రాయికల్, అక్టోబర్ 10: ‘గతంలో తెలంగాణ ప్రాంతాన్ని ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. కానీ ఏం చేశాయి. ప్రజల బాధలు ఏనాడైనా పట్టించుకున్నాయా..? కనీస సౌకర్యాలైనా కల్పించాయా..? ఏ ఒక్క పనికాక, సంక్షేమ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మళ్లీ అలాంటి పార్టీలను నమ్ముదామా..? నేనొక్కటే కోరుతున్నా.. పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలి’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘మీరు నేను’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాయికల్ మండలం బోర్నపల్లికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెళ్లారు. వీధుల్లో పర్యటించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. మీ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. బోర్నపల్లి ప్రజల చిరకాల కల అయినా వంతెన నిర్మాణం చేయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. గ్రామంలో ఇప్పటి వరకు రూ.7 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఆసరా పింఛన్ల ద్వారా 68 మందికి ప్రతి నెలా రూ.1.50లక్షల చొప్పున ఇప్పటివరకు రూ.కోటి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
గ్రామంలో 15 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం కింద సాయం అందిందన్నారు. 88మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు రూ.90 లక్షలు వారి ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. 21 మంది గొల్ల, కుర్మలకు సబ్సిడీ గొర్రెలను అందజేసి కులవృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కాగా, అంతకుముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఇక్కడ గ్రామ సర్పంచ్ పాదం లత రాజు, ఎంపీటీసీ సభ్యురాలు ఆత్రం విజయ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్, మారెట్ కమిటీ చైర్ పర్సన్ రాణి, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.