ధర్మపురి/వెల్గటూర్, అక్టోబర్ 21: అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేశారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధ్దంగా సర్కారు బడులు, కళాశాలలను అభివృద్ధి చేయడంతోనే విద్యారంగంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. శుక్రవారం ధర్మపురిలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ అయిన ధర్మపురిలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ధర్మపురిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులో రూ. 2 కోట్ల పెండింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఎంపీ వెంకటేశ్నేతకానితో కలిసి ఎండపల్లిలో తహసీల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు.
తెలంగాణ సర్కారు సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నదన్నారు. తెలంగాణలో ప్రైవేటుకు దీటుగా సర్కారు విద్య అందుతున్నదన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు దొరకని పరిస్థితి నెలకొన్నదన్నారు. ధర్మపురిలో ప్రారంభించిన డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో 900 మంది విద్యార్థులు విద్యనభ్యసించే అవకాశం ఉందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. బీసీ వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యనందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారన్నారు. ధర్మపురిక్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి ఈశ్వర్ పేర్కొన్నారు. పట్టణంలో రూ.4 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను త్వరలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో ప్రారంభించుకుంటామన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. చిన్న రాష్ర్టాల ప్రదాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా రాష్ర్టాన్ని ఏర్పాటు చేసుకుని పాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి 10 జిల్లాలను 33గా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. ఎండపల్లి మండలం 35 ఏండ్ల క్రితం ఏర్పాటు కావాల్సిందని, అప్పటి చిరకాల వాంఛ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ సహకారంతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఎనిమిదేండ్లలో దేశంలోని 29 రాష్ర్టాల్లో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగిందన్నారు. వచ్చిన అనేక అవార్డులే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. ఎంపీ వెంకటేశ్నేతకాని మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో, ఆయన ఆలోచనలతో తెలంగాణలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరిగాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి రానున్నదన్నారు. ఇచ్చిన హామీ మేరకు మంత్రి కొప్పుల ఎండపల్లి మండలాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు.
జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఎండపల్లి మండలంలో నేటి నుంచి భూముల రిజిస్ట్రేషన్, ఇతర రెవెన్యూ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ఎండపల్లి తహసీల్దార్గా ఉదయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఎండపల్లిలో మంత్రి, ఇతర నాయకులకు బైక్ ర్యాలీ, ఒగ్గు డోలు, డప్పు కళాకారులు, బతుకమ్మలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ రవి, అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, బీఎస్ లత, ఆర్డీవో మాధురి, డీసీఎమ్మెస్ చైర్మన్ డా. శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, డీఎండబ్ల్యూవో సాయిబాబ, సంక్షేమశాఖ జిల్లా కన్వీనర్లు వెంకటరమణ, సుస్మిత్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జక్కని రాజేశం, మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ సంజుద బేగం, ఆర్ఎల్సీ హమీద్, విజిలెన్స్ అధికారి అక్రమ్, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఎంపీపీలు బాదినేని రాజమణి, కునమల్ల లక్ష్మి, వ్యాళ్ల అనసూర్య, ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీలు బొడ్డు సుధారాణి, కందుల సంధ్యారాణి, సర్పంచ్ మారం జలేంధర్ రెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు పొనుగోటి శ్రీనివాస రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు గూడ రాంరెడ్డి, రత్నాకర్ పాల్గొన్నారు.