ఉపాధి కోసం వెళ్లి ఎడారి దేశంలో ఆగమైన బతుకులకు అమాత్యుడు రామన్న భరోసానిచ్చారు. ఏజెంట్ల మోసంతో దుబాయిలో చిక్కుకొని బిక్కు బిక్కుమంటున్న ఆరుగురు యువకులకు ‘నేనున్నా’నంటూ అభయమిచ్చారు. ప్రత్యేక చొరవ తీసుకొని వారిని స్వదేశానికి రప్పించడమే కాకుండా, ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక వాహనంలో స్వగ్రామాలకు పంపిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఒకరు క్షేమంగా ఇండ్లకు చేరుకున్నారు.
కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, అక్టోబర్ 28 : సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లికి చెందిన గుగులోత్ అరవింద్, నారాయణపూర్కు చెందిన పెద్దోళ్ల స్వామి, చందుర్తి మండలం ఎన్గల్కు చెందిన మారుపాక అనిల్, వెంగల తిరుమలేశ్, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన గొల్లపల్లి రాము, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లికి చెందిన బద్రిపురం నరేందర్ అనే గల్ఫ్ ఏజెంట్ను నమ్మి ఐదు నెలల కిందట దుబాయ్కి వెళ్లారు. అక్కడ ఏజెంట్ చెప్పినట్లుగా కాకుండా వేరే పని, తక్కువ జీతం ఇవ్వడంతో కంపెనీ యజమానులతో వాగ్వాదానికి దిగారు. యాజమాన్యం ఫిర్యాదుతో అక్కడి పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. యువకులు మరోసారి యాజమాన్యాన్ని నిలదీయడంతో టికెట్ మీరే కొనుక్కొని స్వదేశాలకు వెళ్లాలని యువకులకు కంపెనీ ప్రతినిధులు పాస్పోర్టులు అప్పగించారు. దీంతో వీరు టికెట్ తెప్పించుకొని ఇండియాకు వచ్చేందుకు 20 రోజుల క్రితం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కానీ, అక్కడ పోలీసులు మీపై కేసులు ఉన్నాయంటూ బయటికి పంపించారు. కంపెనీ యాజమాన్యం, ఏజెంట్ను ఫోన్లో సంప్రదించినా ఫలితం లేకపోవడంతో రెండు రోజులు ఎయిర్పోర్టు పార్కింగ్ ఏరియాలో పడిగాపులుగాశారు. చేతిలో చిల్లిగవ్వలేక పస్తులున్నారు. ఇంటికి వచ్చే దారిలేక నరకయాతన అనుభవించారు.
అండగా నిలిచిన అమాత్యుడు
20 రోజుల క్రితం తమ బాధలను సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. తమను స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. దీంతో అమాత్యుడు స్పందించి, ఆ యువకులు స్వదేశానికి వచ్చేలా ఏర్పాటు చేయాలని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహులుకు సూచించడంతోపాటు ఎంబసీ అధికారులతో మాట్లాడారు. అమాత్యుడి ఆదేశాల మేరకు నర్సింహులు కూడా పలుసార్లు కంపెనీ నిర్వాహకులతో మాట్లాడగా, యువకులపై పెట్టిన కేసులు విత్డ్రా చేసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సొంత ఖర్చులతో విమాన టికెట్లు బుక్ చేయగా, గురువారం అర్ధరాత్రి ఆరుగురు యువకులు క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఎయిర్పోర్టులో బంజారా సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గుగులోతు సురేశ్నాయక్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వీర్నపల్లి మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, జడ్పీ కో అప్షన్ చాంద్ పాషా, వీర్నపల్లి సర్పంచ్ పాటి దినకర్, సీనియర్ నాయకుడు నలిమేట చంద్రం ఆ యువకులను కలిశారు. యువకుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి యువకులను క్షేమంగా ఇండ్లకు పంపించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్తోపాటు జీడబ్ల్ల్యూపీసీ ప్రతినిధులు గుండెల్లి నర్సింహులు, శేఖర్గౌడ్, చిట్టిబాబుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటికి చేరుతామనుకోలె
లక్ష రూపాయలు అప్పు చేసి వేములవాడ ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లిన. ఏజెంట్ చెప్పిన జీతం అక్కడి కంపెనీ ఇవ్వలేదు. ఇదేంటని కంపెనీ నిర్వాహకులను ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టిన్రు. ఇండియాకు వద్దామని అక్కడి ఎయిర్పోర్టుకు చేరుకోగానే అధికారులు అడ్డుకున్నరు. రెండు రోజులు ఎయిర్పోర్టు పార్కింగ్ స్థలంలో తలదాచుకున్నం. కంపెనీ యాజమాన్యం పెట్టిన ఇబ్బందులకు ఇంటికి వస్తామనుకోలె. మమ్మల్ని కాపాడాలని మంత్రి కేటీఆర్ సారును సోషల్ మీడియాలో వేడుకున్నం. ఆ సారు వెంటనే స్పందించిండు. మమ్మల్ని స్వదేశం రప్పించేలా చొరవ తీసుకున్నడు. మంత్రికి, నర్సింహులు అన్నకు రుణపడి ఉంటం.
– గుగులోతు అరవింద్, వీర్నపల్లి
కేటీఆర్ సారుకు రుణపడి ఉంటం
ఏజెంట్ల మోసానికి నా కొడుకు గల్ఫ్లో చిక్కుకుని మస్తు ఇబ్బందులు వడ్డడు. వస్తడో రాడో అనుకున్నం. మా పిల్లలను ఎలాగైనా ఇంటికి రప్పించాలని మేం మంత్రి కేటీఆర్ సారును వేడుకున్నం. మా ఊరోళ్లు కూడా ట్విట్టర్ ద్వారా విన్నవించిన్రు. కేటీఆర్ సారు మాకు అండగా నిలిచిండు. వెంటనే ఇంటికి రప్పించిండు. మంత్రి కేటీఆర్కు, జీడబ్ల్యూపీసీ సభ్యుడు గుండెల్లి నర్సింహులుకు మా కృతజ్ఞతలు. వారికి రుణపడి ఉంటం.
– విలేకరులతో గల్ఫ్ బాధితుడు స్వామి తండ్రి రాజయ్య
అమ్మానాన్నను చూస్తాననుకోలె
దేశంగాని దేశంలో ఆగమైనం. ఏజెంట్ మాటలు నమ్మినం. దుబాయిల మంచి జీతం ఇస్తరంటే కంపెనీ వీసా మీద పోయినం. అక్కడ కంపెనీ ఎక్కువ పని చేయించుకొని తక్కువ జీతం ఇచ్చింది. గిదేందని అడిగితే కేసులు పెట్టిన్రు. ఇండియాకు రాకుండా మమ్మల్ని పట్టుకున్నరు. భయంతో వణికిపోయినం. మా అమ్మానాన్నను చూస్తననుకోలె. మా బాధలను వీడియో తీసి వాట్సాప్ల మంత్రి కేటీఆర్కు పంపినం. కేటీఆర్ సార్ దయతో మేం ఇంటికి వచ్చినం. ఆ సారుకు రుణపడి ఉంటం.
– గొల్లపల్లి రాము, బావుసాయిపేట
(కోనరావుపేట)