కరీంనగర్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. స్వచ్ఛతలో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నది. పారిశుధ్యం, తడి, పొడిచెత్త వివిధ అంశాల నిర్వహణలో ఏటా రికార్డులకెక్కుతున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో మన మూడు జిల్లాలు జాతీయ స్థాయిలో మెరిశాయి. డిసెంబర్ నెలకు కేంద్రం ప్రకటించిన 4 స్టార్ కేటగిరీ ర్యాంకింగ్స్లో దేశంలోనే తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే ప్రథమ, కరీంనగర్ ద్వితీయ, పెద్దపల్లి తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ మేరకు గత మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఇండ్లలో మరుగుదొడ్ల వాడకం, అన్ని గ్రామాల్లో తడి, పొడిచెత్త, కంపోస్టు షెడ్లు, మురుగునీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ర్యాంకులు ప్రకటించగా, సర్వత్రా హర్షం వ్యక్తమైంది. మంత్రి కేటీఆర్ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపగా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమ స్ఫూర్తితోనే హై అచీవ్మెంట్ను సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలు చేసినప్పటి నుంచే గ్రామాలు స్వచ్ఛగా మారుతున్నాయని, జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొంటున్నారు.
సిరిసిల్ల దేశంలోనే నంబర్ 1
రాజన్న సిరిసిల్ల, జనవరి 6(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా అద్భుత విజయాలను సాధిస్తూ దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నది. ఇంటింటా మరుగుదొడ్డి, తాగునీరు, తడిచెత్త, పొడిచెత్త, పారిశుధ్యం లాంటి 19 అంశాల్లో సత్తా చాటుతూ ర్యాంకులు సాధిస్తున్నది. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రగతిలో పరుగులు పెడుతున్న గ్రామాలు స్వచ్ఛతలోనూ ప్రత్యేకతను చాటుతున్నాయి. పారిశుధ్యం, ఇంటింటా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, తడిచెత్త, పొడి చెత్త, కంపోస్టు షెడ్లు, సేంద్రియ ఎరువుల తయారీ ఇలా ప్రతి ఒక్క అంశంలో నిర్వహించిన పోటీల్లో నెగ్గుతూ జిల్లా దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటూ వస్తున్నది. తాజాగా 4 స్టార్ కేటగిరీలో జిల్లా జాతీయ కీర్తిని చాటింది.
ఫోర్ స్టార్ కేటగిరీలో ఇప్పటికే మూడు సార్లు ర్యాంకు..
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తు న్న స్వచ్ఛ పోటీల్లో ఇప్పటికే వరుసగా మూడుసార్లు జాతీ యస్థాయిలో ప్రథమ స్థానం లో నిలిచింది. 20, 21, 22 సంవత్సరాలలో వరుసగా మూ డుసార్లు జాతీయస్థాయిలో మొ దటి ర్యాంక్ సాధించి ప్రథమ స్థా నాన్ని కైవసం చేసుకున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 గత నవంబర్లో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా దేశంలోనే 4స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, తాజాగా అదే కేటగిరీలో 2003-డిసెంబర్లో ఇచ్చిన పారామీటర్లలోనూ ప్రథమస్థానాన్ని దక్కించుకున్నది. కరీంనగర్ జిల్లా ద్వితీయ, పెద్దపల్లి జిల్లా మూడో స్థానంలో నిలువగా, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా ఏ ఒక్క ఉమ్మడి జిల్లా మనతో పడలేక పోయింది.
స్వచ్ఛత, వైద్య సేవల్లో టాప్
కార్మిక, ధార్మికక్షేత్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో జిల్లా ఏరియా దవాఖానకు మంచి పేరుంది. పక్షపాతం, గుండె, కిడ్నీ లాంటి చికిత్సలకు గాంధీ, నిమ్స్ దవాఖాన వైద్యులతో వీడియో కా న్ఫరెన్స్ ద్వారా చికిత్సలు అందించడం లో ఏరియా దవాఖానకు జాతీయ స్థా యిలో కాయకల్ప అవార్డులు వరించా యి. మూడుసార్లు అందుకున్న అవార్డులతోపాటు 1.25కోట్ల పారితోషికాన్ని పొందింది. 2020, 21 సంవత్సరంలో జాతీయ స్థాయిలో కాయకల్పలో నంబర్ వన్ అవార్డుతోపాటు 50లక్షల నగదు ను అందుకున్నది. రెండు దఫాలుగా ప్రథ మ స్థానంలో నిలువగా, 2022లో ద్వితీ య స్థానంలో నిలిచింది. అందుకు 25 లక్షల పారితోషికాన్ని అందుకుంది. దవాఖాన వైద్య సేవలతోపాటు పారిశుధ్య నిర్వహణలోనూ భేష్ అనిపించుకున్నది.
జిల్లాకు గర్వకారణం..
రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛతలో 4స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో దేశంలోనే మొదటి స్థానంలో నిలువడం జిల్లాకు గర్వకారణం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వం, మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం పల్లె ప్రగతి, హరిత హారం లాంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తండాలను పంచాయతీలుగా మార్చడం వల్ల ప్రతి గ్రామం పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉంచడానికి సాధ్యపడింది. ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది నిర్విరామ కృషికి ప్రజల సహకారం తోడై ఈ ర్యాంకును సాధించడం అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్తులో కేంద్రం నిర్వహించే అన్ని ర్యాంకులలో మొదటి స్థానం సాధిస్తామని ఆకాంక్షిస్తున్నా.
– న్యాలకొండ అరుణ, జడ్పీ చైర్పర్సన్ (రాజన్న సిరిసిల్ల)
5 స్టార్ ర్యాంకింగ్లోనూ టాప్లో నిలుస్తాం
మంత్రి కేటీఆర్ నాయకత్వంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో పల్లె ప్రగతిని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం, ప్రజల సహకారం వల్ల గ్రామా లు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసి చెత్త సేకరణ వేగవంతంగా జరుగుతుంది. పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్ల నిర్వహణ, స్వచ్ఛతలో మన జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఎంపికైంది. ఇప్పటికే వరుసగా రెండు అవార్డులు దక్కించుకుని రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచాం. మూడోసారి కూడా ఫోర్స్టార్ ర్యాంకింగ్లోనూ టాప్లో నిలిచింది. భవిష్యత్తులో 5వ ర్యాంకింగ్లోనూ నంబర్వన్ సాధించే దిశగా అందరి సహకారంతో ముందుకెళ్తాం.
– యెనగందుల రవీందర్, డీపీవో (రాజన్న సిరిసిల్ల)
స్వచ్ఛ సర్వేక్షణ్లో బల్దియాకు గౌరవం..
కేంద్రం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్లో సిరిసిల్ల మున్సిపాలిటీ సైతం మూడు సార్లు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించింది. ఇంటింటా మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం, తడిచెత్త, పొడిచెత్తను పారిశుధ్య సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి సేకరించడం, జంక్షన్ల నిర్వహణ ఇలా ప్రతి అంశంలో కేంద్రం వద్ద మార్కులు కొట్టింది. 2018, 2019, 21లో వరుసగా మూడు సార్లు అందుకున్న ఏకైక మున్సిపాలిటీగా సిరిసిల్లగా పేరుతెచ్చుకున్నది. 50వేల జనాభాలోపు మున్సిపాల్టీలకు నిర్వహించిన పోటీలో వేములవాడ మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకున్నది.
కరీంనగర్ నంబర్ 2
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో కరీంనగర్ జిల్లా జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పారామీటర్ ఆధారంగా ఫోర్ స్టార్ కేటగిరీలో కరీంనగర్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. వచ్చే నెలలో మొదటి కేటగిరి చేరుకుని, ఫైవ్ స్టార్ రేటింగ్లో నిలుపుతామని జిల్లా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్లో పైపైకి..
పల్లె ప్రగతి ఇచ్చిన స్ఫూర్తితో కరీంనగర్ జిల్లా స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నది. 2018లో గంధగి ముక్త్ భారత్ (డర్టీ ఫ్రీ ఇండియా)లో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. కొన్ని గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్లు కూడా వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయి అవార్డులు సాధించాయి. ఇపుడు స్వచ్ఛ సర్వేక్షణ్లో కేటగిరీలో సైతం అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క గ్రామంలో వచ్చిన టెక్నికల్ సమస్య కారణంగా కరీంనగర్ జిల్లా డిసెంబర్లో రెండో స్థానానికి పరిమితమైందని, ఈ నెలలో పూర్తి స్థాయి గ్రామాల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా వచ్చే నెలలో ప్రథమ స్థానంలోకి వచ్చే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కింద ఫైవ్ స్టార్ కేటగిరీలో నిలిచే జిల్లాలకు ఈ యేడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జాతీయ స్థాయి అవార్డులు అందిస్తారు. ఈ కేటగిరీ కోసం కరీంనగర్ జిల్లా అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా జిల్లా ఇప్పటికే తీర్చిదిద్దబడిన నేపథ్యంలో ఫైవ్ స్టార్ కేటగిరీలో సులువుగా ప్రవేశించవచ్చని అధికారులు చెబుతున్నారు.
కరీంనగర్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఓడీఎఫ్ సాధించినప్పటి నుంచే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో ప్రత్యేకత చాటుకుంటూ వస్తున్నది. 2017లో కరీంనగర్ జిల్లాను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిని అమలు చేస్తున్నది. దీని కింద గ్రామాల్లో పారిశుధ్య, మురుగు నీరు, మరుగుదొడ్ల నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించింది. అంతే కాకుండా ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణకు ట్విన్ బాక్స్లు ఉచితంగా ఇచ్చింది. అంతే కాకుండా ప్రతి గ్రామంలో చెత్త మేనేజ్మెంట్ కోసం సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించింది. ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందించింది. దీంతో గ్రామాల్లో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రజలకు పూర్తి అవగాహన పెరిగింది. ఫలితంగానే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో కరీంనగర్ జిల్లా జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. డిసెంబర్లో జిల్లా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారంగా 99.68 స్కోర్తో ఈ హై అచీవ్మెంట్కు చేరుకుంది. వచ్చే నెలలో మొదటి కేటగిరి చేరుకుని, ఫైవ్ స్టార్ రేటింగ్లో నిలుపుతామని జిల్లా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మన జిల్లా అగ్రస్థానంలో నిలుస్తుంది
ఇప్పటికే కరీంనగర్కు ఫోర్ స్టార్ కేటగిరిలో రెండో స్థానం వచ్చింది. పురస్కారం సాధిం చేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటి నుంచే విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా ఫైవ్ స్టార్ కేటగిరీలో మొదటి స్థానంలో నిలుస్తామనే నమ్మకం మాకు ఉంది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచనలు, సలహాల మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్లో ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఫోర్ స్టార్ కేటగిరిలో మన ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్లనే ప్రథమ స్థానంలో ఉంది. వచ్చే నెలలో మన జిల్లా మరింత మెరుగైన స్థానంలోకి వెళ్తుంది. అంతిమంగా మన జిల్లాకే జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తుంది.
– ఎల్ శ్రీలతా రెడ్డి, డీఆర్డీవో (కరీంనగర్)
నిరంతర కృషికి నిదర్శనం..
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమంలో జిల్లా పంచాయతీ వింగ్ కూడా భాగస్వామ్యమై ఉంది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఆర్డీఓ ఎల్ శ్రీలతా రెడ్డి, డీపీఓ వీరబుచ్చయ్య, స్వచ్ఛ భారత్ జిల్లా కో ఆర్డినేటర్ రమేశ్తోపాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారుల నిరంతర కృషి ఫలితంగానే జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న జిల్లాకు జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తున్నది. తడి పొడి చెత్తను వేరు చేసి, తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసి స్థానిక పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలకు వాడుకోవడం, మిగిలిన ఎరువును స్థానిక రైతులకు విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకోవడం, మురుగు నీటి నిర్వహణ కోసం ఇంకుడు గుంతలు నిర్మించడం, కిచెన్ గార్డెన్స్ ప్రోత్సహించి నీటిని వాటికి మళ్లించడం, గ్రామాల్లో పారిశుధ్యాన్ని విజయవంతంగా నిర్వహించడం వంటి మూడు అంశాల్లో జాతీయ స్థాయిలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతున్నారు. ఇదంతా ఒక్కరి శ్రమతోనే కృషితోనే సాధ్యమయ్యే పనికాదని, సమిష్టి కృషి ఫలితంగానే ఇది సాధ్యమవుతున్నదని అధికారులు చెబుతున్నారు.
‘ఫైవ్ స్టార్ కేటగిరీ లక్ష్యం..
ఫైవ్ స్టార్ కేటగిరీ లక్ష్యంగా జిల్లా అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఫోర్ స్టార్ కేటగిరీలో రెండో స్థానంలో ఉన్న జిల్లాను అగ్రస్థానానికి చేర్చేందుకు కావల్సిన ప్రణాళికలు చేస్తున్నారు. అందులో భాగంగా కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ను ముమ్మరం చేశారు. పారిశుధ్యంపై అవగాహన కలిగే విధంగా ఇప్పటికే ప్రతి గ్రామంలో 8 చోట్ల వాల్ రైటింగ్ చేశారు. 23 రకాల పోస్టర్లు విడుదల చేసి విరివిగా ప్రచారం చేస్తున్నారు. 42 షార్ట్ ఫిల్మ్లు రూపొందించి సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోని మల్టీ పర్పస్ వర్కర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకా మండల స్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారులకు శిక్షణ ఇచ్చి స్వచ్ఛ సర్వేక్షన్లోని మూడు అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు ప్రణాళికలు వేశారు. ఇప్పటి నుంచి అక్టోబర్ దాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పెద్దపల్లి నంబర్ 3
పెద్దపల్లి, జనవరి 6 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా స్వచ్ఛతలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే నాలుగు సార్లు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించింది. స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్ -2018, స్వచ్ఛ సుందర్ సౌచాలయ్ -2019, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2019, స్వచ్ఛ దర్పణ్ ఫేజ్-3లో సత్తాచాటగా, తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్ 4స్టార్ కేటగిరీలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. నిజానికి పెద్దపల్లి జిల్లా ఓడీఎఫ్ సాధించినప్పటి నుంచే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో ప్రత్యేకత చాటుకుంటూ వస్తున్నది. గతంలోనే జిల్లాను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిని అమలు చేస్తున్నది. దీని కింద గ్రామాల్లో పారిశుధ్య, మురుగు నీరు, మరుగుదొడ్ల నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించింది. అంతే కాకుండా ఇంటింటికీ తడి, పొటి చెత్త సేకరణకు ట్విన్ బాక్స్లు ఉచితంగా ఇచ్చింది. అంతే కాకుండా ప్రతి గ్రామంలో చెత్త మేనేజ్మెంట్ కోసం సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించింది. ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందించింది. దీంతో గ్రామాల్లో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రజలకు పూర్తి అవగాహన పెరిగింది. ఫలితం గానే జాతీయస్థాయిలో పెద్దపల్లి జిల్లాకు మంచి గుర్తింపు వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్య క్రమ స్ఫూర్తితోనే జిల్లా జాతీయ స్థాయిలో హై అచీవ్మెంట్ను సాధించినట్లు అధికారులు చెబుతున్నారు.
మిగిలింది మూడు గ్రామాలే..
జిల్లాలో 266 గ్రామాలకు గానూ 263 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ ప్రకటించబడ్డాయి. రామగిరి మండలంలోని రాజాపూర్, పెద్దంపేట, వెంకట్రావ్పల్లి గ్రామాలను సింగరేణి సంస్థ పరిధిలో ఉండడంతో ఓడీఎఫ్ ప్లస్గా ప్రకటించడం కాస్తా ఆలస్యమవుతున్నదని అధికారులు చెబుతున్నారు. ఈ మూడు గ్రామాలను కూడా ఓడీఎఫ్ ప్లస్గా తీర్చిదిద్దితే జాతీయ స్థాయిలో జిల్లాకు మరోసారి అవార్డు దక్కనుంది. 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు ప్రకటించేందుకు ప్రతి నెలా జాతీయ రేటింగ్ను ప్రకటిస్తారు. అందులో భాగంగా 2022 డిసెంబర్లో ఫోర్ స్టార్ రేటింగ్లో జిల్లాకు మూడో స్థానం రావడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ కల సాకారం..
తెలంగాణలో ప్రతి పల్లె ఆదర్శంగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్ర మం ద్వారా పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదం పెరిగింది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టి చెందాలనే సీఎం కేసీఆర్ కల సాకారం అవుతుంది. ఇటీవల సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లాకు వచ్చిన సందర్భంలో ప్రతి గ్రామానికి 10 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చి మంజూరు చేశారు.
– పుట్ట మధూకర్, జడ్పీచైర్మన్ (పెద్దపల్లి)
సమష్టి కృషితోనే సాధ్యమైంది..
పెద్దపల్లి జిల్లా ఫోర్ స్టార్ కేటగిరిలో మూడో స్థానంలో నిలిచింది. తప్పకుండా ఫైవ్ స్టార్ కేటగిరీలో మొదటి స్థానంలో నిలుస్తామనే నమ్మకం మాకు ఉంది. ఇప్పటి నుంచే విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లా మూడు అవార్డులు సాధించింది. జిల్లాలో 266 గ్రామాలకు గానూ 263 జీపీలు ఓడీఎఫ్ ప్లస్గా ప్రకటించబడ్డాయి. మిగిలిన వాటిని కూడా త్వరలోనే ఓడీఎఫ్ ప్లస్ ప్రకటించేందుకు కృషి చేస్తాం.
– కుమార్ దీపక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (పెద్దపల్లి)