జగిత్యాల రూరల్, ఏప్రిల్ 23: వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో యాళ్ల భాస్కర్ రెడ్డి, యాళ్ల భరత్ రెడ్డి, కొప్పెర పవన్ రెడ్డికి చెందిన మామిడి తోటలు, పన్నాల రాజవ్వకు చెందిన నువ్వు పంటను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడారు. గత రెండు రోజులుగా ఈదురు గాలులు, అకాల వర్షంతో జగిత్యాల జిల్లాలో మామిడి, నువ్వు, జామ, ఇతర పంటలు చాలా దెబ్బతిన్నాయన్నారు. 34వేల ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేయగా, ఇందులో 31వేల ఎకరాల్లో నష్టం జరిగిందని, సుమారు 80శాతం పంట దెబ్బతిన్నదన్నారు.
రైతులు కష్టపడి సాగు చేసిన మామిడి కాయలు చేతికచ్చే దశలో తీవ్రంగా నష్టపోయారని, అధికారులు రూపొందించిన నివేదికలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా జిల్లా ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై సర్వే చేయాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి నష్టం వివరాలు తెలియజేసి నష్టపరిహారం అందించాలని కోరారు. ఇక్కడ సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ నలువాల సునిత లక్ష్మణ్, ఆత్మ చైర్మన్ ఎలేటి రాజిరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగన్న, రైతుబంధు సమితి అధ్యక్షుడు తూర్పాటి రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, నాయకులు బలభక్తుల కిషన్, బోయపోతు గంగాధర్, చిట్టి తదితరులు పాల్గొన్నారు.