సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం
7300 కోట్లతో 26వేల బడుల్లో మౌలిక వసతుల కల్పన
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన
గండిహన్మాన్ ఆలయ ఆవరణలో కోదండరాముడి విగ్రహావిష్కరణ
కోరుట్ల, మెట్పల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు గృహప్రవేశాలు
నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరు
మల్కపేటలో ‘చల్మెడ జానకీదేవి’ పేరుతో పాఠశాల, వేములవాడలో కస్తూర్బా పాఠశాల భవనాలు, వైకుంఠధామం ప్రారంభం
చల్మెడ కుటుంబీకుల సేవలు స్ఫూర్తిదాయకమని కితాబు
విద్య, వైద్యరంగాల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాను మొదటిస్థానంలో నిలుపాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. 7300 కోట్లతో రాష్ట్రంలోని 26 వేల బడుల్లో మౌలిక వసతులు కల్పించనున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా కోరుట్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గాల్లో మరో ఇద్దరు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్తో కలిసి విస్తృతంగా పర్యటించారు. ముందుగా మెట్పల్లి మండలం బండలింగాపూర్ గండి హన్మాన్ ఆలయ ఆవరణలో కోదండ రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాలకు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి, మెట్పల్లిలో నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. అనంతరం కోనరావుపేట మండలం మల్కపేటలో ‘చల్మెడ జానకీదేవి’ పేరుతో నిర్మించిన పాఠశాల, వేములవాడలో కస్తూర్బా పాఠశాల భవనాలను, మూలవాగు సమీపంలో వైకుంఠధామాన్ని ప్రారంభించారు.
తెలంగాణలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదు.. సీఎం కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేదు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి అందించాలి. క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీలను వేసుకోవాలి. టీఆర్ఎస్ గట్టిగా ఉంటేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. గ్రామాల్లో జరుగుతున్న మంచి పనులను చూసి మెచ్చుకోలేక ఈర్ష్యతో సీఎం కేసీఆర్ను బద్నాం చేసేందుకు కొంత మంది లంగాలు, లఫంగగాళ్లు బిల్లులు వస్తలేవు అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయి లేదు. కేంద్రం నుంచి 1400 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఇప్పటికైనా దొంగ మాటలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలి.
– కోరుట్ల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్
వేములవాడ/ కోనరావుపేట, జూన్ 10: విద్య, వైద్యరంగాల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు 7300 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ పేరిట గొప్ప యజ్ఞానికి శ్రీకారంచుట్టారని పేర్కొన్నారు. అందులో భాగంగా 26 వేల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనున్నారన్నారు. శుక్రవారం మంత్రి వేములవాడ నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా మన ఊరు.. మన బడిలో భాగంగా మల్కపేటలో చల్మెడ జానకీదేవి ట్రస్ట్ ద్వారా 2కోట్లతో నిర్మించిన పాఠశాలను దాత చల్మెడ ఆనందరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకొనేందుకు కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మారుమూల పల్లె మల్కపేటలో పుట్టిన చల్మెడ ఆనందరావు కుటుంబీకులు వ్యాపారంలో ఎంతో ఎత్తుకు ఎదిగినా పురిటిగడ్డపై మమకారంతో సకల హంగులతో స్కూల్ భవనాన్ని నిర్మించడం స్ఫూర్తిదాయకమన్నారు.
‘మన ఊరు-మన బడి’ కింద రూపుదిద్దుకున్న తొలిస్కూల్ మల్కపేట కావడం గర్వకారణమన్నారు. జిల్లా విద్యాధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి ఆంగ్లమాధ్యమంలో మెరుగైన విద్యనందేలా చూడాలని సూచించారు. స్కూల్ను నిర్మించిన స్ఫూర్తితో చల్మెడ కుటుంబీకులు చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. వారిని ఆదర్శంగా తీసుకొని జన్మభూమికి సేవలందించాలని ఎన్ఆర్ఐలను కోరారు. తాను కూడా నానమ్మ గారి ఊరు కామారెడ్డి జిల్లా కోనాపూర్లో 2కోట్ల తో బడిని నిర్మిస్తున్నానని చెప్పారు. అమ్మమ్మ ఊరు కొదురుపాకకు కూడా సేవ చేస్తానని స్పష్టం చేశారు. తాను ఇటీవల విదేశాల్లో పర్యటించినపుడు అనేకమంది ఎన్ఆర్ఐలు పుట్టిన ఊర్లలోని బడుల బాగుకు ముందుకు వచ్చారని తెలిపారు. 2లక్షల నుంచి 50లక్షల వరకు ఇచ్చేందుకు సమ్మతించారని చెప్పారు.
నిధులివ్వకుండా రాష్ట్రంపై కక్ష
గ్రామాల్లో సాధించిన ప్రగతిని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా దేశానికి పేరు తెచ్చిన కాళేశ్వరం గురించి ఏ ఒక్క రోజైనా మన్కీ బాత్లో ప్రధాని మోదీ ఒక్క సారైనా ప్రస్తావించారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమంలో గుజరాత్ను మించిపోతుందనే కడుపు మంటతో నిధులు ఇవ్వకుండా తెలంగాణ మీద కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు. కులం, మతాల మధ్య చిచ్చుపెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకునే చిల్లర రాజకీయాలు కాదని, దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడుదామని, అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
బీజేపీ నేతలు ఒక్క గుడైనా కట్టారా..?
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తాను సొంతంగా 80 లక్షలతో కోదండ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, మతం పేరిట రాజయం చేసే బీజేపీ నాయకులు ఎవరైనా సొంత ఖర్చులతో ఒక్క గుడినైనా కట్టారా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదని, మనమే కేంద్రానికి ఇస్తున్నామని చెప్పారు. సిగ్గు, శరం, మానం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలల రూపు రేఖలు వచ్చే ఏడాదిన్నర కాలంలో మార్చబోతున్నామని, విద్యా యజ్ఞం కొనసాగుతుందన్నారు. తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారని, కోరుట్ల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో టీఆర్ఎస్ను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
త్వరలోనే నియోజకవర్గానికి సీఎం కేసీఆర్..
వేములవాడ నియోజకవర్గంలో త్వరలోనే సీఎం కేసీఆర్ పర్యటిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తికాగానే సీఎంతో ప్రారంభిస్తామన్నారు. జులై లేదా ఆగస్టులో ఆయన పర్యటన ఉండే అవకాశమున్నదని వెల్లడించారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పారు. మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం పరిశ్రమలను నెలకొల్పేందుకు సంస్థలతో మాట్లాడుతున్నామన్నారు.
ఎస్సారార్ రిజర్వాయర్ వద్ద ఆక్వా పరిశ్రమ
మెట్ట ప్రాంతానికి వరప్రదాయినిగా పిలువబడే శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ వద్ద మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేలా ఆక్వా పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే కొన్ని సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. రిజర్వాయర్ నిర్వాసిత యువత, మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈప్రాంతంలో అహార ఉత్పత్తులు, మరిన్ని ప్రాజెక్టుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 250 మంది స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఈ రోజు ఒప్పందం కుదుర్చుకున్న దక్కన్ అగ్రి రిసోర్సెస్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ మంతెన సుబ్బరాజు, పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణభాస్కర్ను అభినందించారు.
వేములవాడలో అభివృద్ధి పనులు ప్రారంభం
మంత్రి కేటీఆర్ వేములవాడలో 3.35కోట్ల తో నిర్మించిన కస్తూర్బా పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. రెండో బైపాస్ రహదారిలో 3కోట్లతో నిర్మించిన వైకుంఠధామాన్ని ఆయన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ చంద్రయ్య, సర్పంచ్ ఆరె లత, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, పరిశ్రమలశాఖ కమిషనర్ కృష్ణభాస్కర్, కలెక్టర్ అనురాగ్జయంతి, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, బల్దియా కమిషనర్ శ్యామ్సుందర్ రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంతెన సంతోష్, మాజీ మంత్రి చెల్మడ ఆనందరావు, చల్మెడ వైద్యవిజాన సంస్థ చైర్మన్ లక్ష్మీనరసింహారావు, పార్టీ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, కౌన్సిలర్లు ఉన్నారు.
కోనరావుపేట మండలం మల్కపేటలో జానకీదేవి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్, ఈశ్వర్, ఎమ్మెల్యేలు రమేశ్బాబు, రవిశంకర్, చల్మెడ ఆనందరావు, చల్మెడ లక్ష్మీనరసింహారావు తదితరులు
వేములవాడ వైకుంఠధామం ప్రారంభించిన అనంతరం శివుడి విగ్రహం వద్ద..
దాతలు ముందుకురావాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పురోగమిస్తున్నది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకవచ్చేందుకు ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టారు. దీని కింద ఈ యేడాది 35శాతం పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. చల్మెడ ఆనందరావు గొప్పగా పాఠశాలను నిర్మించి నిరుపేదలకు మెరుగైన విద్యనందించేందుకు ముందుకురావడం అభినందనీయం. వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు దాతలు ముందుకురావాలి.
-మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ వైపు చూస్తున్నారు
దేశంలోనే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వైపు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతోపాటు అనేక రాష్ర్టాలు చూస్తున్నాయి. తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలు తమకెందుకు అమలు కావడం లేదని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం తమని తెలంగాణలో కలపాలని మహారాష్ట్రకు చెందిన అనేక గ్రామాల సర్పంచులు, ప్రజలు అడుగుతున్నారు. ఆదర్శ గ్రామాలుగా ఇటీవల కేంద్రం ప్రకటించిన పదింటికి పది గ్రామాలు తెలంగాణ రాష్ర్టానివే. ప్రతి పట్టణం హైదరాబాద్లా తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతున్నది. 2.50 లక్షల కోట్ల ఎగుమతులకు ఐటీ పెరిగింది. దేశ విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలను పిలిపించి రాష్ట్రంలో 19 వేల పరిశ్రమలు, 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించి 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడం అభివృద్ధి కాదా..? ఇది కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలియదా..? మారుమూల ప్రాంతం మెట్లచిట్టాపూర్ లో మంత్రి కేటీఆర్ చొరవతో రెండు ఇథనాల్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రతి కార్యకర్త గర్వంగా చేప్పుకునే విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు.
– రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
భవిష్యత్తరాల కోసమే బడుల బాగు
ముఖ్యమంత్రి కేసీఆర్.. భవిష్యత్ తరాల కోసమే బడుల బాగుకు సంకల్పించారు. ‘మన ఊరు- మనబడి’లో భాగంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం అభినందనీయం. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీటి వనరులు పెరిగిపోయి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం గ్రామాల్లో వడ్లు ఎండబోసేందుకు స్థలాలు దొరక్కపోవడమే ఇందుకు నిదర్శనం. ఇండో జర్మనీ పథకం ద్వారా అనేక గ్రామాల్లో తాగునీరు, విద్య మౌలిక వసతులు కల్పించాం.
– ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు
పుట్టినగడ్డ రుణం తీర్చుకునే అవకాశం రావడం అదృష్టం..
జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. సీఎం కేసీఆర్ తలపెట్టిన ‘మన ఊరు.. మన బడి’లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు నాణ్యమైన ఆంగ్ల విద్య అందించే అవకాశం రావడం గొప్ప విషయం. జ్ఞానం ఉన్న వ్యక్తికి ప్రపంచం తలవంచుతుంది. ఇంత గొప్ప కార్యక్రమంలో మా కుటుంబం భాగస్వామ్యం కావడం పూర్వ జన్మ సుకృతం. ఇతర ప్రాంతాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. చల్మెడ ఆరోగ్య వైద్యసంస్థ ద్వారా ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. – చల్మెడ వైద్యవిజాన సంస్థ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహరావు
మా ఊరు బడికి మంచి పేరు రావాలి
మా ఊరు బడిలో మంచి ఉపాధ్యాయులను నియమించాలి. నాణ్యమైన విద్యనందించాలి. మల్కపేట బడి మంచి పేరు రావాలి. ఇందుకు మంత్రి కేటీఆర్ సహకరించాలి.
– మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు
మంత్రి కేటీఆర్ పర్యటన సాగిందిలా..
మెట్పల్లి/వేములవాడ/కోనరావుపేట, జూన్10: ఉదయం హెలీకాప్టర్లో బేగంపేట విమనాశ్రయం నుంచి బయలుదేరి 10.11 గంటలకు మెట్పల్లి మినీ స్టేడియానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, తదితర నాయకులు మంత్రి కేటీఆర్కు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా మెట్పల్లి మండలం బండలింగాపూర్ శివారులోని గండిహన్మాన్ ఆలయం ఆవరణలో 56 అడుగుల కోదండరాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మెట్పల్లి శివారులోని అర్బన్హౌసింగ్కాలనీలో నిర్మించిన 110 డబుల్ ఇండ్ల సముదాయం, కోరుట్ల పట్టణ శివారులో నిర్మించిన 80 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. కొద్ది సేపు లబ్ధిదారులతో ముచ్చటించారు. అక్కడి నుంచి మెట్పల్లికి చేరుకుని వెంకట్రెడ్డి గార్డెన్స్లో ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వీఆర్ఎం గార్డెన్స్లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి లంచ్ చేశారు. తిరిగి పట్టణంలోని తన క్లాస్మేట్ జాన్సన్ రాథోర్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.06 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి రోడ్డు మార్గంలో వెళ్లి ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా చల్మెడ జానకీదేవి ట్రస్టు ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో ఆధునిక హంగులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తర్వాత వేములవాడకు చేరుకుని రూ.3 కోట్లతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని, రూ.3.35 కోట్లతో నిర్మించిన కస్తూర్బా పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.