తెలంగాణ సర్కారు తెచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం నిరుపేద పిల్లల ఆరోగ్యానికి వరంలా మారుతున్నది. సర్కారు స్కూళ్లలో ప్రతిరోజూ తీరొక్క టిఫిన్ పెడుతుండడంతో విద్యార్థులు నిశ్చింతగా చదువుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీం విజయవంతంగా అమలవుతుండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. మానవతా దృక్పథంతో ఈ విప్లవాత్మక పథకానికి అంకురార్పణ చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నారు.
స్కూల్లో అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉన్నది. రోజూ పొద్దున లేచి రెడీ అయ్యి ఇంటి దగ్గర టిఫిన్ చేసి స్కూల్కు వచ్చేసరికి ఆలస్యమయ్యేది. పాఠశాలకు ఆలస్యమవుతుందని భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు పొద్దున ఇంటి వద్ద రెడీ అయ్యి స్కూల్కు వచ్చి టిఫిన్ చేయచ్చు. మా అమ్మకు శ్రమ తప్పింది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
-పెర్క బాలాజీ, 5వ తరగతి, ప్రైమరీ స్కూల్ (పెద్దపల్లి కమాన్)
మా స్కూల్లో ఇడ్లీ సాంబార్ బ్రేక్ఫాస్ట్ పెట్టిన్రు. తిన్నా బాగుంది. స్కూల్ సెలవు రోజైన ఆదివారం మాత్రమే ఇంట్లో తింటాం. ఇప్పుడు రోజూ స్కూల్లో పెడుతరు. ఆరు రోజులు ఆరు రకాల బ్రేక్ఫాస్ట్ పెడుతారని మా హెచ్ఎం సార్ చెప్పిన్రు. మాకు ప్లేట్, గ్లాస్ కూడా ఇచ్చిన్రు. ఇక నుంచి నేను స్కూల్కు రెగ్యూలర్గా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ మంచిగా చదువుకుంట.
– ఎండీ హజ్ర, నాలుగో తరగతి, ఎంపీఎస్, రామగుండం(జ్యోతినగర్)
మా లాంటి పేద విద్యార్థుల ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఉదయం ఆకలితో వచ్చి చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉండేది. చదువు చెప్పినా ఆకలికి అర్థం అయ్యేది కాదు. అల్పాహారం చేసి చదువుకోవడం వల్ల చక్కగా అర్థం చేసుకోవచ్చు. వేరే ధ్యాస లేకుండా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు చేకూరనున్నది. నేను ఇక చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటా. ఆకలి తీర్చుతున్న సీఎం సారుకు కృతజ్ఞతలు.
నాకు ఇద్దరు పిల్లలు. పెద్దపల్లిలోని అమర్నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నరు. నేను షాపు నడుపుకుంటున్నా. రోజు పొద్దున లేచి పిల్లలను రెడీ చేసి, వంట చేసి వారిని స్కూల్కు పంపించేసరికి ఆలస్యమయ్యేది. అప్పుడప్పుడు పిల్లలు పస్తులతోటి బడికి వెళ్లేవాళ్లు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన అల్పాహారం పథకంతో మా పిల్లలకు ప్రతిరోజూ కడుపునిండుతది. ప్రతిరోజూ సమయానికి స్కూల్కు వెళ్లి, టిఫిన్ చేసి చక్కగా చదువుకుంటరు. ఇంత మంచి నిర్ణయం తీసుకుని, పిల్లల ఆకలి తీర్చుతున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం..
– జవాజి పద్మ, విద్యార్థి తల్లి, రంగంపల్లి,
పస్తులుంటూ పాఠాలు వింటున్న నిరుపేద విద్యార్థుల కడుపునింపేందుకు సర్కారు తెచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ స్కీం సత్ఫలితాలనిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకో రుచికరమైన టిఫిన్ పెడుతుండడంతో ఏకాగ్రతతో చదువుకొనే అవకాశం కలుగుతున్నది. కూలీనాలీ చేసుకొని బతుకుతున్న తమ పిల్లలకు ప్రభుత్వం అల్పాహారం అందించడం గొప్పవిషయమని తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. పొద్దటి పూటనే తండ్రిలాగా తమ బిడ్డల ఆకలితీరుస్తున్న సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటామని చెబుతున్నది.
– హుజూరాబాద్టౌన్/ మానకొండూర్/ గంగాధర, అక్టోబర్ 8
విద్యార్థులు అంటే సీఎం కేసీఆర్కు ఎంతో ప్రేమ. గత పాలకులు ఏనాడూ కూడా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే ధ్యాస లేకుండే. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. విద్యార్థులకు కావల్సిన మౌళిక వసతులతో పాటు సన్న బియ్యం భోజనం, యూనిఫాం, నోట్ బుక్కులు, వర్క్ బుక్లతో పాటు కావల్సిన సామగ్రిని అందిస్తున్నారు. ఉదయం పూట ప్రత్యేక అల్పాహారం అందిస్తుండడం అభినందనీయం. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పోషకాహార లోపం ఏర్పడకుండా బలవర్ధకమైన అల్పాహారం అందించడం కేసీఆర్ సారు గొప్ప గుణానికి నిదర్శనం. బడి పిల్లల కోసం ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేయడం ఆనందదాయకం. బడి మానేసిన పిల్లలు కూడా స్కూల్కు వచ్చేలా పథకాలు ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దయవల్ల కేసీఆర్ సారు నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలి. మళ్లీ ఆయనే సీఎంగా రాష్ర్టాన్ని పాలించాలని స్వామివారిని కోరుకుంటున్న.
– దీటి లక్ష్మణ్, కమలాపూర్, ధర్మపురి
ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి పథకాల ను తెచ్చుడు సీఎం కేసీఆర్ సారుకే సాధ్యమైతది. నా బిడ్డ గంగాధర మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదు వుతోంది. పాఠశాలలో మంచిగా చదువు చెపుతు న్నారు. అంతే కాకుండా మధ్యాహ్నం భోజనం చక్కగా వడ్డిస్తున్నారు. ఇప్పుడు మళ్ల పొద్దునే టిఫిన్ పెడుతుండ్లు. పిల్లల గురించి ఇంత మంచిగ ఆలోచించేటోళ్లు ఇంకెవ్వరు ఉండరు. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మా సర్కారు బడిల ఇసొంటివి ఏం లేకుండె. మా పిల్లల గురించి సక్కటి ఆలోచలు చేస్తున్న కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– పంది సంపత్, మధురానగర్(గంగాధర)
మా చదువుల కోసం గొప్పగా ఆలోచన చేసి బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ తాతకు థాంక్యూ.. నేను కాకర్లపల్లి గవర్నమెంట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న. మాకు ఇంటి వద్ద పొద్దున టిఫిన్ ఉండదు. బాగా చదువుకోవాలంటే కడుపునిండా అన్నం తినాలి. అందుకోసం మాలాంటి వాళ్ల కోసం స్కూళ్లనే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నరు. ఇప్పుడు కండుపునిండా తిని చక్కగా చదువుకుంటం..
– శివాని, విద్యార్థిని, కాకర్లపల్లి, (మంథనిరూరల్)
రోజు ఉదయం ఆకలి కడుపుతో బడికి వచ్చి మధ్యాహ్న భోజనం వరకు ఉండాలంటే కడుపులో ఎలుకలు తిరిగేవి. ఆఖరికి చదువు కూడా మెదడుకు ఎకేది కాదు. అలాంటి సమయంలో సీఎం కేసీఆర్ సారు పిల్లల కష్టాలను గుర్తించి ఉదయం అల్పాహారం పెట్టి చదువుకోవాలని ప్రోత్సహించడం చాలా బాగుంది. అడగకుండానే మా ఇబ్బందులను గుర్తించి ఆకలి తీర్చుతున్న సీఎం కేసీఆర్ సార్కు చాలా థాంక్స్.
– బొక ఇందుశ్రీ, పదో తరగతి, జడ్పీహెచ్ఎస్ (హుజూరాబాద్)
కొడుకు చదువు కోసం జగిత్యాల పట్టణానికి వచ్చి జీవనం గడుపుతున్నాం. నా భర్త అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటుండు. నేను హోటల్లో పని చేసి ఇల్లు ఎళ్లదీస్తున్న. నా కొడుకు చదువుకొని గొప్పవాడు కావాలని ఈ కష్టం చేస్తున్నా. ఉదయం పూట కొడుకుకు టిఫిన్ పెట్టే భాగ్యం మాకు లేదు. రాత్రి అన్నం మిగిలితేనే మర్లేసి పెట్టే దాన్ని. ఒక్కో రోజు ఖాళీ కడుపుతో స్కూల్కు వెళ్లేవాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అల్పాహార పథకంలో మా కొడుకు రోజు టిఫిన్ తినే భాగ్యం కలిగింది. మధ్యాహ్నం స్కూల్లోనే అన్నం పెడుతున్నరు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.
– చెవులమద్ది శ్యామల, గొల్లపల్లి
ఉదయం స్కూల్ వెళ్లే సమయానికి ఇంట్లో టిఫిన్ అయ్యేది కాదు. ప్రతి రోజు అమ్మ ఇంటి పనులు పూర్తి చేసుకొని వంట పనులు ప్రారంభించడానికి తొమ్మిది అవుతుంది. మా స్కూల్ టైం 9.30. నేను 9 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లాలి. దీంతో ఉదయం ఏమీ తినకుండా స్కూల్కు వెళ్లేవాడిని. 10 గంటల వరకు ఏమైనా తింటే బాగుండు అనిపిస్తుంది. కాని మధ్యాహ్న ఒంటి గంట వరకు ఏం తినరాదు. దీంతో చదువుపై శ్రద్ధ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సీఎం బ్రేక్ఫాస్ట్తో కడుపునిండా తింటున్న. ఇక మంచిగా చదువుకుంట.
– భూక్యా అరవింద్, 7వ తరగతి (ప్రభుత్వ పాఠశాల, సూరంపేట కొడిమ్యాల)
మాలాంటి పేద కుటుంబాల నుంచి స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు ఉదయం పూట టైంకు టిఫిన్ ఇవ్వడం చాలా క ష్టం అవుతుండె. నేను టైలరింగ్ పని చే స్తుంట. నాకు పని ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి టైంల మా పిల్లలకు అన్నం అందించడం లేటవుతుండె. అలాగే, రోజూ ఏదో ఒక వెరైటీ చేసి పెట్టే స్థోమత మాకు లేదు. సీఎం కేసీఆర్ సార్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నరు. మాలాంటి పేదల ఇండ్లలో ఉడికిన అన్నం, రాత్రి మిగిలిన కూరలతో బడికి వచ్చే సమయానికి పిల్లలకి పెడుతుంటం. కానీ, కేసీఆర్ సార్ రోజుకో రకం అల్పాహారం మా పిల్లలకు ఇస్తున్నరు.