సంప్రోక్షణ కార్యక్రమాల్లో మంత్రులు కొప్పుల, గంగుల
హాజరైన ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
యాదాద్రి లక్ష్మీనృసింహుడి సేవలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తరించారు. దివ్య క్షేత్ర పునఃప్రారంభ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, కోరుకంటి చంర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు కవిత, భానుప్రసాద్రావు పాలుపంచుకున్నారు.
కార్పొరేషన్/ గోదావరిఖని, మార్చి 28 : యాదాద్రి దివ్యక్షేత్ర పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఆలయ ఏడు ద్వారాల్లో ఒక్కటైన ఉత్తర రాజగోపురానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, తూర్పు రాజగోపురానికి (త్రితల గోపురంపై) కలశాల సంప్రోక్షణ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ఎంతో నిష్ట, నిబద్దతతో ఏకకృష్ణశిలపై అద్భుత శిల్పకళా వైభవంతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించడం సీఎం కేసీఆర్కే సాధ్యమైందన్నారు. దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. ఆలయ మహా కుంభ సంప్రోక్షణకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై ఆలయ శిఖర స్వర్ణ కలశానికి సంప్రోక్షణ చేశారు. ఇల వైకుంఠపురాన్ని తలపిస్తున్న సువర్ణ యాదాద్రిని చూడడానికి రెండు కళ్లు చాలవనీ, జీవితంలో ఒక్కసారైనా దర్శించుకొని తీరాలని సూచించారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు. మన కోసమే జన్మించిన కారణ జన్ముడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.