Etela Rajender | చిగురుమామిడి, సెప్టెంబర్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని, కనీసం పంటలకు సరిపడా కరంట్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మల్కాజిగిరి ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఉద్యమ సహచరుడు, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు గీకురు రవీందర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం మృతుడి కుటుంబాన్ని రవీందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సహచరుడిని కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు.
కనీసం పంటలకు 8 గంటలు కూడా కరంటు ఇవ్వలేని దుస్థితిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి కాకుండా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. సరైన విద్యుత్ లేక మక్క, వరి, పత్తి పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు రోడ్డుపైకి వచ్చి ధర్నా రాస్తారోకోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ చల్లా నారాయణరెడ్డి, గురుకుల పల్లె సర్పంచ్ గురుకుల మధుసూదన్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, మాజీ జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, నాయకులు కందుల సంధ్యారాణి, జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు, చొప్పరి వేణు, పిట్టల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.