ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర సర్కారు, ప్రజా వైద్యాన్ని మరింత చేరువ చేస్తున్నది. కోట్లాది రూపాయలతో ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్నది. ఆధునిక సౌకర్యాల కల్పనతోపాటు అవసరమైనచోట కొత్త వైద్యశాలలు నిర్మిస్తూ, సేవలను మరింత విస్తృతం చేస్తున్నది. అందులో భాగంగా మెట్పల్లి, నందిమేడారంలో సీహెచ్సీలు, ధర్మపురిలో డయాలసిస్ సెంటర్కు నూతన భవనాలను నిర్మించబోతున్నది. నేడు మంత్రి హరీశ్రావు వీటికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కోరుట్లలో డయాలసిస్ సెంటర్, బస్తీ దవాఖాన, ధర్మపురిలో ఐసీయూ, ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. మెట్పల్లి, నందిమేడారంలో ఏర్పాటు చేయనున్న సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ పర్యవేక్షిస్తుండగా, ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమయ్యారు.
మెట్పల్లి/ కోరుట్ల/ ధర్మపురి, జనవరి 4 : స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. పేద ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలతో దవాఖానలను బలోపేతం చేస్తున్నది. ఆధునిక పరికరాలు సమకూర్చడంతోపాటు సకల వసతులు కల్పిస్తున్నది. అంతే కాకుండా అవసరమైన చోట అత్యాధునిక ప్రమాణాలతో కొత్త వైద్యశాలలను ఏర్పాటు చేయడంతోపాటు భవనాలను నిర్మిస్తున్నది. అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి గురువారం పలు ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేయనున్నారు. ముందుగా కోరుట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో డయాలసిస్ సెంటర్, కోరుట్ల బస్తీ దవాఖానను ప్రారంభించనున్నారు. అనంతరం మెట్పల్లికి చేరుకొని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నేరుగా స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్రావు నివాసానికి చేరుకొని, లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2గంటలకు ధర్మపురికి బయలుదేరి వెళ్తారు. అక్కడ ఆక్సిజన్ ప్లాంట్, పది పడకల ఐసీయూని ప్రారంభిస్తారు. డయాలసిస్ సెంటర్ భవన పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3.45గంటల వరకు ధర్మారం మండల నందిమేడారం చేరుకొని, సీహెచ్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్తారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఆయాచోట్ల ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం కోరుట్లలో విద్యాసాగర్రావు, ధర్మపురిలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా. శ్రీకాంత్రెడ్డి, ధర్మారంలో స్థానిక నాయకులు పరిశీలించారు. భారీ బైక్ ర్యాలీతో మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్కు స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం చేశారు. ధర్మారం నుంచి నంది మేడారం దాకా రోడ్డుకు ఇరువైపులా స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
మెట్పల్లి సామాజిక వైద్యశాల (సీహెచ్సీ) మెరుగైన వైద్యసేవలందిస్తున్నది. సాధారణ ప్రసవాల్లో రాష్ట్రంలోనే 50 పడకల దవాఖానల్లో టాప్10లో నిలుస్తున్నది. ఇక్కడ ఔట్ పేషేంట్ల సంఖ్య రోజుకు సగటున 200 దాకా ఉంటుంది. మెట్పల్లి పట్టణంతోపాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాలతోపాటు సమీప రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని మండలాల నుంచి ఇక్కడికి వందలాది మంది వైద్యం కోసం వస్తున్నారు. ప్రతి రోజు సగటున 250కి పైగా ఓపీ నమోదు అవుతుండగా, అందుకు తగ్గట్టుగా సేవలందిస్తున్నారు. వారంలో మూడు రోజులు హెర్నియా, హైడ్రోసిల్, అపెండిసైటిస్, గర్భసంచి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ప్రసవాలు చేయడంలో రాష్ట్రంలోనే తమదైన గుర్తింపు పొందగా, 2017-18 నుంచి 2022 డిసెంబర్ 31 వరకు 12, 575 మంది గర్భిణులకు ప్రసవాలు చేశారు. అందులో 10,654 మందికి కేసీఆర్ కిట్లు అందించారు. ఆరోగ్య శ్రీలోనూ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రసవాలు, ఇతరత్రా వైద్యచికిత్సలు, అందిస్తున్న వైద్యసేవలు ప్రశంసలు తెచ్చిపెడుతుండగా, పెరుగుతున్న మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతన భవన నిర్మించాలని సంకల్పించారు. ప్రస్తుత పాత భవనాన్ని తొలగించి దాని స్థానంలో 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్ వన్ భవనం నిర్మాణానికి ప్రభుత్వం 7.50 కోట్లు కేటాయించింది. జీప్లస్+1 పద్ధతిని నిర్మించనుండగా, టెండర్ల ప్రక్రియ కూడా ఇటీవలే పూర్తి చేశారు. నేడు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు.
మున్సిపల్ పరిధిలోని ప్రజలకు సత్వర వైద్యం అందాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కారు బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెస్తున్నది. అందులో భాగంగా కోరుట్ల పట్టణంలోని హజీపురాలో 15వ ఆర్థిక సంఘం నిధులు 13 లక్షలతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన వైద్య సేవలకు ముస్తాబైంది. ఇప్పటికే వైద్య పరికరాలు, మందులు, ఫర్నిచర్ను కొనుగోలు చేశారు. బస్తీ దవాఖాన ఏర్పాటుతో హజీపురా, సంజీవయ్య నగర్ కాలనీ, సాయిరాంపురా, మాదాపూర్ కాలనీ, భీమునిదుబ్బ కాలనీ వాసులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ కాలనీలు ప్రభుత్వ ఏరియా దవాఖానకు దూరంగా ఉండగా వైద్య సేవలకు ఇబ్బందులు కలిగేవి. ఇకపై ముంగిట్లోనే వైద్య సేవలు అందనున్నాయి. ఉచిత వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలు టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా అందుబాటులోకి రానున్నాయి. దవాఖానలో ఎంబీబీఎస్ వైద్యుడు, స్టాఫ్ నర్సు, ముగ్గురు వైద్య సిబ్బంది సేవలు అందించనున్నారు.
కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల కోసం రాష్ట్ర సర్కారు నియోజకవర్గ కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నది. కోరుట్లకు కూడా మంజూరు చేసింది. స్థానిక ప్రభుత్వ ఏరియా దవాఖానలో టీఎస్ఎంఐడీసీ నిధులతో డీసీడీసీ సంస్థ పర్యవేక్షణలో సెంటర్ను అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఐదు డయాలసిస్ పరికరాలతో సుమారు నెలకు వంద మందికి సేవలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సెంటర్ అందుబాటులోకి వస్తే కోరుట్ల, మెట్పల్లి డివిజన్ ప్రజలతో పాటూ కథలాపూర్, మేడిపల్లి మండలాలకు చెందిన కిడ్నీ బాధితులకు సాంత్వన కలుగనున్నది. డయాలసిస్ సెంటర్లో నెఫ్రాలజిస్ట్ నిత్యం అందుబాటులో ఉంటుండగా, ప్రభుత్వ ఏరియా దవాఖాన వైద్య సిబ్బంది వైద్య సేవలు, ఉచితంగా మందులు సరఫరా చేస్తారు.
ధర్మారం మండలంలోని 29 గ్రామాలకు నంది మేడారం పీహెచ్సీయే దిక్కు. 1958లో ఆరు పడకల సామర్థ్యంతో ఏర్పాటైన ఈ కేంద్రంలో ప్రస్తుతం ఇద్దరు వైద్యులు సేవలందిస్తున్నారు. ఈ సెంటర్ పరిధిలో 10 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా, 12 మంది ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్ వైజర్లు, హెచ్ఈవోలు, హెల్త్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ప్రతి రోజూ ఇక్కడ 200 మందికి ఓపీ చూస్తుంటారు. అయితే ఆరు పడకలే ఉండడంతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి ఈశ్వర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రస్తుత పీహెచ్సీని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)గా అప్గ్రేడ్ చేయించారు. ఈ క్రమంలో నూతన దవాఖాన నిర్మాణానికి 5.75కోట్లు, సామగ్రి, మెయింటనెన్స్ కోసం 1.57కోట్లు మంజూరు చేశారు. అయితే ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసుకొని శంకుస్థాపనకు సిద్ధమైంది. కాగా, గ్రౌండ్ ఫ్లోర్లో 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుండగా, వైద్య నిపుణులతోపాటు వైద్య సిబ్బంది సంఖ్య కూడా పెరుగనున్నది. మండల ప్రజలకు మెరుగైన వైద్యం అందనుండగా, నిర్మాణ పనులకు నేడు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు.
నందిమేడారం దవాఖానను విస్తరించాలనే ధర్మారం మండల ప్రజల కల నెరవేర్చడం ఎంతో ఆనందంగా ఉంది. 6 పడకల నుంచి 30 పడకలకు అప్గ్రేడ్ అయింది. కొత్త దవాఖాన అందుబాటులోకి వస్తే వైద్యులు, సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. మండల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి.
– కొప్పుల ఈశ్వర్ , మంత్రి