SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు పంటలకు నీరందక రైతులు పశువుల మేతకు వినియోగించారు.
చేతికచ్చే పంటలు నీళ్లు లేక, బోర్లు ఎత్తి పోయి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఈ క్రమం లో మిగిలిన చేతికొచ్చిన పంట, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఉన్న ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. . ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా రూ.1700 నుంచి రూ.1800లకే క్వింటాలుకు అమ్ముకోవడం గమనార్హం.
తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉదయాన్నే కళ్లాల వద్ద కాంటాలు పెట్టి ధాన్యాన్ని దళారులు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి కైన ప్రభుత్వం స్పందించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధర రైతులకు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.