై 27 (నమస్తే తెలంగాణ)
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలుగకుండా అధికారయంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. సిరిసిల్ల వరద నీటిలో చిక్కుకున్న ఓగర్భిణినిని పోలీసులు తమ వాహనంలో సురక్షిత ప్రాంతానికి తరలించారు.
సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట, అశోక్నగర్, సర్ధార్నగర్, సంజీవయ్యనగర్, అటోనగర్, పాతబస్టాండ్, వాసవీనగర్, కుమార్గల్లీ, శాంతినగర్, శ్రీనగర్ కాలనీల్లోని ఇండ్లలోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, కాళేశ్వరం ప్యాకేజీ ఈఈ నల్ల వెంకటేశ్వర్లు ఆదేశాల ఈ మేరకు బైపాస్రోడ్డులోని కాళేశ్వరం 9 ప్యాకేజీ అప్రోచ్ చానెల్కు గండి కొట్టి వరద నీటిని మానేరులోకి మళ్లించారు.
సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఖిమ్యానాయక్, కాళేశ్వరం 9వ ప్యాకేజీ ఈ గంగం శ్రీనివాస్రెడ్డి, అమరేందర్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పర్యటిస్తూ చెరువులు, ప్రాజెక్టులను సందర్శించారు. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇస్తున్నారు. సిరిసిల్లలోని సాయిమణికంఠ గార్డెన్ వద్ద రెండు, జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయం వద్ద 6 విద్యుత్ స్తంభాలు పడిపోయి కలెక్టరేట్, చంద్రంపేట, సెస్, సుభాషనగర్, వివిధ వార్డులకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో సిబ్బంది హుటాహుటినా వెళ్లి భారీ వర్షంలోనే స్తంభాలను నిలబెట్టి విద్యుత్ సరఫరా మెరుగు పరిచారు.
సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఎండీ రామకృష్ణ ఆధ్వర్యంలో సెస్డైరెక్టర్లు, 250 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సిరిసిల్ల శివారులోని గిద్దచెరువు, బైపాస్రోడ్డు, వేములవాడలో కలెక్టర్, ఎస్పీలు పర్యటించి చెరువులు, వాగులను పరిశీలించి, ప్రతి మండలానికి ఒక డీఈ, ఇద్దరు ఏఈలను కేటాయించారు. వైద్యాధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులకు సెలవులు రద్దు చేసి అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు వేములవాడ పట్టణంలోని కాలనీల్లో పరిశీలించారు. 35 బుడిగజంగాల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 3వేల చొప్పున సాయం అందించారు.
తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లెకు చెందిన ఎలక్ట్రీషియన్ రమేశ్ మంత్రి కేటీఆర్పై ఉన్న అభిమానంతో తన ఐదుగురు స్నేహితులతో కలిసి రెస్క్యూ టీం ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని అనంతనగర్లో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకు పోతుంటే కాపాడారు. సంజీవయ్యనగర్కు చెందిన పది మంది వరదనీటిలో చిక్కుకు పోతే వారిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.