కరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : సర్కారు స్కూళ్లకు సకల హంగులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’, ‘మన బస్తీ.. మన బడి’ కింద సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించారు. దశాల వారీగా 12 రకాల పనులు చేసి అభివృద్ధి చేశారు. ఆ స్కూళ్లను బుధవారం పండుగ వాతారణంలో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభించారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అధునాతన హంగులతో తీరిదిద్దిన కేజీ టూ పీజీ క్యాంపస్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ కర్ణన్, మేయర్ సునీల్రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్, గణేశ్నగర్ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, చొప్పదండి మండలం రాగంపేటలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కేశవపట్నం, మానకొండూర్ మండలం చెంజర్ల, నిజాయితీగూడెంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,
చిగురుమామిడి మండలం సుందరిగిరిలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలోని పాఠశాలలను సీఈవో ప్రియాంకతో కలిసి జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అంకురార్పణ ప్రారంభించారు. అలాగే వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం జోగాపూర్లో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కుసుమరామయ్య పాఠశాలతోపాటు గంభీరావుపేట మండలంలోని గజసింగవరం, ముచ్చర్ల గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల భవనాలను న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ను ఎమ్మెల్యే సంజయ్కుమార్ అంకురార్పణ చేశారు.