కరీంనగర్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహిస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, రాజకీయ కుట్రలో భాగమని మండిపడుతున్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న తరుణంలో ఆమెను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఏడాదిన్నర కాలంగా కవితను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నదని ధ్వజమెత్తారు.
ఈడీ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నా మహిళ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారని, మహిళల హక్కులను కాలరాస్తున్నారని సుప్రీం కోర్టులో కవిత కేసు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రోజు కేసు విచారణ జరుగాల్సి ఉందని, కవిత తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 19కి వాయిదా పడిందని చెబుతున్నారు. ఇది విచారణ సాగుతుండగానే అరెస్ట్ చేయడం ఏంటని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు. ఈ అరెస్ట్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని మరో పక్క న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఒక చోట కేసు నమోదై మరో చోట అరెస్ట్ జరిగినప్పుడు ట్రాన్సిట్ వారెంట్ పొంది అరెస్ట్ చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పట్టించుకోకపోవడం పూర్తిగా అప్రజాస్వామికని ఖండిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే అని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు రోజే అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నయని, ఇది అనైతికం, అక్రమమని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకురాలు కవితను కావాలనే వేధింపులకు గురి చేస్తున్నారని, శని, ఆదివారాలు సెలవు దినాలని తెలిసే శుక్రవారం ఉద్దేశ పూర్వకంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు.
కేంద్రంలోని మోదీ సర్కారు ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని, వాళ్లకు అనుకూలంగా లేని నేతలపై ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ కుట్ర పన్ని అరెస్ట్ చేయించాయని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకుల కనుసన్నల్లోనే ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరించిందని ఆరోపిస్తున్నారు. అయినా అక్రమ కేసులు, అరెస్ట్లు తమకేమీ కొత్తకాదని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. అరెస్ట్ను ఖండిస్తూ శుక్రవారం రాత్రి జగిత్యాలతోపాటు పలుచోట్ల నిరసనలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు శనివారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేసేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి పాల్గొననున్నారు.
కవిత అరెస్ట్ కచ్చితంగా కక్ష సాధింపే. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక్కటై కవితను అరెస్ట్ చేయించినయి. ఒక మహిళగా మూడుసార్లు ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణ పద్ధతి బాగా లేదని సుప్రీం కోర్టులో ఆమె పిటీషన్ వేశారు. అది విచారణ జరుగుతుండగానే అరెస్ట్ చేయడం ఏంటి? అందులో రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తున్నది. కవిత కేసుపై 19న సుప్రీం కోర్టులో విచారణ జరుగాల్సి ఉంది. ఈడీ అధికారులు అప్పటి వరకు ఆగలేరా..? కవిత ఏమన్న దేశం వదిలి వెళ్లి పోతున్నారా..? ఎప్పుడు విచారణ జరిగినా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. కేసు పెండింగ్లో ఉండగా అరెస్ట్ చేయడం సుప్రీంకోర్టును ధిక్కరించడమే అవుతుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆడబిడ్డను వేధించడమే అవుతుంది. అవమానించడం అవుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే ఈ చర్యకు పాల్పడింది. ఇంతకు ఇంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
– నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ
కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో కావాలని ఇరికించారు. ఈ కేసులో ఎందరినో అరెస్ట్ చేశారు. ఈ రెండేళ్ల కాలంలో రాని అరెస్ట్ అవసరం ఇప్పుడే ఎందుకు వచ్చింది? పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయంలో అరెస్ట్ చేసి బీఆర్ఎస్ను అబాసుపాలు చేయాలనే ఉద్దేశం నాయకుల్లో కనిపిస్తున్నది. కవిత అరెస్ట్తో కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీయాలనేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కుట్ర. అక్రమ అరెస్టులు, కేసులు మాకేమీ కొత్తకాదు. ఎలాంటి కేసులనైనా న్యాయపరంగా ఎదుర్కొంటాం. మా ప్రతిష్ట దెబ్బతీయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.
– సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే
కవిత అరెస్ట్ పూర్తిగా అప్రజాస్వామికం. కక్ష సాధింపునకు పాల్పడి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తున్నది. రాష్ట్రంలో ఆ పార్టీకి అభ్యర్థులు దొరకని నేపథ్యంలో బీఆర్ఎస్ను డిస్ట్రబ్ చేయాలని ఈ అనైతిక చర్యకు పాల్పడింది. ఇలాంటి సమయంలో కార్యకర్తలు సంయమనంతో వ్యహరించాలి. శాంతియుతంగా నిరసనలు తెలుపాలి. అరెస్ట్కు నిరసనగా శనివారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు చేస్తాం. కేసులు, అరెస్ట్లు, జైళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు కొత్తేమీ కాదు. ఎలాంటి కేసులనైనా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నం.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు