స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలిచింది. తెలంగాణ వస్తే రాష్ట్రం అధోగతే అన్న సీమాంధ్ర పాలకుల నోళ్లు కేసీఆర్ పాలనలో మూగబోయాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు షర్మిలను ఉసిగొల్పి తెలంగాణను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్నాయి. దీనిని ప్రజలు గుర్తించాలి. షర్మిలది తెలంగాణ క్షేత్రం కాదు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి తెలంగాణలో స్థానం లేదు.. ఏపీలో రాజకీయం చేసుకోవాలి. ఆమె తెలంగాణ సమస్యలపై బీజేపీని ఏనాడైనా నిలదీసిందా..? మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ పబ్బం గడుపుతోంది. అలాంటి మతతత్వ పార్టీలను తిప్పికొట్టాలి. బండి సంజయ్ ఎంపీగా జిల్లాకు ఏం చేశాడో చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధిపై ఆ పార్టీల నేతలు దమ్ముంటే చర్చకు రావాలి.
– టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
శంకరపట్నం, డిసెంబర్ 1 : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలో నంబర్వన్గా నిలుస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శంకరపట్నం మండలం గొల్లపల్లి శివారులోని వీఎస్ఆర్ గార్డెన్లో గురువారం ‘టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వినోద్ కుమార్ హాజరై, మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు లేని సోయి కేసీఆర్కు ఉండడం వల్లే నేడు రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై పల్లెల్లో చర్చ జరపాలన్నారు. టీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరూ మన రాష్ట్రంతోపాటు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు పర్యటించాలని అక్కడికి ఇక్కడికి తేడా గుర్తించాలని సూచించారు. తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే బస్తీ, పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నట్లు తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాల్లో నాయకులు, కార్యకర్తలు అన్ని అంశాలపై అరమరికలు లేకుండా మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉందని, ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో వినోద్కుమార్, రసమయి బాలకిషన్ను సన్మానించారు.
ఆత్మీయ సమ్మేళనం సక్సెస్ అయింది. టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివరావడంతో వీఎస్ఆర్ గార్డెన్లో సందడి కనిపించింది. ముందుగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ శంకరపట్నం మండల కేంద్రానికి వచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఒగ్గు డోలు కళాకారుల ప్రదర్శనల మధ్య హోరెత్తించే డీజే సౌండ్ సిస్టమ్తో కార్యకర్తలు నృత్యం చేస్తూ, పటాకులు కాలుస్తూ స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను జీవీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత వీఎస్ఆర్ గార్డెన్ వరకు వందలాది బైకులతో ర్యాలీగా చేరుకున్నారు. దారిపొడవునా నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకొని నినాదాలతో హోరెత్తించారు. ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా మౌనం పాటించారు. ఆ తర్వాత సాంస్కృతిక కళా బృందం నృత్యం అలరించగా, రసమయి, జీవీఆర్, విజయ, నాయకులు నృత్యం చేసి హుషారెత్తించారు. సమావేశంలో ఎంపీపీ సరోజన, జడ్పీటీసీలు శ్రీనివాస్రెడ్డి, శేఖర్గౌడ్, వైస్ ఎంపీపీ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సర్పంచుల ఫోరం చైర్మన్ సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.
దేశ చరిత్రలో గొప్ప సీఎంగా కేసీఆర్ పేరు నిలుస్తుంది. పాటతో మొదలైన నా ఉద్యమ ప్రస్థానం తెరచిన పుస్తకం. చప్పట్లను దరువుగా చేసుకుని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగా. నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నా. 40 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు సీఎం కేసీఆర్ ఇచ్చేదాకా 2 వేల పింఛన్ ఎందుకు గుర్తుకు రాలేదు. ప్రతి దళిత కుటుంబంలో 10 లక్షలు ఇస్తూ వెలుగు రేఖలు పూయిస్తున్న మహోన్నతుడు కేసీఆర్. ప్రభుత్వం త్వరలో సొంత జాగా ఉన్న వారికి నియోజకవర్గానికి 500 ఇండ్లు కట్టిస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్లు రోజుకో తీరున కొత్త బిచ్చగాళ్ల అవతారం ఎత్తుతున్నాయి. ప్రజలకు ఏమీ చేయనివారే ఎగిరెగిరి పడుతున్నారు. బండి సంజయ్ ఎంపీగా జిల్లాకు ఏకాణా కూడా తేలేదు. ఈ విషయంపై ప్రజల్లో చర్చ జరుగాలి. ప్రస్తుతం దేశానికి విజన్ కలిగిన నేత పీఎం కావాలి. ఆ లక్షణాలు కేవలం కేసీఆర్కు మాత్రమే ఉన్నాయి.
– మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కొన్ని పార్టీల నాయకులు తోడేళ్లు, రాబందుల్లా గ్రామాల్లో పడి తిరుగుతున్నారు. వారిని ప్రజలు దరి చేరనీయద్దు. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ, అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఆదరించాలి. మానకొండూర్ నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేస్తున్న ఎమ్మెల్యే రసమయిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలి.
– జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి ధూంధాం కార్యక్రమాలతో పాటు ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ముందుంటున్నారు. కార్యకర్తల గుండెల్లో రసమయి నిలిచి ఉంటా రు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన కార్యకర్తలు, నాయకులను ఒక్కసారి చూడాలి. రసమయిపైకి గూండాలను ఉసిగొల్పిన పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం బండి సంజయ్ దత్తత తీసుకోవాల్సిన ఖర్మ ఇక్కడి ప్రజలకు ఏంటి?. అందుకోసం బీజేపీ నాయకుడే రావాలా? ఇక్కడి ప్రజలకు ఆమాత్రం హిందూ ధర్మం కాపాడుకునే విషయం తెలియదా? టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా మారి అభివృద్ధి నిరోధకులను తరిమి తరిమి కొట్టాలి. కార్యకర్తలు, నాయకులతో మనసు విప్పి మాట్లాడుకోవడానికే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాం.
– టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు