వేములవాడ, జనవరి 18: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ తొలగించి మాట్లాడాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు హితవుపలికారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వస్త్ర పరిశ్రమపై ఎంపీ లేఖ రాయడాన్ని తప్పుపడుతూ గురువారం వేములవాడలో మాట్లాడారు. 2004 సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చి వస్త్ర పరిశ్రమ అభివృద్ధి పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సిరిసిల్లకు ప్రత్యేక ప్యాకేజ్ అందించారన్నారు. మరో నాలుగు నెలల్లో పదవి కోల్పోతున్న ఎంపీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి చాతనైతే వస్త్ర పరిశ్రమ మీద ఉన్న జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి పాదయాత్రలోనే నేతన్నలతో మాట్లాడి కార్మికుడే ఓనర్ అయ్యే పథకాన్ని తీసుకవస్తామని చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, నాయకులు రమేశ్, రాకేశ్, కృష్ణాగౌడ్, రాంబాబు, శ్రీనివాస్, ఉమేందర్, శ్రీధర్, చిలివేరి శ్రీనివాస్గౌడ్, శ్రావణ్, రెగ్జిన్ శ్రీనివాస్, జమున, సాయి ఉన్నారు.
స్వర్ణకారులకు ఏ ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఏర్పాటుచేసిన స్వర్ణకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందిస్తానని హామీ ఇచ్చారు. సంఘ భవనం కోసం రూ.5లక్షలు కేటాయిస్తానని చెప్పారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ చారి, నాయకులు ఉన్నారు.
రుద్రంగి, జనవరి 18: నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు, గ్రామస్తులు, నాయకులతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు, దవాఖాన, రోడ్లు, ప్రధాన రాహదారి వెంబడి సైడ్ డ్రైనేజీ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభలత, తాసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో శంకర్, ఎంపీవో సుధకార్ తదితరులు పాల్గొన్నారు.