కరీంనగర్ కోర్టు చౌరస్తా, ఫిబ్రవరి 17: పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టు విధులను బాధ్యతగా నిర్వర్తించాలని, కేసుల విచారణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వింజమూరి వెంకటేశ్వర్లు సూచించారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆదేశాల మేరకు శనివారం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో ఉమ్మడి జిల్లా వ్యాప్త పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కొత్త చట్టాలపై పోలీస్ అధికారుల రివ్యూ సమావేశాల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం పలువురు ప్రాసిక్యూటర్లు వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా వాటికి సలహాలు, సూచనలు అందించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి రెడ్డి ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాల గురించి వివరించారు. ఈ సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జంగిలి మల్లికార్జున్, బాల త్రిపుర సుందరి, ఆరెల్లి రాములు, జూలూరు శ్రీరాములు, గౌరు రాజిరెడ్డి, గడ్డం లక్ష్మణ్, శరత్, కాసారం మల్లేశం, మురళీధర్రావు, వసంతతోపాటు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.